ఈ విజయం హిందువులదా?

December 25, 2007 at 3:45 PM (మనసులో మాట)

narendra.jpg      గుజరాత్ లో ఎవ్వరూ వూహించని అనూహ్య విజయాన్ని సాధించారు శ్రీశ్రీశ్రీ నరేంద్రమోడి. 182 స్థానాలకి గాను 117 స్థానాలను కైవసం చేసుకుని కాషాయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ విజయంలో బి.జె.పి ఆయనకెలాంటి సహకారాన్నీ అందించలేదు, సంఘ్ పరివార్ ఆమడ దూరంలో నిల్చుంది, స్వంత సమూహంలో ముసలం పుట్టింది, మరో బి.జె.పి. నేత కేశూభాయ్ పటేల్ చేసిన వ్యతిరేఖ ప్రచారం, కాంగ్రెస్ తరపున సోనియా గాంధి, రాహుల్ గాంధి వంటి నేతలు రంగంలోకి దిగారు, డా.మన్మోహన్ సింగ్ తో సహా అనేక మంది నేతలు పదే పదే గోద్రా హింసా ఖాండను ప్రస్థావించారు, సోరాబుద్ధీన్ ని బూటకపు ఎన్‌కౌంటర్లో చంపేశారన్నారు, మోడి దుర్మార్గుడన్నారు. అయినాసరే మోడి అద్భుత మెజారిటీతొ పార్టీని గెలిపించారు, ముఖ్యమంత్రి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? రిగ్గింగులు లేవు, గొడవలు లేవు, మతకలహాలు లేవు. “గెలుస్తుంది గుజరాత్” అన్న నినాదంతో మోడి తిరిగి ప్రచారం చేసింది కేవలం 18 నియోజకవర్గాలలోనే. అయినా సరే కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టారు. ఈ గెలుపు ఎవరిది? బి.జె.పి. దా? గుజరాతీయులదా? మోడిదా? లేక హిందువులదా?    

   వాస్థవానికి ఈ గెలుపు ఎవ్వరిదీ కాదు. కాంగ్రెస్ కుత్సితాలకు భయపడి, నిస్సహాయులై మరో దారి లేక గుజరాతీయులు మోడి ని గెలిపించారు, బి.జె.పి. ని కాదు. అందుకే ఆయన్ని అందరూ One Man Army అంటారు. గుజరాత్ అంతటా వ్యాపార వర్గానికి చెందిన కుటుంబాలే ఎక్కువ. 10 వ తరగతి పాస్ అయిన తరువాత వ్యాపారంవైపు మొగ్గేవాళ్ళే గుజరాత్ లో ఎక్కువగా వున్నారు. మతకలహాలు చెలరేగినప్పుడు, హిందువులుగాని ముస్లిములుగాని ఎక్కువగా నష్టపోయేది వ్యాపారస్థులే. ఇక్కడ కాంగ్రెస్ కి స్థిరమైన నేత  లేకపోవడం, గుడ్డిగా ఎప్పుడూ మైనారిటీ వర్గాలని వెనకేసుకురావటం ప్రజల మనసుల్లో కాంగ్రెస్ అంటే మళ్ళీ గొడవలే, అంతటా అస్థిరతే అన్న భావన ముద్రపడి పోయింది. పైగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి వచ్చి పదేపదే…”మేమొస్తే గోద్రా కేసుని తిరగదోడతాం అనో, గోద్రా నరమేధం మోడి చేయించాడు…” అనో ప్రస్థావిస్తూ అసలే భయాందోళనలతో వుండే ప్రజల్ని మరింత భయపెట్టి వాళ్ళ గొయ్యి వాళ్ళే త్రవ్వుకున్నారు. దీనితో ఎంతో మంది కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు సైతం మోడి కి ఓటు వేయక తప్పలేదు. ఈసారి మోడి ఓడిపోయేటట్లు వున్నాడు అన్న వార్త అంతటా వ్యాపించటంతో, భయపడిపోయి అధిక శాతం గుజరాతీయులు ఏనాడూ ఓటు వెయ్యని వాళ్ళు కూడా జాగృతి అయి ఇళ్ళు కదిలి బయటకు వచ్చి వేలికి ఇంకు పూయించుకున్నారు.

   ఇండియా ఒక క్రికెట్ మ్యాచ్ గెలిస్తేనే ఔట్లు పేల్చి సంబరాలు చేసుకుంటారు గుజరాతీయులు. పాకిస్తాన్ మీద గెలిస్తే ఇక చెప్పనఖర్లేదు డప్పులు మోగించుకుంటూ వీధుల్లో నాట్యాలు చేస్తారు, అమ్మాయిలు కార్లలో వచ్చి కూడళ్ళలో “గర్భ” ఆడుతారు. అలాంటిది ఈనాడు మోడి గెలిచాడన్న ఉత్సాహం, ఉత్సవ వాతావరణం సాధారణ ప్రజల్లో లేదు.

   కాంగ్రెస్ వస్తే ముస్లిం మతఛాందసవాదులు పేట్రేగి పోతారు అన్న ఓ బలమైన ఆలోచనే మోడిని మళ్ళీ గద్దెనెక్కించింది. అటు ముస్లిం ఛాందసవాదుల్ని అణచివేయగల సత్తా, ఇటు హిందూ నేతల్ని గీత దాటనీయకుండా ఆపగల పట్టు వున్న ఏకైక నేత శ్రీశ్రీశ్రీ నరేంద్రమోడి మళ్ళీ గెలవటంతో సగటు గుజరాతీయుడు వూపిరి పీల్చుకుని తిరిగి తన పనిలో తను మునిగిపోయాడు.

18 Comments

  1. నేమాని రామక్రిష్ణ said,

    చాల బాగా విశ్లేషించారు

  2. Vookadampudu said,

    అయ్యా, మీరు గుజరాత్ లో గత ౫/౧౦ ఏండ్లు గా జరిగిన అభివృద్ధి ని ప్రస్తావించలేదేమి? బహుశ: గుజరాతీయులు, తెలియని దైవం కన్నా తెలిసిన దయ్యమే మిన్న అనుకున్నారేమో.

  3. Vookadampudu said,

    రాహుల్ గాంధి వంటి నేతలు Huh ?!

  4. రానారె said,

    మోడీ గెలుపుతో నేను ఆశ్చర్యపోయాను. ఈ గెలుపు గుజరాతీ ముస్లిములకు ఎలాంటి సందేశాన్నిస్తోందని ఆలోచించాను. మీ విశ్లేషణతో కొంత వరకూ సమాధానం దొరికింది.

  5. Palakurthy said,

    HIndhuisam ni antho intho kaapededhi gujaraathile, migatha ae state vaallaki kuuda vundanantha hindhu feeling vuntundhi, how will they accept Psuedo Party congress, this is not first or second win to BJP right? they been wiining for last 15+ years..

    even outside india also gujarathies are famous for Hindhusim.. ..

    after seeing Ramasethu issue ,Islam terrorisam ..etc under Congress ruling how can people accept Psuedo Party?

    Ramasethu effect is also there in Gujarath,
    another important thing is Modi is a gud ruler then others, all central govt reports shows gujarath is top in development state wide.. wat else people required to vote?

  6. kk said,

    మోడీ లాంటివారు ఈ దేశం లో ఆ మూలా ఈ మూల ఓ నలుగురు వుండుంటే ఈ తొక్కలో కాంగిరేసు వాళ్ళు మన దేశ వెన్నెముక మీదే డాడి చెసినవారిమీద ఇలా బహిరంగంగా ప్రేమ చూపించే వారుకాదనుకుంటాను.మోడీ మతాలకతీతం గా అందరిచే అబిమానింపబడాలని కుహానా లౌకికవాదంతో ఓ మతానికి కొమ్ము కాస్తున్న ఇటలీ, పులివెందుల టీము కళ్ళు తెరిపించే జాగ్రుతి అందరికీ అందించాలని కోరుకుంతూ,

  7. kk said,

    ‘ఒక్కమగాడు ‘

  8. poolavaana said,

    ఇటువంటి గెలుపే కాదు, అసలు గెలుస్తాడనే అనుకోలేదు.

    గుజరాత్ పరిస్థితిని దగ్గరగా గమనించి మీరు చేసిన విశ్లేషణ బాగుంది.

    అయితే.. ఫలితాలు వచ్చిన సాయంత్రమనుకుంటా కేశూభాయ్ పటేల్ ని కలిసిన మోడీ అని న్యూస్ స్ర్కోల్ చూసి, వారిద్దరి మధ్య సంభాషణేం జరిగి ఉంటుందా అని అనుకున్నాను. గిరీ, మీరు అది వ్రాయగల సమర్ధులు.

    మా కోరిక మన్నిస్తారా..?

    కొత్త రవికిరణ్

  9. వికటకవి said,

    విశ్లేషణ బాగుంది, కాకపోతే గెలుపెవరిది అంటే బుర్రకి పదును పెట్టి వోటేసిన ప్రజలదే. ఇది భా.జ.పా కి చాలా అవసరమయిన విజయం, దాన్ని మోడీ అందించాడు. ఎంతసేపూ వ్యతిరేక వోటు నమ్ముకొని గెలుద్దామనే కాంగీరేసోడికి చెప్పుదెబ్బ ఇది.

  10. చదువరి said,

    చక్కగా చెప్పారు. కాంగ్రెసు తమకోసం కాక, మోడీ గెలుపు కోసం ప్రచారం చేసినట్టైందన్నమాట! :)

  11. నువ్వుశెట్టి బ్రదర్స్ said,

    ఊకదంపుడు గారు, మీరన్నది అక్షరాలా నిజం. మోడి కాంగ్రెస్ పాలిట మరియు ముస్లిం మత చాందసవాదుల పాలిట దయ్యమే. గుజరాత్ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏముంది? ఉత్తమ రాష్ట్ర్రంగా ఎన్నికై సోనియాగాంధి చేతుల్లోనుంచే అవార్డు అందుకుంది. మన రాష్ట్రంలో బయల్పడిన అతి పెద్ద చమురుబావిని గుజరాత్ వ్యాపారే కొనుగోలు చేసాడు. అంటే మనవద్ద కొని, మళ్ళీ మనకే అమ్ముతాడన్నమాట. ౧౦ సంవత్సరాల క్రితం సబర్మతి River Bed లో కొన్ని కిలోమీటర్ల పరిధిలో స్థలం ఖాళీగా వుంది కదా అని కొంతమంది పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడు ఆ నది నిండుగా ప్రవహిస్తూ గాంధి ఆశ్రమాన్ని ప్రేమగా స్పృశిస్తూవుంది. బీడు పడి, సంవత్సరాల తరబడి నీటి చుక్కే కరవైన “కచ్” ప్రాంతంలో కాలవల్లోకి నర్మద నీరు వదిలితే, అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయి వుబ్బితబ్బిబ్బై పోయారు. కరంట్ కోత అంటే ఏమిటో గుజరాతీయులకి తెలీదు. కరంటు పోవడం సంవత్సరానికి ఏ రెండు సార్లో లేక మూడు సార్లో అంటే మీరు నమ్మగలరా?. అభివృద్ధి అనేది అంచలంచలుగా జరిగేది. ఇది కేవలం ప్రభుత్వం చేతిలో లేదు. నిజమైన అభివృద్ధి ప్రజల సహకారం తోటే సాధ్యం. దానిని చక్కగా గ్రహించారు గుజరాతీయులు. జనాకర్షక పధకాలు వీరి ముందు పారవు. వీరు, వీరి చరిత్రని, దేశమాతను గౌరవంగా చూసుకుంటారు. పది రూపాయలు సంపాదిస్తే చాలు, భూమి మీద కాలు నిలవని మన ఆంధ్రులు(నాతో సహా) వీరిని చూసి నేర్చుకోవల్సింది చాలా వుంది. భూములు, డబ్బు మాత్రమే కాదు మతం, సంప్రదాయాల్ని కూడా వీళ్ళు సంపదలాగే పరిగణిస్తారు. వీటి జోలికెవరైనా వస్తే ఊరుకోరు. అది మీకూ తెలుసు. ఇక రాహుల్ గాంధి, కాంగ్రెస్ భవిష్య ప్రధాన మంత్రి పదవికి అభ్యర్ధి అన్న విషయం మరవద్దు.

  12. నువ్వుశెట్టి బ్రదర్స్ said,

    రవన్నా! మిమ్మల్ని ఆకర్షించిన విషయం గుర్తుకొచ్చి నాకు నవ్వువస్తూవుంది. మనం ఓడిపోవాలని కోరుకున్నవాడు, ఎవరినైతే ఓడించాలని మనం తీవ్రంగా ప్రయత్నించామో వాడే గెలిచి మనింటికి వినమ్రుడై ఆశీర్వాదం కోసం వస్తే మన భావాలు ఎలా వుంటాయి? అయితే వీళ్ళు రాజకీయవేత్తలు, కేశూభాయి అత్యంత బలమైన, సంపన్నమైన పటేళ్ళ వర్గానికి ప్రతినిధి. ఇటు చూస్తే మోడి పప్పులేని పులగం బా.జ.పా. లో లేదాయె. అదీ గాక మోడి గెలుపుకి కొద్ది రోజుల ముందే కేశూభాయి కి షోకాజ్ నోటీసు కూడా వచ్చింది (ఇప్పించి ఉంటాడు). ఒడిదుడుకులు లేని మనుగడ కోసం ఒకరి సహాయం మరొకరికి తప్పనిసరి. ఏది ఏమైనా ఈ విషయంలో కేశూభాయి ఉన్నదీ పోయె, ఉంచుకున్నదీ పోయె అన్న చందాన మిగిలిపోయాడు.

  13. రాజేంద్ర కుమార్ దేవరపల్లి said,

    ఇది చాలా కాంప్లికేటెడ్ విశ్లేషణ.పాఠకులు ఎవరికి తోచిన వ్యాఖ్యనాలు వాళ్ళు చేసుకోవటానికి ఆస్కారం కలిగించేది.గుజరాత్ లో కొత్తగా ఓడిపోవటం వల్ల కాంగ్రెస్ కు ఇంకోసారి పోయేదేమి లేదు.కానీ మోడి గెలవటం వల్ల బిజేపిలో కొత్త భయాలు మొదలయ్యాయి.గుజరాత్ ఎటూ మోడిని దాటిపోదు.కానీ రేపు అతగాడు పార్టీని నియంత్రించే కీలకశక్తిగా ఎదిగే ప్రమాదమే ఇప్పుడు వాళ్ళకు ఎక్కువ కనిపిస్తొంది.ఇన్నాళ్ళకు సింధీ అద్వానీని ప్రధాని అభ్యర్ధిగా మొత్తం మీద అంగీకరించారు.ఏదీ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విజయం సాధించి నప్పుడు,లేదా మళ్ళీ యండీయే ప్రయోగం పునరావృతం అయితే,మరి ఈలోపు ముర్ళీ మనోహర్ జోషీ,వెంకయ్యనాయుడు,అరుణ్ జైట్లీ,రాజ్నాధ్ సింగ్,సుష్మస్వరాజ్, రాముడు మేలుచేస్తే రాజస్థానం నుంచి వసుంధర,ఇలా ఇందరు ఆశావహులు ఎవరి ప్రయత్నాలలో వాళ్ళుంటే ఇప్పుడు మోది వచ్చి నాసంగతేంటని కూర్చుంటే ?విశాఖపట్నం పోర్టు ట్రష్టు లాగా గుజరాత్ అబివృద్ధి ఎవరూ ఆపలేరు అక్కడి ముఖ్యమంత్రులు కేవలం సాధనాలు.ఒక్కసారి కేంద్రాన్ని ఏలే సరికి బిజేపికి ఎన్ని అవలక్షణాలు రావాలో అన్నీ వచ్చేశాయి.అధికారం లో కిక్కే అది.పశ్చిమబెంగాల్లో జ్యోతిబసు ను అంగీకరించినట్లు దశాబ్దాలు ఇక్కడ మోదిని కొనసాగనివ్వరు ఇదేదో శుభం పలకరా అన్న సామెత లా ఉండొచ్చు కానీ పూర్తి కాలం మోడీని కొనసాగనివ్వరనేది మాత్రం రేపు జరగబోయే నిజం. కేవలం కాంగ్రెస్ వ్యతిరేకతే గుజరాత్ లో బిజేపి బలం ఏది పెరిగి ఏది తగ్గినా తక్కెడ తారుమారవుతుంది

  14. vookadampudu said,

    మీరు ౨౦౦౯ ( మధ్యంతరం లేదుగా) ఆయన ప్రధాని అభ్యర్ధి అను చెబితే నేను నా తలబాదుకోవటం తప్ప చేశేదేమీలేదు. వారు కాంగిరేసు వాళ్లకి ఆపద్భాందవుడు లాగా కనిపిస్తే తప్పేమీలేదు గానీయండి, ఉత్తరప్రదేశ్ లోనూ గుజరాత్ లోను వీరి ప్రచారాం పనిచేయకపోవటం భారత రాజకీయాలలో ఆశావహ పరిణామం. ౮౪ లో ప్రతిభకలవారిని పక్కనబెట్టి ప్రధానమంత్రి ఎంచుకున్నందుకు కాంగిరేసు మూల్యం చెల్లించింది. మరి ఆ తప్పునుంచి పాఠం నేర్చుకుందొ లేదో తెలియదు. రాబోయే తరం లో కూడా యువ నేతలు కేవలం కుటుంబ నేపధ్యం చూసే తమ ప్రధానిని ఎన్నుకుంటారంటే నాకు నమ్మబుద్ది కావటం లేదు. శ్రీ గాంధీ గారికన్నా రెండవ తరానికి చెందిన పైలట్, సింధియా యువ నేతలకు దేశచరిత్ర మీద, దేశరాజకీయాల మీద అవగాహన ఎక్కువ. భవిష్యత్తు లో భారత పౌరులు “కాదు మేము ఇంకా మారలేదు, సొట్టబుగ్గలు చూసి, మాసు సినిమాలో చెప్పిన డవిలాగులు చూశే ఓటేస్తాం” అంటారని నేను అనుకోవటం లేదు.
    నెనరులు.

    రాజేంద్ర కుమార్ గారు,
    మోదీని పీఠంమీద నుంచి తొలగించరనే నేనూ అనుకుంటూన్నాను. తొలగిస్తే పార్టీలోనో, దొరికితే కేంద్రంలోనో పదవి చూపించాలి. దానికన్నా గుజరాత్ లో ఉంచటమే కాస్త తలనొప్పి తక్కువ వ్యవహారం.
    నెనరులు.
    - ఊకదంపుడు

  15. kk said,

    అవును ఊకదంపుడు గారుతో నేనూ ఏకీభవిస్తున్నాను.రాహులు ని భావి ప్రదానిగా ఈ ముసలి కాంగిరేసు వాళ్ళు భజన చేసినా వారిని చూసి వోటు వేస్తారను కోను.ఎవరన్నా ప్రతిపక్షం వాళ్ళు గెలవాలంటే రాహుల్ ని ప్రచారానికి రప్పిస్తే సరి.

  16. రమణ గుడిపాటి said,

    ఏమో? ఇప్పుడిఫ్ఫుడే సోనియా తన తనయుడికి, ఒక్కో బాధ్యతా పెంచుతూ వస్తూవుంది. మరో 10, 15 ఏళ్ళలో ఆయనకూడా ముదురు నాయకుడు, అవుతాడేమో, ఊకదంపుడు గారు ఉదహరించిన వాళ్ళని ఇంతవరకూ రాజేష్ పైలట్, మాధవరావ్ సింధియా తనయులు గా తప్ప వారి పేర్లు కూడా భారతీయులకి సరిగా తెలీదు. ఎవరో ఒకరు నాయకుడు కావాలి కాబట్టి, ఆయన్నే తమ నాయకుడి గా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నుకోవటానికి వెనుకాడరనే నేనూ అనుకుంటున్నాను. ఓడి పోతుంది అనుకున్న కాంగ్రెస్ రాజీవ్ గాంధి దారుణ హత్యతో మళ్ళీ గద్దె నెక్కలేదా? ఇప్పుడు మాత్రం గద్దె మీద మన్మోహనుడున్నా, జరిగే సంఘటనలు చూస్తూ వుంటే మనముండేది క్రిస్టియన్ ప్రభుత్వ పాలనలోనే అని అనిపిస్తుంది.

  17. రాకేశ్వర రావు said,

    మీ విశ్లేషణ బాగుంది, కానీ అంత క్లిష్టమైనది గా తటస్థించే గుజరాతు ఎన్నికల అంశానికి మీరు మరీ ఇంత సరళమైన మఱియు మనసుకు సమ్మతమైన వివరణ ఇస్తుంటే, నాకు జీర్ణించుకోవడానికి కొద్దిగా కష్టంగానే వుంది…

    ఇక రాజీవ్ గాంధీ విషయానికి వస్తే, ఎవరేఁవన్నా, అతనికి లైబాయ్ సబ్బులాగా మంచి బ్రాండు ఇమేజీ వుంది.. ఇక వంశపూజ్యం నుండి భావిభారతపౌరులు తేరుకోవడానికి ఊకదంపుడుగారు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సమయమే పట్టవచ్చు.

  18. నువ్వుశెట్టి బ్రదర్స్ said,

    ** రాకేశ్వర రావు**
    పరీక్షలకి సంవత్సరం పొడుగూతా ఎంత చదివినా, పరీక్షకి ఒకటి, రెండు రోజుల ముందు చదివేదానిమీద ఒక్కోసారి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఎన్నికలకి కూడా ఇది వర్తిస్తుంది. అదీగాక 2002 నించి మతకలహాలు జరగకుండా చూసాడు మోడి.

    ***రాజేంద్ర కుమార్ దేవరపల్లి***
    ప.బెంగాలు లో ఉండిన వ్యక్తిపూజ, కమ్యూనిజం పట్ల ఆరాధన లాంటివి గుజరాత్ లో లేవు. మోడియే రావాలని ని గుడ్డిగా కోరుకునే వాళ్ళు అతి తక్కువశాతం ఉన్నారు. హిందువులు, చాలామంది ముస్లిములు స్థిరమైన ప్రభుత్వాన్నే కోరుకున్నారు.
    **చదువరి**
    రెండు ముక్కల్లో సరిగ్గా చెప్పారు. అదే జరిగింది. గోద్రా పేరెత్తితే నాకే ఒక్కోసారి గుండె ఝుల్ మంటుంది. ౨౦౦౧ భూకంపం కన్నా భయంకర అనుభవాలయ్యాయి.

    **వికటకవి **
    ఎంతసేపూ చీప్ ట్రిక్స్ తప్పితే ప్రజల మనోభావాలని కాంగ్రెస్ ఏనాడూ అర్ధంచేసుకోవటానికి ప్రయత్నం చేయలేదు.
    **kk**
    ఒక్క మగాడు, కాని టెర్రరిస్టులతో ఆయనకి ముప్పే.
    **రానారె**
    ఎంతో మంది ముస్లిములు ఈసారి మోడి ని సమర్ధించారు, ముఖ్యంగా వ్యాపార వర్గాలకి చెందినవారు.
    **ఊకదంపుడు**
    అభివృద్ధి లేకున్నా ఫరవాలేదు, ఆనాటి భయంకర, కిరాతక కలహాలు మాకొద్దు అన్నట్లుగా ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా హిందు, ముస్లిం లు కలసి నివసిస్తున్న ప్రదేశాలలో. ఆ గాయాలు మానేసరికి మరో ౫ ఏళ్ళు పట్టచ్చు.
    **నేమాని రామక్రిష్ణ**
    చాలా చాలా ధ్యాంక్స్.

    **పాలకుర్తి**
    మీరన్నది అక్షరాలా నిజం. రామసేతు విషయంలో ముస్లిం ఓట్ల కోసం చీప్ గా ప్రవర్తించి ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది కాంగ్రెస్. అనుభవించక తప్పదు.

    ***రమణ గుడిపాటి***
    కాంగ్రెస్ ఎప్పుడూ అస్త్రాలకోసం వెతుకుతూనే వుంది తప్ప, సిద్దాంతాలు, నైతికవిలువల్ని పట్టించుకునే స్థితిలో లేదు.

Post a Comment