వల్లగాని పటేల్
![]()
1947, ఆగస్ట్ 15 తరువాతనుంచి భారతదేశ పటం గీయమంటే, ఎవరైనాసరే ఎలగోలా గీసిపడేసెయ్యగలరు. కాని మన దేశ పటానికి ఈ సుందర రూపాన్ని తెచ్చిన వ్యక్తిని గురించి ఈ తరాలవారికి తెలిసింది చాలా తక్కువే . “వల్లగాని పటేల్” గా మన తెలుగు వాళ్ళు ముద్దుగా పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేజారిన ముత్యాలను ప్రోగు చేసి మాల కట్టి దేవుడి మెడలో వేసినట్లుగా, ముక్కలు ముక్కలైపోయి అస్థవ్యస్థంగా ఉండిన మన దేశానికి ఒక రూపునిచ్చి భరతమాత పాదాలకు ఎలా సమర్పించాడో కొంచెం చూద్దాం.
సమస్య :- భారతదేశం అంతటా వ్యాపించి వున్న 565 చిన్నచిన్న రాజ్యాలను దేశం లో విలీనం చేయటం.
సమయం :- కేవలం 10 వారాలు
శత్రువులు :- మహ్మద్ అలీ జిన్నా, అనేక సంస్థానాధీశులు, కొంతమంది బ్రిటిష్ ఉన్నతాధికారులు.
అడ్డంకి :- సంస్థానాలు భారత్ లో కలవాలా? పాకిస్థాన్లో కలవాలా? లేక స్వతంత్ర్యదేశంగా ఉండిపోవాలా అన్న స్వేచ్చని బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఇచ్చింది.
సర్ధార్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా చేసారో తెలుసుకునేముందు, బార్డోలి సత్యాగ్రహంలో ఆయన పాత్రగురించి కొంచం తెలుసుకుందాం.
బార్డోలి సత్యాగ్రహం(1928).
దీన్ని పెద్దలు రామాయణంలో కిష్కిందకాండతో పోల్చారు. రాముడితో హనుమంతుడి కలయిక జరిగింది ఇందులోనే. ఆ కలయికే సీత జాడ తెలుసుకోవటానికీ, రావణ సంహరానికీ దారి తీసింది. గాంధీజిని తన అనుమతిలేకుండా బార్డోలి(గుజరాత్ లో ఓ ప్రాంతం.)లో అడుగు పెట్టద్దని కోరి, ఆయన సిద్దాంతాలకు కట్టుబడి ఉంటూనే తనదైన శైలిలో 88000 మందిని ధీరులుగా మలచి బార్డోలి సత్యాగ్రహాన్ని అహింసాయుతంగా జరిపిని ధీరోత్తముడు ఈ ఉక్కుమనిషి. ఈ సత్యాగ్రహమే భావి భారత స్వాతంత్ర్య సమరానికి దిశానిర్ధేశం చేసింది. మరియు సర్ధార్ పటేల్ లోని సైద్ధాంతిక, ధీరత్వ, నాయకత్వ లక్షణాలను భారతదేశం గుర్తించింది.
1929 డిసెంబర్ నెలలో కాంగ్రెస్ అధ్యక్ష్య పదవికి ఎవరిని ఎన్నుకోవాలి? అని సమావేశం జరిగింది. ఆ రోజుల్లో ఈ పదవినలంకరించిన వారిని “రాష్ట్రపతి” అని సంబోధించేవారు. గాంధీజిని 10 మంది, సర్ధార్ని 5 మంది, నెహ్రూని ముగ్గురు బలపరిచారు. గాంధీజి ఆ పదవిని నిరాకరించారు. అప్పుడు సర్ధార్ వంతువచ్చింది. ఆయన ఒకే ముక్కలో “కెప్టెన్ వెళ్ళకూడదని నిర్ణయించుకున్న తరువాత, అక్కడికి వెళ్ళటానికి సైనికుడికి ఎంత ధైర్యం వుండాలి?” అని వినమ్రంగా తప్పుకున్నాడు. ఆయన సామర్ధ్యానికి అసలైన పరీక్ష తరువాత జరిగింది. అదే Integration of Princely States of India.
1953లో యుగోస్లావియా ప్రెసిడెంట్ అయిన మార్షల్ టిటో భారత్ ని సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక విలేఖరి అడిగాడు. మీకు భారత దేశంలో అమోఘం అనిపించిన విషయం ఏమిటి? అని. ఆయన ఇలా సమాధానమిచారు. “ఒక్క రక్తపు బిందువు కూడా చిందకుండా భారతదేశ విలీనం ఎలా జరిగిందా? అని ఇప్పటికీ నాకర్ధం కావడంలేదు.”
సర్ధార్ లేకుండా వుండి వుంటే ఈ విజయానికి దూరమై మన దేశపు చిత్రపటం ఎంతో అందవిహీనంగా వుండేది. అనితరసాధ్యమైన ఆ పనిని తన్ భుజస్కంధాలపై వేసుకుని విజయవంతంగా ఎలా పూర్తిచేసాడో చూద్దాం.
1948 జూన్ కల్లా భారత్ ని భారతీయుల చేతిలో పెట్టిరమ్మని లార్డ్ మౌంట్ బాటన్ ని 1947 మార్చ్ లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాకు పంపించింది. జూన్ 4 తేదిన ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి, ఆగస్ట్ 15, 1947 న నాయకత్వాన్ని బదిలీ చేస్తామని ప్రకటించారు. అంటే 565 పైచిలుకు ముక్కలుగానున్న వుపఖండాన్ని రెండు ముక్కలుగా (భారత్, పాక్) కుదించటానికి ఇక కేవలం 10 వారాల సమయం మాత్రమే వుంది.
అవతలిప్రక్క ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా ఇదివరకే పాకిస్థాన్, బంగ్లాదేశ్ అనే రెండు భాగాలు పొందినా ఇంకా తృప్తి లేకుండా వున్నాడు. భారతదేశం ముక్కలు ముక్కలుగా అవ్వాలన్నదే అతని ధ్యేయంగా వుంది.అన్నింటికన్నా పెద్ద సంస్థానమైన హైదరాబాద్ నవాబు నిజాం, జిన్నా మద్దతుదారుడు. ఆయన ఆగస్ట్ 15 ‘1947 నుండి తనను తాను స్వతంత్ర్య పాలకుడిగా ప్రకటించుకున్నాడు. Chamber of Indian Princes కి నాయకుడైన భోపాల్ నవాబ్ కూడా జిన్నా అనునూయుడే. ఈయన నిజాం కన్నా మరొక అడుగు ముందుకేసి కొన్ని హిందు సంస్థానాలుకూడా పాక్ లో కలవాలని ప్రతిపాదించాడు. మరొక సమస్య ఏమంటే అప్పటి వైస్రాయ్ యొక్క రాజకీయ సలహాదారుడైన Sir Conrad Corfield పాక్ పట్ల మెతకవైఖరితో వుండేవాడు. ఈ సంక్లిష్ట పరిస్థితులలో ఏం చేయాలో అర్ధంకాక భారత నాయకులు ఆందోళనలో వున్నారు.
విలీనం అనేది మూడు ప్రధాన విషయాలను దృష్టిలో వుంచుకుని జరగాలని మౌంట్ బాటన్ ప్రతిపాదించాడు. అవి 1.రక్షణ 2. విదేశీ వ్యవహారాలు, 3. సమాచారం. కాని సర్ధార్ ఇలాంటి పరిమితులకు వప్పుకోలేదు. ఆ సమయంలో వారిద్దరిమధ్య జరిగిన ఆసక్తికర సంభాషణని చూద్దాం. ఈ సంభాషణే ఈనాడు మనం చూస్తున్న సంపూర్ణ భారతదేశ ఏర్పాటుకు దారి తీసింది. లేదంటే మన దేశపటాన్ని గీయటం ఇప్పుడున్నంత సులభమైవుండేది కాదు.
సర్ధార్ : మీ బుట్టలో “అన్ని” ఆపిల్స్ నింపి అమ్మితేనే కొంటాను. లేదంటే లేదు.
మౌ.బా: నాకొక డజను వదలగలవా?
సర్ధార్ : అవి చాలా ఎక్కువ. రెండు తీసుకోవటానికి వప్పుకుంటాను.
మౌ.బా: మరీ తక్కువ.
Collins & Lapierre ఇలా వ్రాసారు. “కొన్ని నిమిషాల పాటు ఆఖరి వైస్రాయ్ మరియు భారత భవిష్య మంత్రి, తివాచీ వ్యాపారుల్లా ఆ సంస్థానాల కోసం బేరమాడుకున్నారు. చివరకు వాళ్ళిద్దరూ ఒక అంకె దగ్గర ఆగిపొయ్యారు. అది ఆరు. వూహించండి. ఇదు వందల అరవై అయిదు సంస్థానాలు మైనస్ ఆరు. ఇదంతా ఆగస్ట్ 15 కి కేవలం కొన్ని వారాల ముందు. శిల నుండి మలచబడినట్లు దృఢంగా వుండే వ్యక్తిత్వం కలవాడైన సర్ధార్ కాకుండా, వేరెవరైనా మౌంట్ బాటెన్ ముందు కూర్చుని వుండి వుంటే ఈ అద్భుత భారత దేశం మన ముందు వుండి వుండేదా?
పటేల్ అధ్వర్యంలో జరుగుతున్న విలీనంలో ఎంతోమంది సంస్థానాధీశులు హస్తాక్షరాలు చేసేసారు. ఇది జిన్నాకు కడుపుమండించింది. ఆయన భారత దేశంలో విలీనం కావటం ఇష్టంలేని సంస్థానాలను ఆకర్షించటం ప్రారంభించాడు. ముఖ్యంగా ముస్లింలు పరిపాలించే హైదరాబాద్, జునాగఢ్, భోపాల్ మరియు పాక్ కి దగ్గరగా వుండే జోధ్ పూర్, జైసల్మార్ వంటి సంస్థానాలు. అంతటితో ఆగక ఇండోర్, ట్రావన్ కోర్ వంటి వాటిని స్వతంత్ర్య దేశాలుగా నిలబడటానికి పావులు కదిపాడు.
విస్థరణలో, జనాభాలో కొన్ని యూరోపియన్ దేశాలకన్నా పెద్దవైన అనేక సంస్థానాధీశుల్ని వప్పించటానికి సర్ధార్ చేయని ప్రయత్నంలేదు. ఒకప్పుడు తనపై హత్యాయత్నం జరిపించటంలో ప్రధాన పాత్ర వహించిన నవ్ సాగర్ మహరాజైన జం సాహెబ్ కొందరు సంస్థానాధీశులతో కల్సి ఏదో గూడుపుఠాణీ చేయనున్నాడని తెల్సుకున్న సర్ధార్, ఆ రాజు తమ్ముడ్ని కల్సి మహారాణి మాత్రమే ఆయన్ని వప్పించగలదని తెలుసుకుని వారిని విందుకు ఆహ్వానించాడు. తన వాదనతో వారిని సమ్మోహితుల్ని చేసి చివరకు వప్పించాడు. ఆ మహరాజే సంస్థానాల విలీనంలో సర్ధార్ కి తరువాత ఎంతో సహాయ సహకారాలందించాడు. దేశం కోసం వ్యక్తిగత కక్షలు పక్కనపెట్టి తన మహనీయత్వాన్ని చాటుకున్నారు సర్ధార్.
సర్ధార్ చతురతకి అద్దం పట్టే మరో ఆసక్తికర సంఘఠన భోపాల్ నవాబు మరియు ఇండోర్ మహరాజుల విషయంలో జరిగింది. వీళ్ళిద్దరికీ ఇండియాలో విలీనం అవటం ఇష్టంలేదు. ఇద్దరూ ఒక రహస్య వప్పందానికి వచ్చారు, అదేమంటే ఏ నిర్ణయం తీసుకున్న సరే ఇద్దరూ కలిసే తీసుకోవాలని. సర్ధార్ అనేక ప్రయత్నాలు చేసిన మీదట భోపాల్ నవాబు సంతకం పెట్టటానికి అయిష్టంగానే వప్పుకున్నాడు, కాని ఒక షరతు పెట్టాడు. తన నిర్ణయాన్ని ఆగస్ట్ 15 తేదీనే ప్రకటించాలని. ఇక ఇండోర్ మహరాజుని ఎలా పట్టేసాడో చూద్దాం.
సరిహద్దులోనే వున్న భోపాల్ నవాబు సంతకం పెట్టేశాడని తెలియని ఇండోర్ మహరాజు విలీనం విషయమై రైల్లో ఒకనాడు ఢిల్లి కి వెళ్ళాడు. ఆ క్షణంలో సంతకం పెట్టకూడదన్న దృఢ సంకల్పంతో వున్న మహరాజు, సర్ధార్కి తన రాక గురించి తెలిపి, మాట్లాడాలనుకుంటే రైల్వే స్టేషన్ కి వచ్చి మాట్లాడమన్నాడు. సర్ధార్ వెళ్ళ లేదు. గాంధీజి అనుచరురాలైన మహరాణి రాజకుమారిని పంపించాడు. అక్కడ రాజకుమారి ప్రత్యక్షం అవటం సమస్యను పరిష్కరిస్తుందని సర్ధార్ కి తెలుసు. ఆమెను చూడగానే ఆశ్చర్యపోయిన మహరాజుకు ఆమెతో కలిసి సర్ధార్ దగ్గరకు వెళ్ళక తప్పింది కాదు. కాని భోపాల్ నవాబుతో చేసుకున్న రహస్య వప్పందం ప్రభావం ఆయన మీద ఇంకా వుండటంతో నవాబుతో చర్చించకుండా సంతకం పెట్టనని భీష్మించాడు. నవాబు ఎప్పుడో సంతకం పెట్టేశాడని చెప్పినా నమ్మలేదు. చివరకు కాగితాలు చూపిస్తే, విభ్రాంతితో సంతకం పెట్టేశాడు.
The ulcer in the abdomen of India గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ని దండోపాయంతో విలీనం చేసి, దేశానికి ఒక రూపు తెచ్చాడు. ఇక ఆయన దూరదృష్టి ఎలాంటిదో చూద్దాం. “కలాత్” ఖాన్ మరియు భావల్పూర్ నవాబులు సర్ధార్ని కల్సి, తాము భారత్ లో విలీనమవుతామని విన్నవించుకున్నారు. కాని సర్ధార్ ఒప్పుకోలేదు. కలాత్ లో వుండేదంతా ముస్లిములు, అదీగాక భౌగోళికంగా అది పాక్ అంతర్భాగం. ఇక భావల్పూర్, సరిహద్దులో వున్నా కూడా అందంతా ముస్లిములే కనుక వాళ్ళను పాక్ లోనే కలవమని నచ్చచెప్పాడు. (ఈ బుద్ధి జిన్నాకు లేకపోయింది.)
కాశ్మీర్ని ఆక్రమించుకుంటున్న పాకిస్థాన్ సైన్యాన్ని వెనక్కి తరిమివేయటానికి పూనుకున్న సర్ధార్ ని, కాశ్మీర్ సమస్యని తనకొదిలేయమని నెహ్రూ కోరటంతో అది ఈనాటికీ UNOలో నలుగుతూ Brain Tumer of India గా తయారయింది. ఇదే సమస్య జునాగఢ్ (గుజరాత్)కి కూడా ఎదురైతే దాన్ని UNO వరకు పోనివ్వకుండా సర్ధార్ అడ్డుకున్నాడు. లేదంటే అది కూడా మరో కాశ్మీర్ అయివుండేది.
1950 లో మౌంట్ బాటన్ ఇలా అన్నారు. “ఇండియా ఒక సంపూర్ణదేశంగా మారటానికి కనీసం 15 ఏళ్ళు పడుతుందని అనుకున్నాము. కాని సర్ధార్ కేవలం 10 నుండి 12 నెలలలోపే అపూర్వమైన విజయాన్ని సాధించాడు.”
ఈ రోజే హైదెరాబాద్ సంస్థానం మన దేశంలో విలీనమైన రోజు.(Sep17)
కొసమెరుపు:
1949లో హైదరాబాద్ నిజాం పాలనను అంతమొందించడానికి భారత ప్రభుత్వం “పోలీసు చర్య” అమలు జరిపింది. తర్వాత దానికి అయిన ఖర్చు ఏ పద్దు కింద చేర్చాలో ప్రభుత్వానికి అర్ధం కాక తికమక పడింది. అది పోలీసు చర్య కనుక భారత రక్షణశాఖ ఆ ఖర్చుని భరించడానికి నిరాకరించింది. పోలీసు బలగాన్ని వినియోగించలేదని, అంతా మిలిటరీ వారే పాల్గొన్నారని, కాబట్టి ఆ ఖర్చుతో తమకి సంబంధం లేదని హోంశాఖ తిరస్కరించింది. ఫైగా అది క్రమశిక్షణ చర్య కనుక ఆ ఖర్చుని విద్యాశాఖకి బదలాయించమని సలహా ఇచ్చింది. కేంద్ర విద్యా శాఖ అందుకు నిరాకరించి, “హైదరాబాద్ పై పోలీసు చర్య దేశానికి పట్టుకున్న వ్యాధి నిర్మూలన పధకంలో భాగం కనుక ఆ ఖర్చుని ఆరోగ్యశాఖ పరంగా వ్రాయించ” మన్న సూచనను పాటించి ఆ ఖర్చుని ఆరోగ్యశాఖ భరించింది.
(ఈ నిజాన్ని ‘జాతీయ హాస్యం’ పేరిట పాత అంధ్రజ్యోతి పత్రికలో వేస్తే చదివాను.)
(పై వ్యాసంలో అధిక వివరాలను ఈక్రింది పుస్తకాలనుండి గ్రహించాను. -”The Peerless Sardhar” by Gunvant Singh.
- గాంధీజి “సత్యసోధన”



సుధాకర్ said,
September 17, 2007 at 4:46 PM
భలే వుందండి. ఈ విషయాలేవీ నాకింతవరకు తెలియదు. మంచి సమాచారం. మన హైదరాబాదు అప్పటి నుంచే హైదరాబ్యాడ్ గా పేరు తెచ్చుకుందన్నమాట.
రాజ మల్లేశ్వర్ కొల్లి said,
September 17, 2007 at 8:13 PM
చాల మంచి వ్యాసమండీ… నువ్వుశెట్టి గారు.
అందుకోండి అభినందనలు.
ఇంత ప్రాముఖ్యత కలిగిన సందర్భాన్ని, దేశ ఐక్యత కు చిహ్నంగా ప్రభుత్వమే ఉత్సవాలు జరిపితే బాగుంటుంది. అయితే ప్రభుత్వం “వాళ్ళు” బాధ పడతారని, ఓట్లు పోతాయని ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించటం క్షమించరాని విషయం.
Sriram said,
September 17, 2007 at 11:14 PM
మంచి వ్యాసం అందించారు.కృతజ్ఞతలు. స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళకి కూడా పీడిస్తున్న కాశ్మీరు సమస్యకి కారణం మన పండిత నెహ్రూ గారి వ్యక్తిగత బలహీనత. ఈ వ్యాసం చదవండి.
http://www.sandeepweb.com/2007/08/03/nehrus-love-for-edwina-is-indias-continuing-nightmare/
praveeen swamy said,
September 18, 2007 at 11:44 AM
baagundhandi mee vyaasam.enno vishayaalu telusuko galigaanu..
Budaraju Aswin said,
September 19, 2007 at 9:42 AM
చాలా బావుందండి ,
మన హైదరాబాద్ కు కధ చాలానే ఉంది
నువ్వుశెట్టి బ్రదర్స్ said,
September 19, 2007 at 12:36 PM
శ్రీరాం గారికి, థాంక్స్ అండీ, మీరు ఇచ్చిన ఈ లింక్ తో మా వ్యాసానికి పరిపూర్ణత వచ్చింది.Thank u very much.
bollojubaba said,
May 14, 2008 at 10:20 AM
ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ లో ఇంకా దేశ విభజన గురించి, గాంధి వైఫల్యం గురించి చాలామంచి విషయాలు ఉంటాయి. వీలు చూసుకొని అందించకూదదూ? మీ వచనం చాలా ఆశక్తి కరంగా, గుర్రందౌడులా ముందుకు సాగేలా చేస్తుంది. చాలా బాగుంది మీ వ్యాసం.
బొల్లోజు బాబా