“కృకీలు”

August 24, 2007 at 6:11 PM (కృకీలు)

min1.jpg

మనసు తలుపు తడితే
      నువ్వే తెరుస్తున్నావు
మూసి గడియ పెడితే
      నువ్వే తడుతున్నావు.

Permalink 6 Comments

“సమ్మె చేద్దాం రండి”

August 24, 2007 at 2:27 PM (మనసులో మాట)

dog.jpg 

    ఒకానొక  తీరిక సమయములో ఓ కుడిచేయి,పక్కనే ఉన్న ఎడమచేయి మాటా మంతీ లాడుకుంటుంటే, మాటల మధ్యలో “ముఫై రెండు పళ్ళ  నోటి” గురించి  ప్రస్తాపన వచ్చి రెండిటి మధ్యా చర్చ మొదలైంది. మనిద్దరమూ రెండుచేతులా సంపాదిస్తుంటే ఆ నోరు మొత్తం  ఒక్కటే తినేసి  మన ముందు ఫొజులు కొడుతుంది. మనం “పంచభక్షపరమాన్నాలు” దానికిస్తున్నా అది మాత్రం మనకి  నాలుగు “ఎంగిలి” మెతుకులు మిగులుస్తుంది. చివరకు వాటిని కూడా ఆ వెధవ నాలుకొచ్చి నాకేసి వెళుతుంది. ఇక మనకు మిగిలేదేంటి? ఇంకానా ఈ అన్యాయం , ఇకపై సాగనీయరాదంటూ, రెండూ ఒకటే ఇదై ఆ క్షణాన్నేఇక నోటికి ఏమీ అందీయకుండా “పస్తు” పెట్టాలని ఓ గట్టి నిర్ణయం తీసుకుని తమ సమ్మెను అప్పటికప్పుడు  మొదలెట్టేశాయి..చివరకు ముక్కుకి జిలపుట్టినా గీరటం మానేశాయి.                          

                         కొద్ది గంటల తరువాత, అదీ..బాగా కడుపు కాలిన తరువాత కాని విషయ తీవ్రత పొట్టకీ,నోటికీ తెలియరాలేదు. తెలిసిన తరువాత వెంటనే  లౌక్యం బాగా తెలిసిన  నాలుకను ( ముఫై రెండు పళ్ళ మధ్య దెబ్బ తగలకుండా తప్పించుకుంటూ  తిరుగుతుంది కదా..మరీ !)  రంగంలోకి  దింపాయి.     
               
నాలుక తనకు తెలిసిన అన్నివిధ్యలూ  ప్రదర్శించి, రకరకాల విన్యాసాలూ చేసింది. అయినా లాభం లేకుండా పోయింది. చేతులు దాని మాటా వినలేదు. మెదడుకి చెప్పి నయానా,భయానా ఎన్ని సిగ్నల్సు పంపించినా చేతులు  ససేమిరా అనడంతో ,రాను రానూ లోపల పేగుల అరుపులు ఎక్కువవటంతో  ఇక లాభంలేదని చేతులుని చర్చలకు ఆహ్వానించాయి.   
రోజుల తరబడి జరిగిన చర్చలూ యధావిధిగా ఎవరి వాదనకు వారు  కట్టుబడటంతో చివరకు విఫలమై ఇరు వర్గాల మధ్యా మాటామాటా పెరిగింది.ఒకరినొకరు నిందించుకున్నారు. పరిస్థితి చేతలకూ మారింది. తన అధికారాన్ని ప్రశ్నించడంతో అదుపు తప్పి ఆగ్రహించిన నోరు ఎవరూ ఊహించని విధంగా తన వాడి పళ్ళతో క్షణ కాలంలో  కసుక్కున చేతిని కొరికేసి కింద ఉమ్మేసింది.కెమేరాలు క్లిక్కు మన్నాయి. పాపం!చేయి నొప్పితో  విలవిలలాడిపోయింది. అయినా అంత నొప్పిలోనూ చలించక దీన్ని తనకనుకూలంగా మార్చుకోవాలని భావించి, కెమెరాల ముందుకొచ్చి నానా గొడవా చేస్తూ పెద్ద పెద్దగా అరవాలని ప్రయత్నం  చేసింది. కాని ఎంతకీ శబ్ధం మాత్రం బయటకు రాలేదు. మూగసినిమాలా ఉంది తన ప్రదర్సన.ఎందుకంటే తెలివి గల నోరు గదా రాబోయే ప్రమాదం ముందుగా ఊహించి వెంటనే గట్టిగా తన నోరు మూసేసుకొని మౌనంగా ఉండిపొయి ముసిముసి నవ్వులు నవ్వుకోసాగింది. చేయి తనంత తానుగా అరవలేక  నిస్సహయంగా నొప్పితో విలవిలలాడుతూ నిలబడిపోయింది. జర్నలిస్టులు చకచకా ఫొటోలు తీసుకోసాగారు.

  అప్పటిదాకా అన్నీ చూస్తూ వున్న కళ్ళు మౌనంగా రోదించటం మొదలుపెట్టాయి.

  అనుకోని సంఘటనతో ఓ జర్నలిస్టు,ఫొటోలు తీయడం ఆపి , కళ్ళూ!కళ్ళూ! నొప్పి చేయికి కదా  మరి మీరెందుకేడుస్తున్నారు? అన్నాడు నోటు బుక్కు చేతిలోకి తీసుకుంటూ ఉత్సాహంగా, అందుకు ఆ కళ్ళు ‘విరక్తిగా’నవ్వి ఎక్కడ  దెబ్బ తగిలినా చివరకు ఏడవాల్సింది “మేమే” గదా! అందుకే  విధిలేక ఏడుస్తున్నామంటూ తన ఎదురుగా  గోడ మీద ఉన్న “భారతమాత” ఫొటోని తడి కళ్ళతో నిస్సహాయంగా చూస్తూవుండిపోయాయి .           
   

     
 
 

Permalink 6 Comments

“తడి పెయింట్”.. తోటే అంతరిక్షంలోకి దూసుకువెళ్ళిన భారత దేశపు మొట్టమొదటి రాకెట్ కథ.

August 24, 2007 at 2:03 PM (అనగనగా .....)

 racket2.jpg (ఆ ప్రయోగంలో వాడిన రాకెట్ కోన్ ని సైకిల్ మీద తీసుకు వెళ్ళటాన్ని దృశ్యీకరించినవారు ఫ్రాన్స్ కి చెందిన హెన్రి కార్టిఎర్.)

మీకు తెలుసా? భారత దేశపు మొట్టమొదటి రాకెట్ తడి పెయింట్ తోటే అంతరిక్షంలోకి దూసుకువెళ్ళిందని? ఆ ప్రయోగం లో అబ్దుల్ కలాం పాత్ర ఏమిటి? సమయం వుంటే చదవండి.

 ఈ నాడు మనం ఇంట్లో కూర్చుని, ఇంటర్నెట్ లో ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకుని ఝూమ్మంటూ ఎగిరిపోగలం. ఈ సౌకర్యాలన్నింటినీ మనకందించటానికి మన ముందు తరాల వాళ్ళు ఎంత తపన పడ్డారో? ఏంత శ్రమించారో అని ఎపుడైనా మనం తలచుకుంటున్నామా? ఆ దేవుళ్ళకు ఎనాడైనా నమస్కరించామా?

అసలు విషయానికి వద్దాం.

 అది రెండు స్టేజ్ ల రాకెట్. సోలిడ్ ప్రొపెల్లెంట్ నుండి శక్తి పొందింది. దాని బరువు 715 కిలోలు. సభ్యులు ఈ చారిత్రాత్మక ఘటనని వీక్షించేందుకు వీలుగా కేరళ అసెంబ్లీని ఈ రాకెట్ ప్రయోగానికి కొద్ది నిమిషాలముందు వాయిదా వేసారు. సముద్ర తీరం లో తుంబా (మళయాళం లో తుంబా అనేది వైద్య విలువలు గల ఓ తెల్లపూల చెట్టు పేరు.) లోని సెయింట్ మేరీ మెగ్డాలెన్స్ చర్చి ని ప్రయోగ స్థలం గా నిర్ణయించారు. ఆ చర్చి లోనే పేలోడ్ ని ఉంచారు.

 తుంబా ప్రయోగం “టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్” లో పనిచేసే విక్రం సారాభాయ్ యొక్క మానసపుత్రి. ఆయన అకుంఠిత దీక్ష మరియు అంకిత సేవల వలనే ఈ రోజు భారతదేశం విదేశీయుల ఉపగ్రహాలను కూడా నియమిత కక్ష్య లోకి ప్రవేశపెట్టగల స్థితి కి చేరుకుంది. సారాభాయ్ యు.ఎస్.ఎ లో పనిచేసే ముఖ్యమైన భారతీయ శాస్త్రవేత్తలకు రాకెట్ ప్రయోగానికి “తుంబా” అత్యంత అనువైన ప్రదేశమనీ, అక్కడికి ఒకసారి రమ్మనీ ఆహ్వానించాడు. అనేక మంది సారాభాయ్ ప్రతిపాదనని కొట్టి పడేసారు.

 అయితే ఆయన మీద నమ్మకమున్న కొద్దిమంది శాస్త్రవేత్తలు హార్వర్ద్, ఎం.ఐ.టి, కోర్నెల్ నుండి వచ్చారు. ఇక ఇప్పటి మన హీరొ, ఆనాడు “నాసా” లో పనిచేస్తూ ఉండిన అబ్దుల్ కలాం ఆగుతాడా? 1966 సంవత్సరం నవంబర్ 19 తారీఖున సారాభాయ్ నుండి కలాం ఒక అత్యవసర సమాచారం అందుకున్నాడు. ప్రొఫెసర్ జాక్స్ బ్లామోంట్స్ లాబొరేటరి కి వెళ్ళి ఒక సోడియం వేపర్ పేలోడ్ ని తీసుకుని, తరువాతి ఫ్లైట్ ఎక్కి భారత్ కి వచ్చి, ఆ పేలోడ్ తుంబాకి చేరేటట్లు చూడమని. కలాం ఆ పని పూర్తి చేసాడు. ఆ రోజుల్లో ఎవరైనా అనుకుని ఉంటారా? ఈ యువకుడు రాబోయే రోజుల్లో భారత రాష్ట్రపతి అవుతాడని.

 సారాభాయ్ ముఖ్య స్నేహితుడైన బ్లామోట్స్ కూడా తుంబా కి చేరుకున్నాడు. ఆ రాకెట్ ని తయారు చేసింది నైక్-అపాచి సంస్థ. దాన్ని యు.ఎస్ నుండి దిగుమతి చేసుకున్నారు. పేలోడ్ తయారయింది ఫ్రాన్స్ లో. ఈ రెండింటి అనుసంధానం ఎలా వుంటుందోనన్నది అనుమానమే?

 నవంబర్ 21 తేది ని ప్రయోగానికి అనువైన దినం గా నిర్ణయించారు. అందరిలోనూ టెన్షన్. ఏ పనీ అనుకున్నవిధంగా జరగటం లేదు. ముందు పేలోడ్ రావటం ఆలస్యమైంది. తుంబా కి చేరిందే గాని, దాన్ని ప్రయోగ స్థలానికి చేర్చటం ఎలా? అన్నదే ప్రధాన సమస్య అయింది.

 దానికి ఎద్దుల బండిని వాడారట. మిగిలిన భాగాల్ని, రాకెట్ కోన్ లాంటివాటిని సైకిల్ లాంటి ఏ వాహనం దొరికితే దాని మీద మోసుకువచ్చారు. తీరా అన్నీ చేరిన తరువాత చూస్తే ఫ్రెంచి పేలోడ్ కీ అమెరికన్ రాకెట్ కీ లంకె కుదరలేదు.

 అప్పుడు రంగంలోకి దిగాడు, భారతీయ మేధావి మరియు యూనివర్సిటి ఆఫ్ మిన్నెసొట లో ఫిజిక్స్ ఆచార్యుని గా పనిచేసిన ప్రొఫెసర్ పి.డి.భావ్సార్. ఆయన తన మేధస్సుని ఉపయోగించి కలాం సహాయంతో చిన్న చిన్న పనిముట్ల తో ఆ పేలోడ్ అంచులు గీకి, రాకెట్ కి సరిపోయేంత వరకు అరగదీసాడు. “ I was a paylod fellow then …” భారత రాకెట్ ప్రయోగ 40 వ వార్షికోత్సవం సందర్భం గా కలాం గుర్తు చేసుకున్నారు.

 అపూర్వంగా  ఆ పేలోడ్, రాకెట్ కి సరిపోయింది. ఈ లోపు కొంతమంది యువ శాస్త్రవేత్తలు అంతరిక్షం లోకి వెళ్ళబొయ్యే ఈ రాకెట్ కి పెయింట్ వెయ్యాలని నిర్ణయించారు. నిర్ణయించిందే తడవు డబ్బాలు, బ్రష్ లు వచ్చేయటం, పెయింట్ వేసేయటం జరిగిపోయాయి.

 ఇంతలో మరో సమస్య. రాకెట్ వెళ్ళే మార్గాన్ని చిత్రీకరించటానికి నాలుగు కెమెరా స్టేషన్లు కావల్సి వచ్చింది . ఒకటి కన్యాకుమారి లోని కేరళ హవుస్ గా నిర్ణయించారు. మిగిలినవి పొలయంకొట్టాయ్, కొట్టాయం మరియు కొడైకెనాల్ లోని కాలేజి బిల్డింగులు. విద్యార్ధులు కొందరు ఈ పనికి ఎన్నుకొనబడ్డారు. కాని ఈ నాలుగు స్థలాల మధ్య అనుసంధానం ఎలా? అప్పుడు టెలికాం డిపార్ట్ మెంట్ రంగం లోకి దిగి ఈ నాలుగు స్టేషన్ల మధ్య అనుసంధానం కుదుర్చి మార్గం సుగమం చేసింది.

 విషయం తెలిసిన స్థానిక మళయాళీలు 208 కి.మీ. ఎత్తుకు దూసుకు పోనున్న ఆ రాకెట్ ప్రయోగాన్ని తిలకించటానికి గుంపు గా చేరారు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. సోడియం ఆవిరి ని చిమ్ముకుంటూ, నిప్పులు కక్కుతూ ఆ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్ళి భారతీయుల్ని ఆనందం లో ముచెత్తింది. ఆ విధంగా భారత దేశపు మొట్టమొదటి రాకెట్ తడి పెయింట్ తోటే అంతరిక్షం లోకి ప్రవేశించింది.

 మరుసటి రోజు, ఈ విజయాన్ని “నాసా” అభినందించింది. సారాభాయ్ టీం ఆ అభినందనల్ని స్వీకరిస్తున్న సమయంలోనే ప్రెసిడెంట్ కెన్నడీ హత్య చేయబడ్డారు. ఒక సవత్సరం తరువాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఏర్పాటయింది.
 
ఆ రాకెట్ ప్రయోగాన్ని ఒక మేడ మీద నుంచి తిలకించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి తరువాత  “ఇస్రో” చైర్మన్ అయ్యాడు. ఆయనే  మాధవన్ నాయర్.

మన పెద్దవాళ్ళు చెప్పినట్లు మరణించినవారి ఆత్మలు పైన ఎక్కడో తిరుగుతూ వుండేమాట నిజమే అయితే విక్రం సారాభాయి ఆత్మ ఖచ్చితంగా పైన వంటరిగా తిరుగుతూ వుండే సాటిలైట్ల మధ్యనే గడుపుతూ వుండి వుంటుంది.

                                    “ఫోటొ మరియు ఇతర వివరాలు టైంస్ ఆఫ్ ఇండియ లో నుండి సంగ్రహించబడినవి. ఏమైనా తప్పులు వుంటె క్షమించి తెలియజేయగలరు.”

Permalink 1 Comment

« Previous page · Next page »