ముత్యమంత ముద్దా?
May 5, 2008 — నువ్వుశెట్టి బ్రదర్స్













పండగ పూట విడాకులేంటి వీడి మొహం అనుకుంటున్నారా? కాస్త ఆగండి. అహ్మదాబాద్ కి వచ్చిన కొత్తల్లో బయటకి అడుగుబెడితే అన్నీ గుడ్లప్పగించి చూడటం తప్ప ఇంకేమీ చేయలేకపోయే వాళ్ళం. ఎక్కడ సైన్ బోర్డ్ లు చూసినా గుజరాతీలోనే, బస్సు పేర్లూ, నంబర్లూ గుజరాతీలోనే. ఎవడ్ని కదిలించినా హిందీలోనో లేకపోతే గుజరాతీలోనే జవాబు చెప్పేవాళ్ళు, వాళ్ళు నమిలే పాన్ మసాలా తుంపర్లతో మమ్మల్ని తడిపేసి. గుజరాతీ అక్షరాలు కాస్త హిందీని పోలి ఉండటం వల్ల కష్టపడి కొన్ని అర్ధం చేసుకోగలిగే వాళ్ళం. కాని ఆ నంబర్లు మాత్రం మమ్మల్ని గిజగిజలాడించేశాయి. సిటీ బస్సుల నంబర్లు గాని, పేర్లు గాని గుజరాతీలోనే ఉండేవి. ఆ అక్షరాలు కూడబలుక్కుని చదివేలోపు బస్సు వెళ్ళి పోయేది.ఇక లాభంలేదని, నంబర్లు తెలుసుకోవటానికి ఒక అయిడియా కనిపెట్టాం. బస్సు టిక్కెట్ మీద 1 నుంచి 9 వరకు గుజరాతీ నంబర్లు ఉంటాయి కదా (మన RTC వారి టికెట్ అయినా నంబర్లు ఉంటాయి) దాన్ని చేతిలో పట్టుకుని కంపేర్ చేసుకునే వాళ్ళం. అప్పటినుంచి జేబులో ఒక టికెట్ ముక్క పెట్టుకుని తిరిగాం కొన్నాళ్ళు డిక్షనరీ లాగ.
మేము ముగ్గురం రూంమేట్స్ ఉండే వాళ్ళం. అందరం తెలుగు వాళ్ళమే. ఒకే సారి జాయిన్ అవటం వల్ల, ఒకే వయస్సు వాళ్ళం అవటం వల్ల ఫ్రెండ్లీ గా ఉండేవాళ్ళం. ముఖ్యమైన ఇంటిపనిని మొత్తం ఆరు పనులుగా విభజించాం. ఉదయాన్నే మంచి నీళ్ళు పట్టటం, అంట్లు తోమటం, అన్నం, కూర,మళ్ళీ సాయంత్రం అన్నం , కూర. వీటిలో తలా రెండు పనులు చేయాలనమాట. నెలకొకరం కూరగాయలు తేవాలని నిర్ణయించుకున్నాం. అలా నేను మార్కెట్ కెళ్ళి కూరగాయలు తేవాల్సిన రోజు రానే వచ్చింది. వంకాయలని వంకాయలంటారు, బెండకాయలని బెండకాయలంటారని తెలుసుగాని వాటిని వీళ్ళేమంటారో తెలీదు. అయితే దానివల్ల పెద్ద సమస్య రాలేదు, వాటిని చూపిస్తే చాలు కదా అమ్మే అతనికి. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎన్ని కావాలో అడిగినప్పుడే. బుర్ర పాదరసంలా పనిచేసింది, అక్కడ కూడా అదే టెక్నిక్ ఉపయోగించి అరకేజి రాయి తీసి తక్కెడలో వేశాను, కొన్నింటికి పావుకిలో రాళ్ళు వేసి ఆ పూటకి తప్పించుకున్నాను. ఈ సమస్య మిగిలిన వాళ్లందరికీ వచ్చి ఉండటం వల్ల అందరం సరదాగా నవ్వుకున్నాం. అయితే నాకు ఏడుపుతెప్పించిన సంఘటన ఒకటి జరిగింది ఒకసారి. కొన్న కూరగాయలయిపోగానే మళ్ళీ మార్కెట్ కి వెళ్ళవలసి వచ్చింది. ఈ సారి ముందు జాగ్రత్తగా ఇంటి ఓనరమ్మనడిగాను, “పావుకిలోని ఏమంటారు ఇక్కడ?” అని “పావుకిలోని అడీ సౌ, అరకిలోని ఆదాకిలో అంటారని” చెప్పింది నవ్వుతూ. సరే వాటినే మననం చేసుకుంటూ వెళ్ళాను ధైర్యంగా. వంకాయలోడి దగ్గరకి వెళ్ళాను ట్రైల్ వేద్దామని. అప్పటికి వంకాయల నేమంటారో ఇంకా తెలీదు నాకు. వాటిని చూపించాను, ఇవి కావాలన్నట్లు. “ఎన్ని కావాలి?” అని అడిగాడు. నేను ఓనరమ్మ చెప్పిందే మననం చేసుకున్నాను. దాన్ని తెలుగుకి అన్వయించి ఒక వెధవ లాజిక్ మనసులో పెట్టుకున్నాను. తెలుగులో అరకిలోని వీళ్ళు ఆదాకిలో అంటున్నారు కదా అలాగే మన పావు కిలోని ఆంటీ చెప్పిన అడీసౌ ని మార్చి, “అడీసౌకిలో కావాలి” అన్నాను వాడితో. అతను మామూలుగా తూయటానికి తక్కెడ నెత్తి , అదిరిపడ్డాడు. “ఏమిటీ!! అడీసౌ కిలో కావాలా? ఈ పూర్తి మార్కెట్ లో ఉన్న అన్ని వంకాయలని తూసినా అన్ని వంకాయలుండవు” అని తక్కెడ వదిలేశాడు. ఇదేం ఖర్మరా భగవంతుడా అనుకుని వాడికా రెండు తూనిక రాళ్ళు చూపించి వాడిచ్చిన నాలుగయిదు వంకాయలు తీసుకుని, వాడి మొహం చూడబుద్ది గాక బతుకు జీవుడా అనుకుని గుంపులో కలిసిపోయాను. అడీసౌ అంటే 250 అనీ, అడీసౌకిలో అంటే 250 కిలోలని ఇంటికొచ్చిన తరువాత తెలిసి నా మొహం కందగడ్డ లాగా మారిపోయింది.
సరే ఈ చిన్న చిన్న అవమానాలకేమీ లెక్క లేదు గాని, అసలు అది అవమానమో? లేక అమాయకత్వమో? తెలీని ఓ విచిత్ర సంఘటన మేమిక్కడ అడుగిడిగిన తరువాత వచ్చిన మొట్టమొదటి ఉగాది రోజు జరిగింది. ఇప్పటికీ దానికి నవ్వాలో ఏడవాలో తీలీదు నాకు. గుజరాతీయులు పండుగలను చాలా వినూత్నంగా, ఆనందంగా, మనఃస్పూర్తిగా జరుపుకుంటారు. అందులో లీనమైపోతారు. దసరా నవరాత్రులలో గర్భ నృత్యాలే దానికి నిదర్శనం. ఆసమయంలో డాన్స్ చేయని గుజరాతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. భార్యా భర్తలు కలిసి అడుగులో అడుగేసుకుంటూ పబ్లిక్ గా నృత్యం చేయటం మన వైపు ఊహించగలమా. అసలు డాన్స్ చేయటమంటేనే సిగ్గు పడతాము. వీళ్ళింతగా సక్సెస్ అవటానికి వీరి సంప్రదాయాలే చాలావరకు దోహదపడుతున్నాయని అనిపిస్తుంది. సరే అసలు విషయానికొస్తే ఇలా ఒక్కో పండగ దాటు కుంటూ ఉంటే ఒక విషయాన్ని గమనించాం. వీళ్ళు మంగళ తోరణాలుగా మామిడాకులు వాడటం లేదు, అశోక ఆకులు వాడుతున్నారు. రెండూ ఇంచుమించు ఒకేలా ఉంటాయి కదా. పిచ్చోళ్ళు, వీళ్ళకి మామిడి చెట్లు లేక ఇవి వాడుతున్నారనుకున్నాము మొదట్లో. కాని అవి వారికి చాలా పవిత్రమైన ఆకులని తరువాత అర్ధమైంది. మనం పండుగలప్పుడు మామిడాకులని ఎలా పవిత్రంగా భావిస్తామో వీరు అశోక (ఆశోపాలవ్) ఆకులని అంతే పవిత్రం గా పూజిస్తారు. అన్ని రకాల పూజల్లోనూ ఇవే వాడుతున్నారు. అయితేనేమి వీరు గుజరాతీయులు, మనం ఆంధ్రులం. మనం మన మామిడాకులే కట్టుకుందాం అని మేం నిర్ణయించుకున్నాం. అయితే అవి ఎక్కడ దొరుకుతాయి? వెతికీ వెతికీ ఒక చెట్టుని పట్టాం (ఈ పదేళ్ళలో నేను కేవలం మూడు మామిడి చెట్లను మాత్రమే చూశాను అహ్మదాబాద్ లో).
ఉగాది ఉదయాన్నే తలస్నానం చేసి, శుచిగా కొన్ని ఆకులు గ్రుచ్చి వాటిని తోరణం గా కట్టాం. మాలో ఒకడు ఉగాది పచ్చడి చేయటం లో మునిగిపోయాడు (యాక్! మీకు చేయటం రాకపోతే ఊరుకోవచ్చుకదా! అని చివాట్లు పెట్టారు అది తిన్న గుజరాతీయులు తరువాత). ఇంతలో వాకిట్లో ఏదో శబ్ధం, ఏవో తెగిపోతున్నట్లు ఫట్ మని, ఆకులు రాసుకున్నట్లు. వెంటనే బయటికొచ్చి చూశాము. మా ఇంటి ఓనరు మన మామిడాకుల తోరణాన్ని తెంపేసాడు. “ఓరి దుర్మార్గుడా!” అనుకుని “ఏమిటీ అన్యాయం?” అని ప్రశ్నించేలోపు ఓ మోపెడు ఆశోక ఆకులు తెచ్చి ఇంటి ముందు పడేశాడు. “మీకు తెలీకపోతే మమ్మల్ని అడగఖఃరలేదా? పండగపూట ఈ పిచ్చాకులు కడుతారా?” అని కిందపడి ఉన్న మామిడాకుల తోరణాన్ని చూపిస్తూ నిష్టూరమాడాడు. “ఇవిగో వీటిని కట్టుకోండి” అని అశోక ఆకుల్ని తోరణంగా కట్టిచ్చాడు. ఈయనకిట్టగాదని ఇంట్లోకి పిలిచి ఉగాది పచ్చడి పెట్టాము. అది తిని కొంచెం చల్లబడ్డాడు. ఇలా జీవితానికీ, రుచులకీ ముడిపెట్టిన మన సంప్రదాయాన్ని పొగిడి, మమ్మల్ని ఆశీర్వదించి ఈ పిచ్చాకులు మళ్ళీ ఎప్పుడూ కట్టబాకండని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆ అశోక ఆకులు తలకి తగిలినప్పుడల్లా మామిడాకులు గుండెల్లో గుచ్చినట్టుండేది. అంతే ఆ రోజునుండి మామిడాకులకీ మాకు కనక్షనే తెగిపోయింది.

తొమ్మిదేళ్ళ క్రితం అహ్మదాబాదుకి ఉద్యోగంలో చేరటానికి వెళ్ళేంత వరకు నన్ను నేను ఒక సెక్యులరిస్ట్ గా ఊహించుకుని గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. స్నేహితుల్లో ముస్లిములు, క్రిస్టియన్లు ఇంకా అనేక ఇతర మతాల వారుండటంతో నాలో నేనే గర్వపడేవాడిని. అయితే అహ్మదాబాదు లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే గర్వమంతా అణిగిపోయింది. దీనికంతా కారణం ఒక లుంగీ. పొట్ట బొడిస్తే హిందీ ముక్క రాని నేను ఎట్టకేలకు సిటీ అంతా తిరిగి ఆఫీసులో ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్నాను. ఉద్యోగంలో చేరేటప్పుడు నా దగ్గర ప్రతిజ్ఞ (అదో ప్రొసీజరులే) తీసుకున్నపెద్దాఫీసరు నాకు షేక్ హ్యాండిచ్చి ఒకటే మాట చెప్పాడు. “నువ్వు హిందువయితే నది (సబర్మతికి) కి పడమర వైపు ఇల్లు తీసుకో, ముస్లిం అయితే నదికి తూర్పు వైపు తీసుకో” అని. ఈ మాటలిన్నాక నేనాయన్ని ఏమనుకోవాల? ఈడి ముండ మొహాన ఎండ గాయ,ఈ ఊర్లో ఇట్ట అడుగు బెట్టామో లేదో హిందువనీ ముస్లిమనీ గొడవలు పెట్టేటట్టు ఉన్నాడు మహానుభావుడు అనుకున్నాను. బుద్ది గా ఆయనమాట ఆనాడు వినుంటే, ఎన్నో భయానక అనుభవాలు తప్పిపోయిఉండేవి. మతకలహాలప్పుడు, తిండినిద్రా కరువయ్యుండేది కాదు. చీమ చిటుక్కుమన్నా గుండె ఝల్లుమనేది కాదు. చాకు పట్టుకోవటం కూడా సరిగా రాని మాకు పెద్ద పెద్ద కత్తులు, బరిశలు ఇచ్చి, ఎవరైనా మన సొసయిటీ మీద దాడి చేస్తే అందరం కల్సి వాళ్ళతో పోరాడాల అని చెప్పిన ఇంటి ఓనరు. చీపురు కట్ట పెట్టే దగ్గర ఈ కత్తులు బరిశలు పెట్టాల్సి వచ్చింది కదరా దేవుడా అని వాటిని చూసినప్పుడల్లా, మేము ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం. ముస్లిం పేరున్న ఓ హిందు స్నేహితుడి వల్ల ఒకనాడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం. అలాగే మేము ఈ పాత బస్తీ నుండి మకాం ఎత్తేసి సబర్మతి నదికి పడమరవైపుకి మార్చినప్పుడు మమ్మల్ని వదలలేని రజాక్ అనే ముస్లిం స్నేహితుడిని రాజు అని అందరినీ నమ్మించి, రెండేళ్ళ తరువాత ఆ నిజం బయటపడి మళ్ళీ అక్కడి నుండి రాత్రికిరాత్రే మకాం ఎత్తేయటం…ఇలా ఒకటని కాదు, కాని మాలో మాకు ఎంత స్నేహమున్నా, చివరకి హిందువులం పడమరవైపు ముస్లిములు తూర్పువైపు స్థిరపడాల్సి వచ్చింది. ఇలా అనేక ఆసక్తికరమైన సంఘటనలు ఎన్ని జరిగినా, ఈ లుంగీ ఎపిసోడ్ మాత్రం జాతి వైషమ్యాల విషయంలో నాకు జరిగిన మొట్టమొదటి తమాషా అనుభవం. అది ఎలా జరిగిందంటే…
కాశీమజిలీ కథల్లో లాగ “ఓ రాజకుమారా! నువ్వే దిక్కు కయినా వెళ్ళు గాని ఆ ఉత్తరం దిక్కుకు మాత్రం వెళ్ళద్దు.” అని పేదరాశి పెద్దమ్మ చెప్పినట్టు ఆ ఆఫీసరు చెప్పింది బుద్దిగా విని పాటించక నదికి తూరుపు దిక్కున, చుట్టూ ముస్లింలు ఉండే ఓ హిందూ సొసైటీలో మిద్దె మీద గది అద్దెకు తీసుకున్నాను. ఓ పదిరోజుల్లోనే ఆయన మాటల్ల్లో వాస్తవం అర్ధమై దిమ్మదిరిగిపోయింది. ఈ పదిరోజుల్లో పరిసరాలు కాస్త పరిచయమయ్యి, ఫ్రీ గా తిరగటం , ఎవరైనా పలకరిస్తే నవ్వటం వంటివి జరగతున్నాయి (మాట్లాడాలంటే భాషరావాలిగా) . ఆంధ్రాలో ఉన్నప్పుడు లుంగీలు ఎక్కువగా కట్టేవాడిని, కనీసం అహ్మదాబాద్ వెళ్ళినతరువాత అయినా షార్ట్ లు వాడదాం అన్న కోరిక మనసులో ఉండిపోయింది. ఇదా కొత్త ప్రదేశం, అసలేపెళ్ళైన ఆడవాళ్ళు కొంగు తలపై నుండి తీయటం లేదు. ఇక అవేసుకుని తిరిగితే ఏమేమి సమస్యలు వస్తాయో అని షార్ట్ లని వాయిదా వేసి లుంగీలే వాడుతున్నాను.
అప్పటికే ఆఊరి అమ్మాయిల అందాలకి పరవశుడ్నైపోయి ఉన్నానేమో. ఓ శలవు దినాన షేవింగ్ చేసుకుని గ్లామరస్ గా తయారయి ఊరిమీద పడదామనుకుని, బ్లేడ్ కోసమని మెట్లు దిగి కిందకు వచ్చాను. మెట్లు దిగేటప్పుడు లుంగీ కాళ్ళకి అడ్డు పడుతుందని పైకి మడిచి కట్టడం అలవాటుకదా. అప్పుడు కూడా అలాగే దిగి, ఈ రోజు ఏఏ పార్కుల్లో తిరిగివద్దామా? అని అలోచించుకుంటూ సొసయిటీ బయట ఉండే ఓ షాప్ కెళ్ళి బ్లేడ్ కొని, తిరిగి సోసైటీలో అడుగు పెట్టాను. అంతే అక్కడో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. నేను ఆశ్చర్యపోయాను. బ్లేడ్ కొనటానికి వెళ్ళేటప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. ఈ పదినిమిషాల్లో ఏమైందబ్బా? అనుకుని. అహ్మదాబాద్ లో మొదటి గొడవ కదా! ఓ గోడ వారగా నుంచుని చోద్యం చూడసాగాను. మనం అక్కడ చూడగలమే గాని, ఆ గుజరాతీభాష ఒక్క ముక్క కూడా అర్ధం జేసుకోలేము కదా. నాకర్ధమైందేమిటంటే, అక్కడ రెండు గ్రూపులు గొడవాడు కుంటున్నాయి. నాకు కాస్త ముఖపరిచయం ఉన్న వాడిది మన బ్యాచ్ అనుకుంటే, ఎదుటి గ్రూప్ వాడిని ఎవరూ పట్టలేకున్నారు. ఎవరినో కొట్టడానికి పై పైకి వస్తుంటే వాడిని అందరూఆపుతున్నారు. చివరికి మన గ్రూప్ లీడర్ కూడా వాడిని శాంతింప జేస్తున్నాడు. అయితే నన్ను కలవర పెట్టిన విషయం ఏమంటే, మాటి మాటికీ నా పేరు ఆ గొడవలో వినపిస్తూ ఉండటం. అందరి చూపులూ నామీదే ఉన్నాయి. నాకాళ్ళు సన్నగా వణకసాగాయి. ఏమైఉంటుందిరా భగవంతుడా? అనుకుంటుండగా నాకు తెలిసిన గ్రూప్ లీడరు నా వైపు వచ్చాడు. ఏంది గొడవ? అని అడిగాను. “ఏందా? ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు నీ లుంగీని పైకి మడిచి ఎందుకు కట్టుకున్నావు? ఇక్కడ ముస్లిములే అట్టా కట్టుకుంటారు. నువ్వు ముస్లిమ్ వో లేక వారి మద్దతుదారుడివో అయ్యుంటావని నిన్ను కొట్టడానికి వస్తూంటే నేనాపాను. సౌత్ ఇండియన్లు అలాగే కడతారు అని అంటే వాడు వినటం లేదు. నాతోనే గొడవపెట్టుకుంటున్నాడు.” అన్నాడు పాన్ మసాలా నవులుతూ. ఇదన్న మాట విషయం. నేను వారి మధ్యకెళ్ళి సర్ధిచెప్పిమాట్లాడాలంటే మనకటు హిందీ రాదు ఇటు గుజరాతీ రాదు. మరో కొత్త గొడవని సృష్టించుకోవటం దేనికనుకుని. నా లుంగీ పైకుందా? కిందికుందా? అని ఓ సారి చూసుకున్నాను. “సరే నువ్వెళ్ళు నేను చూసుకుంటాలే, బయట మాత్రం లుంగీని ఎగకట్టకు” అని అనటంతో, సరే కొట్టుకుచావండి అనుకుని మెల్లగా నా రూంకి వెళ్ళిపోయాను. అయితే ఈ సారి మెట్లెక్కేటప్పుడు లుంగీ పైకి మడవలేదు కాని మనసులో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. షేవింగ్ చేసుకున్నానో లేదో గుర్తులేదు కాని త్వరగా తయారయి, బస్ ఎక్కి లాల్ దర్వాజా మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ ఓ అరడజను షార్ట్ లు కొని సాయంత్రానికి తిరుగుముఖం పట్టాను.ఆహా నాచేత షార్ట్లు వేయించటానికి ఆ పైవాడు హిందు ముస్లింల గొడవలు రేపాడే అనుకుని, ఆ రోజునుండి షార్ట్ లు వేసుకుని కులకటం మొదలుపెట్టాను.అవి మోకాళ్ళ పైకి ఉండి అర్ధనగ్నంగా కనిపిస్తూఉన్నా ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేకుండాపోయింది. అంతే ఆనాడు విప్పిన లుంగీ మళ్ళీ కట్టనే లేదు అహ్మదాబాద్ లో.అలా లుంగీ పోయి నిక్కరు వచ్ఛే ఢాం..డాం…ఢాం.

మన పూలవాన రవికిరణ్ తెలుగులో (పిలిచి) చేసిన తన సోదరుని వివాహ ఆహ్వానపత్రిక ఈ వీడియోలో వీక్షిద్దాం …….
ఈమధ్య బ్లాగులోకములో “చార్వాకుడు” గురించి జరిగిన చర్చకు స్పందించి మాకు తెలిసిన ఈ కొద్దిపాటి సంగ్రహాన్ని కూడా దానికి తోడుగా అందిస్తున్నాము…
రమగారూ! చార్వాకుల గురించి ఈ కంప్యూటర్ కాలంలో అడిగారు కాబట్టి సరిపోయింది. అదే పురాణకాలంలో అడిగి వుండి వుంటే…..అనుమానం లేదు గొడవలు జరిగిపోయి ఉండేవి.
అత్యంత బాధాకరంగా అంతమైన చార్వాకుని కథ గురించి తెలుసుకునే ముందు ఈ చార్వాకుల శాఖ గురించి తెలుసుకోవటం ముఖ్యం.
చార్వాక, లోకాయత, బార్హస్పతి అని అనేక పేర్లు గలవు ఈ శాఖకు.
‘లోకేషు అయతాః లోకాయత’
‘లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా ఒక మూల పురుషుడు లేడు. ఇది సామాన్య ప్రజల్లో పుట్టిన ‘అనుమాన’, ‘తర్క’ ల ప్రభావమే. మనం భగవంతుడికి ప్రసాదం రోజూ పెడుతూనే వున్నాం కాని ఆయన ఎప్పుడన్నా దాన్ని తిన్నాడా? ఇలాంటి తర్కాలను లేవదీసి, చివరకు ఆనాటి అధ్యత్మికవాదులచే తిరస్కరింపబడ్డారు ఈ లోకాయతులు.
14వ శతాబ్ధికి చెందిన మాధవాచార్య తన ‘సర్వదర్శక సంగ్రహం’ లో ఇలా వివరించాడు. “సంపదనూ, కోరికలనూ…మానవ లక్ష్యాలుగా భావించి, సంతోషాన్ని ధ్యేయంగా పెట్టుకున్న విధానాన్ని, సూత్రాలను అనుసరించుతూ, భవిష్యత్ ప్రపంచ వాస్తవికతను నిరాకరించే మానవ సమూహాన్ని చార్వాక సిద్దాంతాన్ని అనుసరించే వారిగా గుర్తించవచ్చు. వారి సిద్దాంతానికి మరోపేరు ‘లోకాయుత’. వస్తు రీత్యా సరైన పేరు.”
దేవుడు లేడు, ఆత్మలేదు, మరణానంతరం మిగిలేదేమీ లేదు అని నమ్మి ఇంద్రియసౌఖ్యాలకి ప్రాధాన్యత నిచ్చిన వీరిని చరిత్ర భౌతికవాదులుగా పేర్కొనింది.
ఆనాటి సమాజంలో రాజకీయంగా, ఆర్ధికంగా బలవంతులైన వైదిక సంప్రదాయ వాదులచే అణగద్రొక్కబడిన లోకయతుల ప్రాచీన గ్రంధాలన్నీ క్రీ.పూర్వమే ధ్వంసం చేయబడ్డాయని అంటారు. చివరకు వీరి ఆచారాలు, సంప్రదాయాలను, వీరి ప్రత్యర్దుల గ్రంధాల నుండి,(వ్యంగ్య) వ్యాఖ్యల నుండి తీసుకోవలసి వచ్చింది. క్రీ.పూ.300 కి చెందిన కాత్యాయనుడు వైయాకరిణి లోకాయతపై ‘భాగురి వ్యాఖ్యానం’ ఉదహరించాడు. అంటే ఆ కాలం లోనే లోకాయత గ్రంధమూ, దానిపై వ్యాఖ్యానమూ వున్నాయన్నమాట.
‘బ్రహ్మ సూత్రాల’ భాష్యంతో శంకరాచార్య వీరిని ‘ప్రకృతిజనాః’(మూర్ఖజనులు) అంటే లోకాయతులనే చెప్పాడు. ‘షడ్ దర్శన సముచ్చయ’ రచయిత హరిభద్రుడు, లోకాయతులను వివేచన లేని గుంపుగా, ఆలోచన లేని సముదాయంగా వర్ణించాడు.
ఆ కాలంలో దీని వ్యతిరేకతలోనే దీని ప్రభావం, శక్తి, ముఖ్యత గోచరిస్తాయి.
సామాన్య బ్రాహ్మణుడినుండి, పాలకుల వరకు లోకాయత శాస్త్రాన్ని అభ్యసించే వారని అనేక ఆధారాలున్నాయి. బ్రాహ్మణుడైన జాబాలి, శ్రీరాముడికి మత విరోధ భావాలు బోధించాడు. బౌద్ధులు పిడి సూత్రాలలో, బ్రాహ్మణులు అభ్యసించే అనేక శాస్త్రాలలో లోకాయత ఒకటని పేర్కొన్నారు. ‘వినయపిటిక’ ప్రకారం, బుద్దుడు ఆపి వుండకపోతే కొందరు బౌద్ధ సన్యాసులు కూడా లోకాయతను పఠించడానికి సిద్దపడ్డారట. బుద్దఘోషుడు లోకాయతను “వితండవాద శాత్త” అని పిలిచాడు. (పాళీభాషలో శాత్త అంటే సంస్కృతంలో ‘శాస్త్రం’.).మహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుతో తన చిన్ననాటి విషయాలు ముచ్చటిస్తూ ద్రౌపది ఇలా అంది. తన చిన్ననాడు, తమతో వుండటానికి ఒక బ్రాహ్మణుడ్ని తన తండ్రి ఆహ్వానించాడనీ, ఆ బ్రాహ్మణుడే తన తండ్రికి, తన సోదరులకు బార్హస్పత్య భావాలను బోధించాడనీ, తనూ వాటిని ఆసక్తితో వినేదాన్ననీ చెప్పింది. ద్రౌపది చెప్పిన విషయాలు విని ధర్మరాజు ఆమెను మత వ్యతిరేక భావాల ప్రభావంలో పడిపోయిందని నిందించాడు. కౌటిల్యుడు తన ‘అర్ధశాస్త్రం’ లో సాఖ్య, యోగశాస్త్రాలతో పాటు, లోకాయతను కూడా ఉదహరించి, దానిని ‘తర్కశాస్త్రం’ అన్నాడు. బాణుని ‘హర్షచరిత్ర’లో విచ్చేసిన ఋషుల జాబితాలో ‘లోకాయత’ పేరు కూడా వుంది.
14వ శతాబ్ధపు జైన వ్యాఖ్యాత అయిన గుణరత్నుడు లోకాయతుల గురించి ఇలా చెప్పాడు. జీవితం బుద్బుదప్రాయం అని తలచి, మానవుడు చైతన్యసహితమైన శరీరం తప్ప ఇంక ఏమీలేదు అన్న అభిప్రాయంతో మద్యపానం, మాంసభక్షణ, అదుపు లేని లైంగిక క్రియలలో పాల్గొనేవారు. కామానికతీతమైన దేన్నీ వారు గుర్తించరు. వారిని చార్వాకులనీ, లోకాయతులనీ అంటారు. పానం చేయుట, నములుట(భుజించుట) వారి నీతి. నములుతారు కనుక వారిని చార్వికులంటారు. (చర్వ్:నములుట). అంటే వివేచన లేకుండా భుజిస్తారట. వీరి సిద్దాంతం బృహస్పతి ప్రతిపాదించాడు కనుక వారిని బార్హస్పత్యులని కూడా అంటారు.
వాస్తవ జగత్తును మినహా , అన్నింటినీ తిరస్కరించినందువల్లే ఈ తత్వశాస్త్రాన్ని ‘లోకాయత’ అంటారని పంచానన తర్కరత్న ఉవాచ. మొత్తానికి అనాటి వైదికసాంప్రదాయాలనూ, మూఢ నమ్మకాలనూ ఎండగట్టి తిరస్కరించినందువలనే, ఈ లోకాయతులు అణచివేయబడ్డారన్నది సుస్పష్టం.
‘మహా భారతం’ లో శాంతిపర్వంలో వున్న ప్రసిద్దమైన చార్వాక వధ.
కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలకొలదీ బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యధిష్టురుని ఆశీర్వదించడానికి ప్రోగయ్యారు. వారిలో చార్వాకుడు కూడా వున్నాడు . మిగతా బ్రాహ్మణుల అనుమతి తీసుకోకుండానే, ముందుకు వెళ్ళి ధర్మరాజు నుద్దేశించి ఇలా అన్నాడు.
“ఈ బ్రాహ్మణ సమూహం, నీ రక్త బంధువులను వధించిన నిన్ను శపిస్తోంది. నీ మనుషులనే, నీ పెద్దలనే సమ్హరించి నీవు సాధించిందేమిటి? నీవు చనిపోయి తీరాలి (నశించాలి)”
హఠాత్తుగా జరిగిన చార్వాకుని మాటలకు, అక్కడ సమావేశమైన బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. యధిష్టిరుడు నైతికంగా గాయపడి మరణించాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికి మిగతా బ్రాహ్మణులు తెలివి తెచ్చుకుని, చార్వాకుడు తమ ప్రతినిధి కాదనీ, బ్రాహ్మణ వేషంలో వున్న రాక్షసుడనీ, రాజ విరోధి దుర్యోధనుని మిత్రుడనీ చెప్పారు. అలాగే తమకు రాజు చేసిన ఘనకార్యాల పట్ల మెచ్చుకోలు మాత్రమే కలదని హామీ ఇచ్చారు. నిరసన తెలిపిన చార్వాకుని నిలువునా దహించి వధించి వేసారు.
‘మహాభారతం’ ప్రకారం పవిత్రులైన బ్రాహ్మణుల చేతిలో దగ్ధమైపోయిన “చార్వాకుడు అంతకు పూర్వం ఒక రాక్షసుడు. కఠోరమైన తపస్సులు చేసి విపరీతమైన శక్తులు సంపాదించాడు. ఆ తరువాత దేవతలను బాధించి అణచివేయటం ప్రారంభించాడు.” అని ముద్రవేశారు . ఇది మామూలే, ఆ రోజుల్లో బ్రాహ్మణ సంప్రదాయాలను వ్యతిరేకించేవారిని రాక్షసులు, అసురులుగా ముద్రవేయటం పరిపాటి.
చార్వాకుడు యధిష్టిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం. ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే.
సామాన్యుని అభిప్రాయాన్ని మతాతీతంగా, సాహసవంతంగా వెల్లడించి ఆవిధంగా సాంప్రదాయవాదుల చేతిలో బలైపోయాడు చార్వాకుడు.
—‘చార్వాకుల’ గురించి అనేక చరిత్రకారులు పరిశోధనలు జరిపారు. వీరిలో ముఖ్యులు యస్.యన్.దాస్ గుప్తా, రాధాకృష్ణన్, తుచ్చి, గార్బే, రిస్ డేవిడ్స్, జార్జ్ ధాంసన్, హెచ్.పి.శాస్త్రి, ఇ.బి.కావెల్. పై వ్యాసంలో అధికవివరాలు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చే ముద్రింపబడిన “లోకాయత –అసుర ధృక్పధం” నుండి చాలా వరకు మక్కికి మక్కి తీసుకున్నాను. దీని మూల గ్రంధకర్త శ్రీ దేవీప్రసాద్ చటోపాధ్యాయ, తెనుగించినవారు శ్రీ హరి పురుషోత్తమరావు.10 రూ. కూడా లేని ఈ చిన్ని పుస్తకంలో చాలా విజ్ఙానముంది.
కొసమెరుపు:ఈ చార్వాకుడి కథ చదివి ప్రభావితులమై, నువ్వుశెట్టి బ్రదర్స్ లో ఒకరి బాబుకి ‘చార్విక్’ అని పేరుపెట్టుకున్నాము. నామకరణం చేసిన పంతులు మాత్రం ఈ పేరువిని ఆశ్చర్యపోయాడు.
![]()
1947, ఆగస్ట్ 15 తరువాతనుంచి భారతదేశ పటం గీయమంటే, ఎవరైనాసరే ఎలగోలా గీసిపడేసెయ్యగలరు. కాని మన దేశ పటానికి ఈ సుందర రూపాన్ని తెచ్చిన వ్యక్తిని గురించి ఈ తరాలవారికి తెలిసింది చాలా తక్కువే . “వల్లగాని పటేల్” గా మన తెలుగు వాళ్ళు ముద్దుగా పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేజారిన ముత్యాలను ప్రోగు చేసి మాల కట్టి దేవుడి మెడలో వేసినట్లుగా, ముక్కలు ముక్కలైపోయి అస్థవ్యస్థంగా ఉండిన మన దేశానికి ఒక రూపునిచ్చి భరతమాత పాదాలకు ఎలా సమర్పించాడో కొంచెం చూద్దాం.
సమస్య :- భారతదేశం అంతటా వ్యాపించి వున్న 565 చిన్నచిన్న రాజ్యాలను దేశం లో విలీనం చేయటం.
సమయం :- కేవలం 10 వారాలు
శత్రువులు :- మహ్మద్ అలీ జిన్నా, అనేక సంస్థానాధీశులు, కొంతమంది బ్రిటిష్ ఉన్నతాధికారులు.
అడ్డంకి :- సంస్థానాలు భారత్ లో కలవాలా? పాకిస్థాన్లో కలవాలా? లేక స్వతంత్ర్యదేశంగా ఉండిపోవాలా అన్న స్వేచ్చని బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఇచ్చింది.
సర్ధార్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా చేసారో తెలుసుకునేముందు, బార్డోలి సత్యాగ్రహంలో ఆయన పాత్రగురించి కొంచం తెలుసుకుందాం.
బార్డోలి సత్యాగ్రహం(1928).
దీన్ని పెద్దలు రామాయణంలో కిష్కిందకాండతో పోల్చారు. రాముడితో హనుమంతుడి కలయిక జరిగింది ఇందులోనే. ఆ కలయికే సీత జాడ తెలుసుకోవటానికీ, రావణ సంహరానికీ దారి తీసింది. గాంధీజిని తన అనుమతిలేకుండా బార్డోలి(గుజరాత్ లో ఓ ప్రాంతం.)లో అడుగు పెట్టద్దని కోరి, ఆయన సిద్దాంతాలకు కట్టుబడి ఉంటూనే తనదైన శైలిలో 88000 మందిని ధీరులుగా మలచి బార్డోలి సత్యాగ్రహాన్ని అహింసాయుతంగా జరిపిని ధీరోత్తముడు ఈ ఉక్కుమనిషి. ఈ సత్యాగ్రహమే భావి భారత స్వాతంత్ర్య సమరానికి దిశానిర్ధేశం చేసింది. మరియు సర్ధార్ పటేల్ లోని సైద్ధాంతిక, ధీరత్వ, నాయకత్వ లక్షణాలను భారతదేశం గుర్తించింది.
1929 డిసెంబర్ నెలలో కాంగ్రెస్ అధ్యక్ష్య పదవికి ఎవరిని ఎన్నుకోవాలి? అని సమావేశం జరిగింది. ఆ రోజుల్లో ఈ పదవినలంకరించిన వారిని “రాష్ట్రపతి” అని సంబోధించేవారు. గాంధీజిని 10 మంది, సర్ధార్ని 5 మంది, నెహ్రూని ముగ్గురు బలపరిచారు. గాంధీజి ఆ పదవిని నిరాకరించారు. అప్పుడు సర్ధార్ వంతువచ్చింది. ఆయన ఒకే ముక్కలో “కెప్టెన్ వెళ్ళకూడదని నిర్ణయించుకున్న తరువాత, అక్కడికి వెళ్ళటానికి సైనికుడికి ఎంత ధైర్యం వుండాలి?” అని వినమ్రంగా తప్పుకున్నాడు. ఆయన సామర్ధ్యానికి అసలైన పరీక్ష తరువాత జరిగింది. అదే Integration of Princely States of India.
1953లో యుగోస్లావియా ప్రెసిడెంట్ అయిన మార్షల్ టిటో భారత్ ని సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక విలేఖరి అడిగాడు. మీకు భారత దేశంలో అమోఘం అనిపించిన విషయం ఏమిటి? అని. ఆయన ఇలా సమాధానమిచారు. “ఒక్క రక్తపు బిందువు కూడా చిందకుండా భారతదేశ విలీనం ఎలా జరిగిందా? అని ఇప్పటికీ నాకర్ధం కావడంలేదు.”
సర్ధార్ లేకుండా వుండి వుంటే ఈ విజయానికి దూరమై మన దేశపు చిత్రపటం ఎంతో అందవిహీనంగా వుండేది. అనితరసాధ్యమైన ఆ పనిని తన్ భుజస్కంధాలపై వేసుకుని విజయవంతంగా ఎలా పూర్తిచేసాడో చూద్దాం.
1948 జూన్ కల్లా భారత్ ని భారతీయుల చేతిలో పెట్టిరమ్మని లార్డ్ మౌంట్ బాటన్ ని 1947 మార్చ్ లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాకు పంపించింది. జూన్ 4 తేదిన ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి, ఆగస్ట్ 15, 1947 న నాయకత్వాన్ని బదిలీ చేస్తామని ప్రకటించారు. అంటే 565 పైచిలుకు ముక్కలుగానున్న వుపఖండాన్ని రెండు ముక్కలుగా (భారత్, పాక్) కుదించటానికి ఇక కేవలం 10 వారాల సమయం మాత్రమే వుంది.
అవతలిప్రక్క ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా ఇదివరకే పాకిస్థాన్, బంగ్లాదేశ్ అనే రెండు భాగాలు పొందినా ఇంకా తృప్తి లేకుండా వున్నాడు. భారతదేశం ముక్కలు ముక్కలుగా అవ్వాలన్నదే అతని ధ్యేయంగా వుంది.అన్నింటికన్నా పెద్ద సంస్థానమైన హైదరాబాద్ నవాబు నిజాం, జిన్నా మద్దతుదారుడు. ఆయన ఆగస్ట్ 15 ‘1947 నుండి తనను తాను స్వతంత్ర్య పాలకుడిగా ప్రకటించుకున్నాడు. Chamber of Indian Princes కి నాయకుడైన భోపాల్ నవాబ్ కూడా జిన్నా అనునూయుడే. ఈయన నిజాం కన్నా మరొక అడుగు ముందుకేసి కొన్ని హిందు సంస్థానాలుకూడా పాక్ లో కలవాలని ప్రతిపాదించాడు. మరొక సమస్య ఏమంటే అప్పటి వైస్రాయ్ యొక్క రాజకీయ సలహాదారుడైన Sir Conrad Corfield పాక్ పట్ల మెతకవైఖరితో వుండేవాడు. ఈ సంక్లిష్ట పరిస్థితులలో ఏం చేయాలో అర్ధంకాక భారత నాయకులు ఆందోళనలో వున్నారు.
విలీనం అనేది మూడు ప్రధాన విషయాలను దృష్టిలో వుంచుకుని జరగాలని మౌంట్ బాటన్ ప్రతిపాదించాడు. అవి 1.రక్షణ 2. విదేశీ వ్యవహారాలు, 3. సమాచారం. కాని సర్ధార్ ఇలాంటి పరిమితులకు వప్పుకోలేదు. ఆ సమయంలో వారిద్దరిమధ్య జరిగిన ఆసక్తికర సంభాషణని చూద్దాం. ఈ సంభాషణే ఈనాడు మనం చూస్తున్న సంపూర్ణ భారతదేశ ఏర్పాటుకు దారి తీసింది. లేదంటే మన దేశపటాన్ని గీయటం ఇప్పుడున్నంత సులభమైవుండేది కాదు.
సర్ధార్ : మీ బుట్టలో “అన్ని” ఆపిల్స్ నింపి అమ్మితేనే కొంటాను. లేదంటే లేదు.
మౌ.బా: నాకొక డజను వదలగలవా?
సర్ధార్ : అవి చాలా ఎక్కువ. రెండు తీసుకోవటానికి వప్పుకుంటాను.
మౌ.బా: మరీ తక్కువ.
Collins & Lapierre ఇలా వ్రాసారు. “కొన్ని నిమిషాల పాటు ఆఖరి వైస్రాయ్ మరియు భారత భవిష్య మంత్రి, తివాచీ వ్యాపారుల్లా ఆ సంస్థానాల కోసం బేరమాడుకున్నారు. చివరకు వాళ్ళిద్దరూ ఒక అంకె దగ్గర ఆగిపొయ్యారు. అది ఆరు. వూహించండి. ఇదు వందల అరవై అయిదు సంస్థానాలు మైనస్ ఆరు. ఇదంతా ఆగస్ట్ 15 కి కేవలం కొన్ని వారాల ముందు. శిల నుండి మలచబడినట్లు దృఢంగా వుండే వ్యక్తిత్వం కలవాడైన సర్ధార్ కాకుండా, వేరెవరైనా మౌంట్ బాటెన్ ముందు కూర్చుని వుండి వుంటే ఈ అద్భుత భారత దేశం మన ముందు వుండి వుండేదా?
పటేల్ అధ్వర్యంలో జరుగుతున్న విలీనంలో ఎంతోమంది సంస్థానాధీశులు హస్తాక్షరాలు చేసేసారు. ఇది జిన్నాకు కడుపుమండించింది. ఆయన భారత దేశంలో విలీనం కావటం ఇష్టంలేని సంస్థానాలను ఆకర్షించటం ప్రారంభించాడు. ముఖ్యంగా ముస్లింలు పరిపాలించే హైదరాబాద్, జునాగఢ్, భోపాల్ మరియు పాక్ కి దగ్గరగా వుండే జోధ్ పూర్, జైసల్మార్ వంటి సంస్థానాలు. అంతటితో ఆగక ఇండోర్, ట్రావన్ కోర్ వంటి వాటిని స్వతంత్ర్య దేశాలుగా నిలబడటానికి పావులు కదిపాడు.
విస్థరణలో, జనాభాలో కొన్ని యూరోపియన్ దేశాలకన్నా పెద్దవైన అనేక సంస్థానాధీశుల్ని వప్పించటానికి సర్ధార్ చేయని ప్రయత్నంలేదు. ఒకప్పుడు తనపై హత్యాయత్నం జరిపించటంలో ప్రధాన పాత్ర వహించిన నవ్ సాగర్ మహరాజైన జం సాహెబ్ కొందరు సంస్థానాధీశులతో కల్సి ఏదో గూడుపుఠాణీ చేయనున్నాడని తెల్సుకున్న సర్ధార్, ఆ రాజు తమ్ముడ్ని కల్సి మహారాణి మాత్రమే ఆయన్ని వప్పించగలదని తెలుసుకుని వారిని విందుకు ఆహ్వానించాడు. తన వాదనతో వారిని సమ్మోహితుల్ని చేసి చివరకు వప్పించాడు. ఆ మహరాజే సంస్థానాల విలీనంలో సర్ధార్ కి తరువాత ఎంతో సహాయ సహకారాలందించాడు. దేశం కోసం వ్యక్తిగత కక్షలు పక్కనపెట్టి తన మహనీయత్వాన్ని చాటుకున్నారు సర్ధార్.
సర్ధార్ చతురతకి అద్దం పట్టే మరో ఆసక్తికర సంఘఠన భోపాల్ నవాబు మరియు ఇండోర్ మహరాజుల విషయంలో జరిగింది. వీళ్ళిద్దరికీ ఇండియాలో విలీనం అవటం ఇష్టంలేదు. ఇద్దరూ ఒక రహస్య వప్పందానికి వచ్చారు, అదేమంటే ఏ నిర్ణయం తీసుకున్న సరే ఇద్దరూ కలిసే తీసుకోవాలని. సర్ధార్ అనేక ప్రయత్నాలు చేసిన మీదట భోపాల్ నవాబు సంతకం పెట్టటానికి అయిష్టంగానే వప్పుకున్నాడు, కాని ఒక షరతు పెట్టాడు. తన నిర్ణయాన్ని ఆగస్ట్ 15 తేదీనే ప్రకటించాలని. ఇక ఇండోర్ మహరాజుని ఎలా పట్టేసాడో చూద్దాం.
సరిహద్దులోనే వున్న భోపాల్ నవాబు సంతకం పెట్టేశాడని తెలియని ఇండోర్ మహరాజు విలీనం విషయమై రైల్లో ఒకనాడు ఢిల్లి కి వెళ్ళాడు. ఆ క్షణంలో సంతకం పెట్టకూడదన్న దృఢ సంకల్పంతో వున్న మహరాజు, సర్ధార్కి తన రాక గురించి తెలిపి, మాట్లాడాలనుకుంటే రైల్వే స్టేషన్ కి వచ్చి మాట్లాడమన్నాడు. సర్ధార్ వెళ్ళ లేదు. గాంధీజి అనుచరురాలైన మహరాణి రాజకుమారిని పంపించాడు. అక్కడ రాజకుమారి ప్రత్యక్షం అవటం సమస్యను పరిష్కరిస్తుందని సర్ధార్ కి తెలుసు. ఆమెను చూడగానే ఆశ్చర్యపోయిన మహరాజుకు ఆమెతో కలిసి సర్ధార్ దగ్గరకు వెళ్ళక తప్పింది కాదు. కాని భోపాల్ నవాబుతో చేసుకున్న రహస్య వప్పందం ప్రభావం ఆయన మీద ఇంకా వుండటంతో నవాబుతో చర్చించకుండా సంతకం పెట్టనని భీష్మించాడు. నవాబు ఎప్పుడో సంతకం పెట్టేశాడని చెప్పినా నమ్మలేదు. చివరకు కాగితాలు చూపిస్తే, విభ్రాంతితో సంతకం పెట్టేశాడు.
The ulcer in the abdomen of India గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ని దండోపాయంతో విలీనం చేసి, దేశానికి ఒక రూపు తెచ్చాడు. ఇక ఆయన దూరదృష్టి ఎలాంటిదో చూద్దాం. “కలాత్” ఖాన్ మరియు భావల్పూర్ నవాబులు సర్ధార్ని కల్సి, తాము భారత్ లో విలీనమవుతామని విన్నవించుకున్నారు. కాని సర్ధార్ ఒప్పుకోలేదు. కలాత్ లో వుండేదంతా ముస్లిములు, అదీగాక భౌగోళికంగా అది పాక్ అంతర్భాగం. ఇక భావల్పూర్, సరిహద్దులో వున్నా కూడా అందంతా ముస్లిములే కనుక వాళ్ళను పాక్ లోనే కలవమని నచ్చచెప్పాడు. (ఈ బుద్ధి జిన్నాకు లేకపోయింది.)
కాశ్మీర్ని ఆక్రమించుకుంటున్న పాకిస్థాన్ సైన్యాన్ని వెనక్కి తరిమివేయటానికి పూనుకున్న సర్ధార్ ని, కాశ్మీర్ సమస్యని తనకొదిలేయమని నెహ్రూ కోరటంతో అది ఈనాటికీ UNOలో నలుగుతూ Brain Tumer of India గా తయారయింది. ఇదే సమస్య జునాగఢ్ (గుజరాత్)కి కూడా ఎదురైతే దాన్ని UNO వరకు పోనివ్వకుండా సర్ధార్ అడ్డుకున్నాడు. లేదంటే అది కూడా మరో కాశ్మీర్ అయివుండేది.
1950 లో మౌంట్ బాటన్ ఇలా అన్నారు. “ఇండియా ఒక సంపూర్ణదేశంగా మారటానికి కనీసం 15 ఏళ్ళు పడుతుందని అనుకున్నాము. కాని సర్ధార్ కేవలం 10 నుండి 12 నెలలలోపే అపూర్వమైన విజయాన్ని సాధించాడు.”
ఈ రోజే హైదెరాబాద్ సంస్థానం మన దేశంలో విలీనమైన రోజు.(Sep17)
కొసమెరుపు:
1949లో హైదరాబాద్ నిజాం పాలనను అంతమొందించడానికి భారత ప్రభుత్వం “పోలీసు చర్య” అమలు జరిపింది. తర్వాత దానికి అయిన ఖర్చు ఏ పద్దు కింద చేర్చాలో ప్రభుత్వానికి అర్ధం కాక తికమక పడింది. అది పోలీసు చర్య కనుక భారత రక్షణశాఖ ఆ ఖర్చుని భరించడానికి నిరాకరించింది. పోలీసు బలగాన్ని వినియోగించలేదని, అంతా మిలిటరీ వారే పాల్గొన్నారని, కాబట్టి ఆ ఖర్చుతో తమకి సంబంధం లేదని హోంశాఖ తిరస్కరించింది. ఫైగా అది క్రమశిక్షణ చర్య కనుక ఆ ఖర్చుని విద్యాశాఖకి బదలాయించమని సలహా ఇచ్చింది. కేంద్ర విద్యా శాఖ అందుకు నిరాకరించి, “హైదరాబాద్ పై పోలీసు చర్య దేశానికి పట్టుకున్న వ్యాధి నిర్మూలన పధకంలో భాగం కనుక ఆ ఖర్చుని ఆరోగ్యశాఖ పరంగా వ్రాయించ” మన్న సూచనను పాటించి ఆ ఖర్చుని ఆరోగ్యశాఖ భరించింది.
(ఈ నిజాన్ని ‘జాతీయ హాస్యం’ పేరిట పాత అంధ్రజ్యోతి పత్రికలో వేస్తే చదివాను.)
(పై వ్యాసంలో అధిక వివరాలను ఈక్రింది పుస్తకాలనుండి గ్రహించాను. -”The Peerless Sardhar” by Gunvant Singh.
- గాంధీజి “సత్యసోధన”
నేను ఈ మధ్య గణిత బ్రహ్మ డా.లక్కోజు సంజీవరాయశర్మ గురించి నా తెలుగు రాతలు!లో ఓ మంచి వ్యాసం చదివాను.చాలా వివరాలు అందించారు.నిజంగా వారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే.ప్రతి కృష్ణాష్టమి రోజు వీరు నాకు విధిగా గుర్తుకొస్తారు . అది తెలియాలంటే నేను వారితో 1993 లో చేసిన రైలు ప్రయాణం గురించి వివరిస్తే ఈ కృష్ణా అష్టమి రోజున ఆ మహానుభావుడిని స్మరించుకున్నట్లూ ఉంటుందీ,ఆ నా మరచిపోలేని అనుభవం మీ అందరితో పంచుకున్నట్లూ ఉంటుందనే సదుద్దేశంతో ఈ టపా.
“దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని వీరిని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేదావి ఇల్లు కదలలేకపోయారు”. అన్న “నా తెలుగు రాతలు” వారి వాక్యాలతోనే నా ఈ టపా మొదలుపెట్టాలనిపిస్తోంది.ఎందుకంటే నిజానికి వారు ఆ రోజు తన మనవడిని తోడుగా తీసుకుని హైదరాబాదు వచ్చారు .అక్కడ తానా నిర్వాహకులు వీసా రాలేదని చేతులెత్తేయడంతో తన సొంత ఖర్చులతో తిరుగు ప్రయాణమయ్యారు శ్రీ కాళహస్తికి.ఆదీ విజయవాడ వరకు ఓ ట్రైను లో అక్కడనుండి ఓ పాసింజరు రైలులో.
ఇక విషయానికొస్తే
ఆ రోజు నాకు వీక్లీ హాఫ్ కావటం మూలాన కావలి లో ఉన్నాను. అదే రోజు రాత్రి కావలినుంచి నెక్స్ట్ డే డూటీకి గూడూరు పోవాలి కాబట్టి కాకినాడ-తిరుపతి పాస్సింజరు సుమారు అర్దరాత్రి టైము లో కావలిలో ఎక్కాను.యధావిధిగా బాగా రష్ గా ఉంది.కూర్చోవటానికికూడా సీటు లేదు.అలా నిలబడే బిట్రగుంట దాకా ప్రయాణం సాగింది.బిట్రగుంటలో ఎవరో మహానుభావుడు దిగి పోవటంతో పై బెర్తు ని ఆక్రమించి చిన్నగా సర్దుకున్నాను.అలా మరో పదినిమిషాలు ప్రయాణించిన పిదప అలా లోపల కూర్చున్నవారి మీదకి యధాలాపంగా దృష్టి సారిస్తే అక్కడ మొదటి ఎంట్రన్సు దగ్గరే కిటికీ పక్కనే ఉన్న రెండు సీట్లలో ఒకదానిలో నల్ల కళ్ళజోడు పెట్టుకుని క్రింద ఓ గుడ్డసంచీతో పక్కనే కిటికీ కి ఆనించివున్న చేతికర్రతో ఆ అపరగణిత బ్రహ్మ ఓ సాధారణ ప్రయాణికుడిగా పాసింజరులో నిద్రలేకుండా,ఓ సింగిలు సీటులో తనకు జరిగిన సన్మానలూ,సత్కార్యాలూ అన్నీ మర్చిపోయి నిద్ర పోలేక తూగుతూ..ఉన్నారు .ముందు మామూలుగా తల తిప్పేసుకున్న నాకు వీరిని ఎక్కడో చూసినట్లుందే అనుకుంటూ బాగా పరికించి చూసాను.ఆంతకు ముందెప్పుడూ వీరిని నేను డైరెక్టుగా ఎక్కడా చూడలేదు.పత్రికలలో తప్ప.కొద్ది నెలల క్రితమే ఆంద్ర జ్యోతిలో వీరి గురించి వ్రాసిన పరిశోధనావ్యాసం లో ఫొటో గుర్తు కి రావడంతో వీరు ఎవరో అర్ధమైయింది. వీరు వారేనని అని నాకు నేను నిర్ధారించుకున్న తరువాత నిజంగా భావోద్యోగానికి లోనయ్యాను. నిదానంగా దిగి వారి దగ్గరకి నడిచాను ఉత్కంఠంగా…చిన్నగా తూగుతున్నారు. ఎదురు సీటులో తన మనవడు మేలుకొనే వున్నాడు. మళ్ళీ ఓ సారి మనవడి ద్వార ఆయన శర్మా గారేనని నిర్ధారించుకున్నాను.మాట్లాడవచ్చా? అని అడిగాను ఏమి మట్లాడాలో తెలియకపోయినా. అవకాశం వదులుకోదలుచుకోలేదు మరి. ఒక్క సారి నావంక చూచి తన తాతయ్యని లేపి తన సీటు నాకిచ్చి తను కొద్ది సేపు పక్కనే నిలబడ్డాడు.రెండు సార్లు చెప్పిన తరువాత చేతులతో తడుముకుంటూనే కూర్చోమన్నారు . మనసుపూర్తిగా రెండుచేతులూ జోడించి నమస్కారంపెట్టి జంకుతూనే కూర్చున్నాను ఎదురుగా. మామూలుగా నాగురించి చెప్పిన తరువాత అడిగాను ఎక్కడనుండి వస్తున్నారని.చెప్పారు వీసా సమస్య గురించీ,తానా టీము వారు చివరి నిమిషములో తనని రైల్వే స్టేషనులో వదిలేసిపోవడమూ ,తిరుగు ప్రయణానికి రిజర్వేషను లేక ఇలా రైళ్ళు పట్టుకోని రావటమూ తో పాటూ తన బాధలూ, తనకు జరిగిన సత్కార్యాలూ, నెహ్రూ గారు ఇచ్చిన బంగారు పతకం గురించి ,దాన్ని కూడా చివరకు దొంగలు ఎత్తుకొని పోవటం గురించి అన్నీ చెప్పి, చివరకి అడిగారు నాగురించి నీకు ఎలా తెలుసూ అని..చెప్పాను ఆంధ్రజ్యోతి లో చదివాను అని. సంతోషించి ఉత్సాహంగా ఏదన్నా లెక్క వేయ్, అన్నారు . అప్పటిదాకా నాకు పట్టిన తిమ్మిరి కాస్తా వదిలేసింది ఆమాటవినగానే.ముందే అజ్ఞానులం. దానికి తోడు సరస్వతీ దేవిదగ్గర పరీక్షలూ..ఏమి చేయాలో అర్ధం కాక మొహమాటపడిపోయాను.వదల్లేదు ఏదోకటి అడగమన్నారు ..అలా మొహమాటపడుతూనే ఆలోచించసాగాను ఏమి అడుగుదామా అని.చివరకు ఏప్పుడో మాస్కొ బుక్కు Fun with maths and physics లో లెక్క సమయానికి గుర్తుకొచ్చింది. పోయిన ప్రాణం తిరిగివచ్చినట్లుగా అడిగాను ఆ లెక్కని .”నాకు ఓ ఏడుగురు స్నేహితులున్నారు.వారిలో మొదటి స్నేహితుడు ప్రతి రోజూ నా దగ్గరకు వస్తాడు. రెండో వాడు ప్రతీ రెండురోజులకు ఓసారి వస్తాడు.మూడో వాడు ప్రతీ మూడురోజులకోసారి వస్తాడు………ఈ విధంగానే నాలుగోవాడు నాలుగు రోజులకూ,ఐదవ వాడు ప్రతీ ఐదు రోజులకూ ……….ఆరో వాడూ,ఏడోవాడు ప్రతీ ఆరు ,ఏడూ రోజులకూ ఓ సారి నా దగ్గరకు వస్తారు.ఈ విధంగా వస్తూ ఉంటే వారందరూ కలసి ఎన్ని రోజులకు నాదగ్గరికి వస్తారు?” అడిగి ఊపిరి పీల్చుకున్నాను అమ్మయ్యా బాగానే అడిగానని! అలా కొద్ది సెకనులు వేళ్ళమీదే లెక్కేసి సరి జవాబు చెప్పి ఏముందీ LCM కట్టడమేగదా..అంటూ నవ్వారు …ఫుట్టు గుడ్డి .అయినా.మేధావి. ఆ సరస్వతీ దేవికి వందనాలు.
నేనొక లెక్క వేస్తాను చెబుతావా? మరో బాంబు పేల్చారు .ట్రైను వెగంగా పోతుందీ, దూకలేనుగా…..సరే అన్నాను. లెక్క సరిగా గుర్తు లేదు…కాని ఆయన అడిగింది కొన్ని తమలపాకులూ, వక్కలూ అణాలకు, సంభందించినవి..ఇక నేను ఏమి జవాబు చెప్పివుంటానో బహిరంగ రహస్యమే.నా పరాజయాన్ని పట్టించుకోకుండా నీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు, వారం తిధి చెబుతా అన్నారు .చెప్పాను Sep04 అని. మామూలే, వేళ్ళతో లెక్కలు అదీ కొద్ది సెకనులే. వెంటనే చెప్పారు .ఆ రోజు గురువారం తెల్లరితే కృష్ణా అష్టమి అని. Human Computer గా పేరున్న శకుంతలాదేవిచే తనకంటే మేధావని కొనియాడబడిన ఆ ఆపర గణిత మేధావి తో కొద్ది దూరం కల్సి ప్రయాణం చేయడం ,ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తితో మాటలాడటం,హనుమంతుని ముందు కుప్పిగెంతులేయటం,తన నోటినుంచి నా పుట్టిన రోజు తిధి ,వారాలు వినడం నిజంగా నేను మరచిపోలేను.
మీ అందరితో ఈ విధంగా నా అనందాన్ని పంచుకోవటం ఇంకా ఆనందముగావుంది.
ఇతర వివరముల కొరకు:
http://andhraguyz.com/Andhra_Pradesh/p2_articleid/864
తెలుగు నేల నుండి త్రవ్వి తీసిన కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ “క్రౌన్” లో పెట్టుకున్నారని చింతిస్తున్నారా? వద్దు. అంతకన్నా ఎన్నో రెట్లు విలువైన ఓ రత్నాన్ని మన తెలుగు తల్లికి కిరీటం గా వదిగి పొమ్మని, అదే అంగ్లేయులు మనకి బహుమతి గా పంపించారు. ఆ రత్నమే “బ్రౌన్”
కోహినూరు మనకి దొరికితే మహా అయితే అమ్ముకుని కోటీశ్వరులమైపోతామేమో. కాని ఆయన తెలుగు భాషకు చేసిన సేవల ముందు అది గోకరకాణి కి కూడ పనికి రాదు.
ఏ దేవుడు పంపాడో గాని, తెలుగు భాషకి ఆయన చేసిన సేవ అద్వితీయం. దాన్ని నేర్చుకోవటమే కాక, అందులో పూర్తిగా లీనమయి పోయి మనవాళ్ళు అంతగా పట్టించుకోని అనేక తాళపత్ర గ్రంధాలను, వేమన పద్యాలను కోకొల్లలు గా సేకరించి తెలుగు భాషకు అస్థిత్వాన్ని ఏర్పరిచాడు. లేకుంటే మనకి “ఉప్పు కప్పురంబు…” కూడా మిగిలి ఉండేది కాదు.
ఆయన చేపట్టిన బృహత్తర కార్యక్రమాల్లో అత్యుత్తమమైనది తెలుగు నిఘంటువు(తెలుగు - ఇంగ్లీషు) ని తయారు చేయటం. దాన్ని ఒకసారి తిరగేసామంటే చాలు, సి.పి.బ్రౌన్ తో మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. ఈ బ్రుహద్గ్రంధాన్ని తయారు చేయటానికి ఆయన ఎంత తపించి వుంటాడో కదా! వైష్ణవుల శైవుల మధ్య జరిగిన కలహాల్లో ఎన్నో అమూల్యమైన గ్రంధాలు పంచభూతాల్లో కలిసిపోయాయని వాపోయిన బ్రౌన్ ఈ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువులో ప్రతి పుటనీ ఒక కావ్యం గా మలిచాడు. కళ్ళు మూసుకుని ఏ పుటనైనా తీసి అందులోకి తరచి చూస్తే చాలు, అందులో నుండి అంతులేని తెలుగు సంపదని మూట కట్టుకోవచ్చు.
కొన్ని పదాలని మనం రోజూ ఉపయోగిస్తూనే ఉంటాం, కాని అందులో ఉన్న నిగూఢార్ధాన్ని గురించి సాధారణంగా ఆలోచించం. ఉదాహరణకి “అల్లుడు” అంటే “one who weave” అనగా “రెండు కుటుంబాలని కలిపినవాడని” అర్ధం అట. “చెయ్యి” అనే పదం “చేయు” నుండి పుట్టిందట. అలాగే “కుడిచెయ్యి” అనేది “కూడు తినే చెయ్యి” నుండి పుట్టిందంట.
పక్షి విశేషము, క్రీడా విశేషము అని అర్ధం చెప్పి వదిలేయక, వీలయినన్ని ఉదాహరణల్ని ఇచ్చి ఆ పద భావాన్ని అన్ని కోణాల నుండి స్పృశించటం అపూర్వం. ఉదా|| “తెల్ల” (white) అనే పదాన్ని వివరించటానికి అరపుట తీసుకున్నాడు. అలాగే “చాలు” అనే పదానికి కూడా. ఈ వివరణల్లోనే తాండవం చేస్తుంది తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంప్రదాయం.
మనం “కలుక్కుమంది” అని వ్రాస్తాం. కాని ఇందులో “కళుక్కుమంది” అని వుంది. మనం ఇంతవరకు వినని, ఉపయోగించని తెలుగు పదాలు కొల్లలు గా కనిపిస్తాయి. వీటన్నింటినీ చదువుతూ ఉంటె..ఇవే కదా మన ముత్తాత తాతల పెదాలపై తారట్లాడిన పదాలు అని అనిపించక మానదు.
“కసమస” అంటే తొట్రుపాటు, “కస్తి” అంటే దుఖం అంట.
కవలు అనే పదానికి అర్ధం చెబుతూ..
గీ|| “పాటమొనరించుతరి దోడపడు గురునకు
గవలుపోకుండబుత్రోడో కలువకంటి.” అని ఉదా|| ఇచ్చాడు. ఇందులో ఎన్ని పదాలు వాడుకలో ఉన్నాయి?
ఇక వివరణల్లో ఈయన పొందుపరిచిన పద్యాలు అసంఖ్యాకంగా కనిపిస్తాయి. “
క|| పుడమిన పప్రధయగునెడ
బడతికిదేహంబు విడువబాడియకాదే,
నుడికంటె జాపుమేలను
నుడువు పురాతనముకాక నూతనపదమే.”
కొత్తగా బిడ్డపుడితే, పేర్ల కోసం ఇంటర్నెట్ లోనో, మేనకాగాంధి పొందుపరచిన పిల్లల పేర్ల పుస్తకం లోనో వెతకనఖర్లేదు. బ్రౌన్ నిఘంటువుని బయటకు తీసి (ఉంటే) దుమ్ము దులిపి పుటలు తిప్పి చూడండి. ప్రతి పుటలోనూ అందమైన, ఇంపైన పేర్లు ఎన్నో కనిపిస్తాయి. (నేను కనీసం వేయి పేర్లన్నా ఇందులోనుండి సేకరించాను, ఇంకా ఎన్నో వేల పేర్లు ఉన్నాయి.).
పార్వతీ దేవికి “శక్తి, అంబిక, అగజాత, దుర్వ, దేవి, దాక్షాయణి, భువనేశ్వరి, భవాని, భార్గవి, సతి, గిరికన్య, గిరిజ, గౌరి, కాత్యాయని, కాళి, మేనక, మాత ….” ఇన్ని పేర్లున్నాయి. ఇవన్నీ అక్కడక్కడా కనిపించినవి మాత్రమే!
పంచబాణుడు (మన్మధుడు)కి వున్న ఐదు బణాలు.
1.అరవిందము - Lotus - ద్రావిణి.
2.అశోకము - Jenesia Asoka- శోషిణి.
3.చూతము - Mango Blossom- బంధిని.
4.వనమల్లిక - Jasmin Arabian- మోహిని.
5.నీలోత్పలము -Blue Lotus- ఉన్మాదిని.
(వీటితో కొడితే ఎవరు మాత్రం పడిపోరు?)
ఇలా వ్రాసుకుంటూ పోతే ఎన్నో…. తాపత్రయం, పంచమాతులు, షడ్గుణములు, షట్కర్మలు, షడ్విద్యలు, సప్తసముద్రాలు, పంచ లోహాలు, 9 రకాల బ్రహ్మలు, 14 మంది మనువులు, షడ్రుచులు…అన్నింటిని సోదాహరణంగా ఇందులో వివరించాడు.
చరిత్రకు సంబంధించి కూడా ఎంతో విలువైన సమాచారం ఇందులో దొరుకుతుంది. ఆనాటి “గాంధార” దేశమే ఈనాటి “కందహార్” అట.
ఆంగ్లేయుడై ఉండి తనది కాని మన తెలుగు భాష కి ఇంత సేవ చేసిన సి.పి.బ్రౌన్ గురించి గౌ|| శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు తన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఈవిధంగా వ్రాసారు ”….ఖుతుబ్షాలు, అసఫ్జాలు అందరినీ ఒక్క ప్రక్క పెట్టి బ్రౌను దొర నొక్కదిక్కు పెట్టి తూచిన బ్రౌను దిక్కే త్రాసు ముల్లు సూపును. అతడు తాటాకు గ్రంధాలు సేకరించియుంచెను. వేమన పద్యాలను మెచ్చుకొని వాటిని ఇంగ్లీషులోని కనువదించెను. తెలుగు నిఘంటువులు రెండు రచించెను. అందొకటి వ్యావహారిక పదకోశము. నాటికిని ఇవి చాలా యుపయోగపడుచున్నవి….”
ఈ పుస్తకం మీద పి.హెచ్.డి చేయవచ్చో లేదో నాకు తెలీదు కాని, అది చేయటానికి కావల్సిన సరుకు మాత్రం ఇందులో పుష్కలంగా వుంది.తెలుగు పిచ్చి ఉన్నా లేకున్నా, మన భాషా సంప్రదాయాలను భవిష్యత్తరాలకు అందించాలనుకునే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండి తీరవలసిన పుస్తకం ఇది. అంతులేని తెలుగు భాషా సంపత్తి నిగూఢమై ఉన్న దీన్ని నిఘంటువు కన్నా కావ్యం అనటమే భావ్యం.
ఇంతకీ “గోకరకాణి” అంటే ఎంతో తెలుసా? (సమాధానం కావాలంటే నిఘంటువు తిరగేయండి.బ్రౌన్ నిఘంటువు లేనివారికోసం మాత్రమే వ్రాస్తున్నాను fraction of 1/4096 )
(ఆ ప్రయోగంలో వాడిన రాకెట్ కోన్ ని సైకిల్ మీద తీసుకు వెళ్ళటాన్ని దృశ్యీకరించినవారు ఫ్రాన్స్ కి చెందిన హెన్రి కార్టిఎర్.)
మీకు తెలుసా? భారత దేశపు మొట్టమొదటి రాకెట్ తడి పెయింట్ తోటే అంతరిక్షంలోకి దూసుకువెళ్ళిందని? ఆ ప్రయోగం లో అబ్దుల్ కలాం పాత్ర ఏమిటి? సమయం వుంటే చదవండి.
ఈ నాడు మనం ఇంట్లో కూర్చుని, ఇంటర్నెట్ లో ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకుని ఝూమ్మంటూ ఎగిరిపోగలం. ఈ సౌకర్యాలన్నింటినీ మనకందించటానికి మన ముందు తరాల వాళ్ళు ఎంత తపన పడ్డారో? ఏంత శ్రమించారో అని ఎపుడైనా మనం తలచుకుంటున్నామా? ఆ దేవుళ్ళకు ఎనాడైనా నమస్కరించామా?
అసలు విషయానికి వద్దాం.
అది రెండు స్టేజ్ ల రాకెట్. సోలిడ్ ప్రొపెల్లెంట్ నుండి శక్తి పొందింది. దాని బరువు 715 కిలోలు. సభ్యులు ఈ చారిత్రాత్మక ఘటనని వీక్షించేందుకు వీలుగా కేరళ అసెంబ్లీని ఈ రాకెట్ ప్రయోగానికి కొద్ది నిమిషాలముందు వాయిదా వేసారు. సముద్ర తీరం లో తుంబా (మళయాళం లో తుంబా అనేది వైద్య విలువలు గల ఓ తెల్లపూల చెట్టు పేరు.) లోని సెయింట్ మేరీ మెగ్డాలెన్స్ చర్చి ని ప్రయోగ స్థలం గా నిర్ణయించారు. ఆ చర్చి లోనే పేలోడ్ ని ఉంచారు.
తుంబా ప్రయోగం “టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్” లో పనిచేసే విక్రం సారాభాయ్ యొక్క మానసపుత్రి. ఆయన అకుంఠిత దీక్ష మరియు అంకిత సేవల వలనే ఈ రోజు భారతదేశం విదేశీయుల ఉపగ్రహాలను కూడా నియమిత కక్ష్య లోకి ప్రవేశపెట్టగల స్థితి కి చేరుకుంది. సారాభాయ్ యు.ఎస్.ఎ లో పనిచేసే ముఖ్యమైన భారతీయ శాస్త్రవేత్తలకు రాకెట్ ప్రయోగానికి “తుంబా” అత్యంత అనువైన ప్రదేశమనీ, అక్కడికి ఒకసారి రమ్మనీ ఆహ్వానించాడు. అనేక మంది సారాభాయ్ ప్రతిపాదనని కొట్టి పడేసారు.
అయితే ఆయన మీద నమ్మకమున్న కొద్దిమంది శాస్త్రవేత్తలు హార్వర్ద్, ఎం.ఐ.టి, కోర్నెల్ నుండి వచ్చారు. ఇక ఇప్పటి మన హీరొ, ఆనాడు “నాసా” లో పనిచేస్తూ ఉండిన అబ్దుల్ కలాం ఆగుతాడా? 1966 సంవత్సరం నవంబర్ 19 తారీఖున సారాభాయ్ నుండి కలాం ఒక అత్యవసర సమాచారం అందుకున్నాడు. ప్రొఫెసర్ జాక్స్ బ్లామోంట్స్ లాబొరేటరి కి వెళ్ళి ఒక సోడియం వేపర్ పేలోడ్ ని తీసుకుని, తరువాతి ఫ్లైట్ ఎక్కి భారత్ కి వచ్చి, ఆ పేలోడ్ తుంబాకి చేరేటట్లు చూడమని. కలాం ఆ పని పూర్తి చేసాడు. ఆ రోజుల్లో ఎవరైనా అనుకుని ఉంటారా? ఈ యువకుడు రాబోయే రోజుల్లో భారత రాష్ట్రపతి అవుతాడని.
సారాభాయ్ ముఖ్య స్నేహితుడైన బ్లామోట్స్ కూడా తుంబా కి చేరుకున్నాడు. ఆ రాకెట్ ని తయారు చేసింది నైక్-అపాచి సంస్థ. దాన్ని యు.ఎస్ నుండి దిగుమతి చేసుకున్నారు. పేలోడ్ తయారయింది ఫ్రాన్స్ లో. ఈ రెండింటి అనుసంధానం ఎలా వుంటుందోనన్నది అనుమానమే?
నవంబర్ 21 తేది ని ప్రయోగానికి అనువైన దినం గా నిర్ణయించారు. అందరిలోనూ టెన్షన్. ఏ పనీ అనుకున్నవిధంగా జరగటం లేదు. ముందు పేలోడ్ రావటం ఆలస్యమైంది. తుంబా కి చేరిందే గాని, దాన్ని ప్రయోగ స్థలానికి చేర్చటం ఎలా? అన్నదే ప్రధాన సమస్య అయింది.
దానికి ఎద్దుల బండిని వాడారట. మిగిలిన భాగాల్ని, రాకెట్ కోన్ లాంటివాటిని సైకిల్ లాంటి ఏ వాహనం దొరికితే దాని మీద మోసుకువచ్చారు. తీరా అన్నీ చేరిన తరువాత చూస్తే ఫ్రెంచి పేలోడ్ కీ అమెరికన్ రాకెట్ కీ లంకె కుదరలేదు.
అప్పుడు రంగంలోకి దిగాడు, భారతీయ మేధావి మరియు యూనివర్సిటి ఆఫ్ మిన్నెసొట లో ఫిజిక్స్ ఆచార్యుని గా పనిచేసిన ప్రొఫెసర్ పి.డి.భావ్సార్. ఆయన తన మేధస్సుని ఉపయోగించి కలాం సహాయంతో చిన్న చిన్న పనిముట్ల తో ఆ పేలోడ్ అంచులు గీకి, రాకెట్ కి సరిపోయేంత వరకు అరగదీసాడు. “ I was a paylod fellow then …” భారత రాకెట్ ప్రయోగ 40 వ వార్షికోత్సవం సందర్భం గా కలాం గుర్తు చేసుకున్నారు.
అపూర్వంగా ఆ పేలోడ్, రాకెట్ కి సరిపోయింది. ఈ లోపు కొంతమంది యువ శాస్త్రవేత్తలు అంతరిక్షం లోకి వెళ్ళబొయ్యే ఈ రాకెట్ కి పెయింట్ వెయ్యాలని నిర్ణయించారు. నిర్ణయించిందే తడవు డబ్బాలు, బ్రష్ లు వచ్చేయటం, పెయింట్ వేసేయటం జరిగిపోయాయి.
ఇంతలో మరో సమస్య. రాకెట్ వెళ్ళే మార్గాన్ని చిత్రీకరించటానికి నాలుగు కెమెర