something fishy

చైనీయులను తరిమికొట్టిన తెలుగు సైనికులు

“మన దేశానికి అసలు శత్రువు పాకిస్థాన్ కాదు, పొరుగునే ఉన్న మరో పెద్ద దేశం.” అని కొన్నాళ్ళ క్రితం చైనా ని ఉద్దేశించి మన పూర్వ రక్షణమంత్రి శ్రీ జార్జ్ ఫెర్నాండజ్ చెప్పినప్పుడు ఎవరూ దానికి పెద్దగా స్పందించలేదు. అణు బాంబులను నింపుకున్న రెండు అత్యున్నత శ్రేణి సబ్ మెరైన్లు మనకు దగ్గరలోనే సముద్రంలో మొహరించినట్లు ఈ మధ్య శాటిలైట్ చిత్రాలు వెల్లడించటంతో ఉలిక్కిపడింది మన రక్షణ యంత్రాంగం. చైనా అమ్ములపొదిలో ఉన్న అస్త్రశస్త్రాలకీ మన దగ్గర ఉన్న వాటికీ పోలిస్తే మనం ఎంతో వెనుకబడి ఉన్నామన్న సంగతి వెల్లడవుతుంది. మనం నిన్న 3500 km రేంజ్ గల అగ్ని-III ని విజయవంతంగా ప్రయోగించాము. ఇదే మనకి అత్యున్నత రేంజ్. కాని చైనా 1999 లోనే 11,200 km రేంజ్ కలిగిన మిస్సైల్స్ ని ప్రయోగించి, నియోగించింది. సరే అవన్నీ పక్కన బెడితే చాపక్రింద నీరులా మన దేశ యంత్రాంగాన్ని మరో రంగంలో కూడా విజయవంతంగా దొంగ దెబ్బ తీస్తూ ఉంది, అదే సైబర్ అటాక్స్.

IT రంగంలో దిగ్గజాలన్న పేరున్న మనం దీన్ని నిశ్శబ్ధంగా భరించాల్సి వచ్చిన దుర్భర పరిస్థితిలో ఉన్నాం. కనీసం రెండేళ్ళ నుండి దాదాపు ప్రతిరోజూ ఈ సైబర్ అటాక్స్ మన ప్రభుత్వ మరియు ప్రయివేట్ కంప్యూటర్ నెట్ వర్క్ ల మీద సమర్ధవంతంగా దాడి చేస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నత అధికారులు ఇలా అంటున్నారు “ఈ దాడులు ఏవో పిల్ల చేష్టలు కావు. వీటిని సింపుల్ గా “Hackings” అని పిలవలేము. ఇవి ఒక పద్దతి ప్రకారం, కావాలని మన దేశం మీద జరుపుతున్న దాడులు”. వీటివల్ల చైనీయులు భారత నెట్ వర్క్ లను స్కానింగ్ మరియు మ్యాపింగ్ సులభంగా చేయగలుగుతున్నారు. వారు మన సైట్ ల లోని వివరాలతో పాటు, నెట్వర్క్ ని ఎలా డిజేబుల్ చేయవచ్చో కూడా తెలుసుకోగలుగుతున్నారు. కొన్ని నెలల క్రితం NIC (National Informatics Centre), National Security Council, MEA ల మీద కూడా ఇలాగే దాడి జరిగింది. వీటిని ఎదుర్కోవటం సులభమే అని ప్రభుత్వం అంటున్నా, దానికి కావలిసిన టెక్నాలజీని సమకూర్చుకోవటానికి తీసుకోవలసిన చర్యలు మాత్రం ఇంతవరకు తీసుకోలేదు. అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతో అప్రమత్తతతో వ్యవహరిస్తూ డెడికేటెడ్ గా పని చేస్తూ మన ప్రభుత్వ నెట్ వర్క్ లను కాపాడుకుంటూ వస్తున్నారు ఇంతవరకు.

చైనీయులు చేస్తున్న ఈ అటాక్ లు ముఖ్యంగా మూడు రకాలు.

1. BOTS , 2. key loggers, 3. Mapping of Networks.

ఇందులో BOTS ఎంతో ప్రమాదకారి. ఇవి నెట్ వర్క్ లో చేరి నిద్రాణంగా ఉంటాయి. ఒక నిర్ధిష్ట సమయంలో BOTNETS నిద్ర లేచి నెట్ వర్క్ మీద పూర్తి నియంత్రణ సాధిస్తాయి. నిపుణుల అంచనా ప్రకారం చైనీయులు ఈ BOTS టెక్నాలజీలో ఆరితేరి ఉన్నారు. తెలిసిన లెక్కల ప్రకారం ఇలాంటి BOTS దాదాపు 50,000 దాగి ఉన్నాయి మన దేశపు ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్ వర్క్ లలో. వీటన్నింటినీ తొలగించలేక పోతే ఏదో ఒకనాడు దేశం పూర్తిగా షట్ డౌన్ అయ్యే స్థితి తలెత్తుతుంది.

అయితే ఇదంతా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే….

కంప్యూటర్ ఎరా గురించి అందరికీ తెలుసు. నిస్వార్ధంతో తెలుగు వాళ్ళకి కంప్యూటర్ నాలడ్జ్ ని ఉచితంగా మరియు సులభ రీతిలో అందించాలన్న తపనతో శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు కంప్యూటర్ ఎరా అనే ఫోరంని ఏర్పరిచారు. ఇందులో ఇప్పటికి సభ్యుల సంఖ్య 2342, మొత్తం పోస్టుల సంఖ్య 3256. ఫోరం అంటే మామూలు ఫోరం కాదు. స్వలాభాపేక్ష లేని డెడికేటెడ్ సభ్యులు నిరంతరం దాన్ని విజ్ఞాన ఖని గా నింపే పనిలో ఉంటారు. ఇందులో కొన్ని వేల ప్రశ్నలకు తెలుగులో సమాధానాలు దొరుకుతాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇందులో వదిలేస్తే, తెలిసిన వాళ్ళు సమాధానం ఇచ్చే వెసలుబాటు కూడా ఉంది. ఈ ఫోరం కాకుండా, సాంకేతిక సహాయం అనే చాట్ ని కూడా వీవెన్ గారి సహాయంతో మొదలు పెట్టారు. ఇందులో ప్రత్యక్షంగా ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అడగచ్చు, అంకిత భావం కలిగిన అనేక మంది సభ్యులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి పరిష్కారం చూపటానికి తమవంతు కృషి చేస్తారు. సమాధానం అందుకున్న వాళ్ళు కూడా అందులో పాల్గొనటానికి ఎంతో ప్రోత్సహిస్తారు. తెలుగులో వ్రాయటాని ఎంతో ప్రాధాన్యతనిస్తూ వచ్చిన వాళ్ళందరినీ తెలుగులో వ్రాయమని ప్రోత్సహించి దానికి అవసరమైన సహాయం అందిస్తారు…ఎలాంటి లాభాపేక్ష లేకుండా.

అంతటి అమూల్యమైన మన ఈ తెలుగు సైట్ ల మీద ఈ మధ్య ఆ చైనీయులు దాడి చేశారు. నిద్రాణంగా ఉన్న BOTS వళ్ళు విరుచుకుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు వాటిలోని కోడ్ ని డామేజ్ చేసి, దేన్ని క్లిక్ చేసినా అది ఓ చైనా వెబ్ సైట్ కి రిడైరెక్ట్ చేసేట్లు కోడ్ ని మార్చేసింది. అది ఈ పని పూర్తిచేసి ఫోరం మరియు చాట్ లలోని డేటా బేస్ మీద దాడి చేసే లోపు ఇద్దరు సైనికులు తేరుకుని చైనీయులను చుట్టు ముట్టి ఊపిరాడకుండా చేసి అమూల్యమైన డేటాని కాపాడారు. రాత్రి 10.30 కి మొదలైన దాడిని అత్యంత చాక చక్యంతో ఎదుర్కొని సకాలంలో స్పందించి ఆ కుత్సిత బుద్దిగల డ్రాగన్ నుండి అనుక్షణం కాపలా కాసి, కంటి మీద కునుకు రానీయకుండా మరునాడు సాయంత్రానికల్లా పాడయిపోయిన ఫైళ్ళని పునఃనిర్మించి కొన్ని వందల మంది కష్టపడి సేకరించి పొందుపరిచిన డేటాని ఉన్నదున్నట్టుగా మళ్ళీ అందరికీ అందించారు. సమిష్టి కృషి తో చైనీయుల దుర్మార్గాన్ని సకాలంలో అడ్డుకున్న ఆ వీరసైనికులు జీవి (గోపాల్ వీరనాల) గారు మరియు నల్లమోతు శ్రీధర్ గారు. సామాన్యులు సాధించిన ఈ అసామాన్య విజయం డ్రాగన్ ని తోక ముడిచేలా చేసింది.

****ఇంకా అయిపోలేదు … క్రింది లేఖ చదవండి****

చైనా హ్యాకర్లకు జ్యోతక్క లేఖ

అరే దొంగ సచ్చినోడా!..నీకేమి పోయేకాలమొచ్చింది? నీ పిల్లి కళ్ళకు కళ్ళ కలక రాను. మా పని మేము చేసుకుంటుంటే అనవసరంగా వచ్చి హ్యాక్ చేశావ్. ఐనా దానిని మేము చాలా ఫాస్ట్ గా రికవర్ చేసుకున్నాం. ఐనా తెలుగు నీకు ఏమర్ధమవుతుందని హ్యాక్ చేశావు రా? మళ్ళీ గాని ఇలా ప్రయత్నించావంటే, మా దేశం లోని అన్ని భాషల బూతులతోటీ నిన్ను తిట్టేలా చెయ్యగలను. అది అర్ధం కాక మీ గ్రేట్ వాల్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకోవాలి. ఏమనుకున్నావో జాగ్రత్త!!!

మనసు దోచుకున్న తెలుగు కీచకుడు

(కీచక వేషధారి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు మరియు విరాటరాజు పాత్రధారి)

వసంత కాలం ఆరంభమైందంటే చాలు, కళలు పురివిప్పి నాట్యం చేస్తాయి అహ్మదాబాద్ లో. దక్షిణ భారతదేశం లో పుట్టి జగమంతా వ్యాప్తి చెందిన భరతనాట్యానికి గుజరాత్ లో జీవం పోసింది గురు శ్రీమతి ఇలాక్షి బెన్ ఠాకోర్. “నృత్యభారతి” సంస్థని 1960 లో స్థాపించి భరతనాట్యానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి కొన్ని వందలమంది నృత్యకారుల్ని తయారుచేసింది . కళ కే అంకితమైన ఈ సంస్థను ఇప్పుడు పాత కొత్తల మేలి కలయికలతో, అనేక కొత్త నృత్యరీతులు కనుగొని సరికొత్త కోణాలను ఆవిష్కరించిన ఆమె కుమారుడు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ మరియు నృత్యకారుడు శ్రీ చందన్ ఠాకూర్ సమర్ధవంతంగా నడిపిస్తున్నారు.

(గురు శ్రీ చందన్ ఠాకోర్)

ప్రతి సంవత్సరం వసంత కాలారంభంలో మూడు రోజులపాటు కనులవిందుగా జరిగే ఈ నృత్య కార్యక్రమాలకు మన దేశంలోని ఇతర నృత్యకారుల్ని సగౌరవంగా ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా ఈ సారి చెన్నై నుండి చిదంబరం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అధినేత శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ మరియు ఆమె శిష్యురాళ్ళు, ఒరిస్సా , నృత్యాయన్ నుండి శ్రీ దుర్గా చరణ్ రణబీర్ మరియు వారి విద్యార్ధులు…..ఇక ఆడిటోరియం ని దద్దరిల్లజేసి, అందరి చేత ఔరా! అనిపించుకున్న శ్రీ బాల త్రిపుర సుందర కూచిపూడి నాట్య కళాక్షేత్రం, విజయవాడ నుండి గురు శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ మరియు వారి తోటి నృత్యకారులు. మీడియా కూడా వీరిగురించి అద్భుతంగా వ్రాసింది. అహ్మదాబాద్ లో ఇలాంటి కార్యక్రమాలు రాత్రి భోజన సమయం దాటిన తరువాత మొదలవుతాయి. ఠాగూర్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమం లో మొదటి రోజు 20-2-08 శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ గారి శిష్యురాళ్ళు అసలు క్లాసికల్ డాన్స్ అంటే ఏమిటో అందరికీ రుచి చూపించారు. ముఖ్యంగా శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ గారు గంగానది థీమ్ మీద కొరియోగ్రఫీ చేసిన “ప్రవాహాంజలి” చెప్పుకోదగ్గది. గంగానది ఒక్కోదగ్గర ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మరోదగ్గర రౌద్ర రూపం కలిగి ఉంటుంది..ఇలా ఎన్నో రూపాలు. కాని గంగ “The river of wisdom , neither forgetting the roots nor the destination.” ఈ భావంతో సాగిన భరతనాట్యం ఆద్యంతమూ అద్భుతంగా జరిగింది.”అబ్బా భలే చేసారు వీళ్ళు.”, “ఎంతైనా భరతనాట్యం చూడాలంటే సౌత్ ఇండియన్స్ చేస్తేనే చూడాలి.” అనే కామెంట్స్ వినిపించాయి రాత్రి 11 గంటలప్పుడు కార్యక్రమం ముగిసిన తరువాత. “రేపు రాత్రి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారి ట్రూప్ చే కూచిపూడి నృత్యరూపకం.” అని అనౌన్స్ చేసారు ముగింపులో .

శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్

(అద్బుత భంగిమలో ఉన్న ఈ నర్తకి వయస్సు 14 సంవత్సరాలు!!)

ఇక ఆ పక్క రోజు ఏం జరిగిందో చెప్పటానికి మాటలు చాలవు. రాత్రి 9 గంటలకు శంఖారావం తో మొదలుపెట్టి “కీచక వధ” కూచిపూడి నృత్యరూపకం, రెండు గంటలు నడుస్తుంది అని అనౌన్స్ చేసినప్పుడు. ఎరక్కపోయి వచ్చామురా! అన్నట్టు గుసగుస లాడుకున్నారు ఆడియన్స్. కూచిపూడి అంటే ఏదో భరతనాట్యం టైప్ లోనే ఏ పళ్ళెంలోనో..దీపాలు పట్టుకునో డాన్స్ ఉంటుందనే అనుకున్నారు చాలామంది. విరాట రాజు కొలువు కి భీముడు(నిజంగా భీముడు లాగే ఉన్నారాయన ఎవరోగాని) వచ్చి తన గురించి పరిచయం చేసుకునే సమయంలో ఆయన చేసిన నృత్యం చూసి ప్రేక్షకులు నోళ్ళు తెరిచారు. ధర్మరాజు, నృత్యమంటే ఇలా ఉండాలి అన్నట్లు గా చేసిన అర్జున పాత్రధారి, ద్రౌపది, గాంధారి, విరాటరాజు, సంగీత కళాకారులు…ఇలా అందరూ న్యాయం చేసి కూచిపూడి పేరు నిలబెట్టారు. ఇక కీచకుడి గురించి ఎంత పొగిడినా తక్కువే…ఆ హావభావాలు, అలవోకగా చేసే నృత్యం, బాడీ లాంగ్వేజ్, అభినయం. దానికి తోడు వీరందరికీ ఎవరి తత్వానికి తగ్గట్లుగా వారికి గాత్రం అందించిన గాయకుడు. నటనలో, నాట్యం లో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, కాని దాదాపు వేయి మంది ప్రేక్షకులు మూడు గంటలు ఊపిరి బిగపట్టుకుని చూసారంటే మాత్రం దానికి కారణం కీచక వేషధారి గౌరవనీయులు శర్మ గారే. సభలో పాండవులని మొదటి సారి చూసినప్పుడు వీరు తమ హావభావాలతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు. అద్భుతమైన టాలెంటు తో వీరు చేసిన నృత్యవిన్యాసాలు అందరినీ ఆశ్చర్యానందాలతో ముంచెత్తాయి. నృత్యరూపకం పూర్తయినవెంటనే ప్రేక్షకులందరూ లేచి నిలుచుని హాలుని చప్పట్లతో మారుమ్రోగించారు. ఇలా నుంచుని గౌరవించటం నేనిక్కడ చూడటం ఇదే మొదటిసారి. తరువాత శ్రీ శర్మ గారు ” I am poor … in english…” అని మొదలుపెట్టి “I would like to tell you about my feelings..but.. due to language problem..I am unable to express..my thoughts.” అని వినమ్రంగా అనటంతో సభ మళ్ళీ హర్షాతిరేకంతో నిండి పోయింది. స్టేజ్ ని గడ గడ లాడించిన కీచకుడితడేనా అనిపించేంత సాధారణం గా మారిపోయింది శ్రీ శర్మ గారి శరీర భాష. వీరు వెంటనే అహ్మదాబాదు విడిచి వెళ్ళిపోయినా…మూడవరోజు రాత్రి జరిగింది వీరికి అసలు సత్కారం. ఆ రోజు రాత్రి కార్యక్రమాలను మొదలుపెడుతూ యాంకర్ ఇలా అంది “ఈ స్టేజ్ ఇప్పుడు ఖాళీగా ఉన్నా…ఇంకా కీచకుడు తిరుగుతున్నట్లుగానే ఉంది కదా మీ అందరికీ?” అంతే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది మరోసారి.

గురువు గారు! మీకు పాదాభివందనాలు.

శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు. ” అన్న నానుడిని నిజం చేస్తూ, మనిషన్న తరువాత రోజులో కనీసం అరగంటయినా మరొకరికి సేవ చేయాలని పిలుపునిచ్చి, సాంకేతిక సహాయం అనే చాట్ రూం ద్వారా నిస్వార్ధం గా సేవలందిస్తూ… రాష్ట్రంలో కంప్యూటర్ అక్షరాశ్యతా ఉద్యమానికి ఊపిరిపోస్తూ, ఎందరికో స్పూర్తినిస్తున్నకంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి తెలుగు బ్లాగుల తరపున జన్మదిన శుభాకాంక్షలు.


| View Show | Create Your Own

పుట్టిన తేది మార్చి, ౩

సామెత - బ్లామెత

సామెత

“సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు.”

బ్లామెత

“బ్లాగరు బ్లాగరు రాసుకుంటే హిట్లు రాలినట్టు.”

 

 

సామెత

“కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు”

బ్లామెత

“కొత్త బ్లాగ్గాడు నెట్ వదలనట్టు”

 

సామెత

“ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం”

బ్లామెత

“హిట్టూ లేదు వ్యాఖ్యా లేదు, బ్లాగు పేరు సూపరుహిట్టు”

 

 

“తల్లీ! భిక్షాందేహీ!”

imagescadnkz35.jpg
“తల్లీ! భిక్షాందేహీ!” ఓ ఇంటిముందు నిలుచొని దీనంగా అరిచాను. కొద్దిసేపటికి ఓ నడివయసు ఉన్న ఆవిడ చేతిలో బియ్యపు పాత్రతో బయటకువచ్చింది. ఆమె ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడుతూంది, నుదుటన సింధూరం తనకు మరింత శోభనిచ్చింది. ముక్కు మాత్రం కోటేరుగా ఉంది అందరినీ శాసించే విధంగా.“తల్లీ బిక్షాందేహీ!” మళ్ళీ అడిగాను ఈ సారి కాస్త ఆర్ద్రత నిండిన గొంతుకతో. బిక్ష వేయబోయి అనుమానంతో నావంక తేరిపార చూసి అడిగింది. ” నీవు ఈ ప్రాంతానికి చెందినవాడిలా కనిపించడములేదే? నీ దేహరంగు చూస్తుంటే ఉత్తరాదివాడిగా ఉన్నావు, నిజమేనా?”

“లేదమ్మా బిక్షకుడను, ఒక ప్రాంతం వాడినని ఎలా చెప్పను? అన్ని ప్రాంతములు తిరిగినవాడిని, అయితే ఎక్కువుగా హిమాలయములు, కాశీ, హరిద్వార్ వంటి పుణ్య క్షేత్రములలో తిరిగినందువలన కాస్త దేహం రంగు మారి ఉండవచ్చు. అంతే కాని నే ఉత్తరాదివాడిని కాను తల్లీ !…. అచ్చముగా తెలుగువాడినే.” అన్నాను.

“కాని, నాకు నమ్మకము కుదురుటలేదు. నీ భాష నందు యాస అదో మాదిరిగా ఉంది. అనాదిగా ఉత్తరాదివారు మమ్ము దోచుకొనుచున్నారు. వారికి నేను బిక్ష వేయనుగాక వేయను.” అందా మహా తల్లి.

“లేదు తల్లీ ! లేదు, నేను అచ్చ తెనుగువాడినే కావలిసినన్న నే చిన్నప్పుడు చదువుకున్న వేమన పద్యం చెబుతా విను అంటూ “ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు,చూడ చూడ రుచుల జాడవేరు..పురుషులందు…”

“ఆపూ !!!!!” అని గట్టిగా గద్దించింది. ఒక్కసారి ఉలిక్కిపడి ఆపి బిక్కముఖంతో ఆమె వంక చూశాను.

“ఐతే… నీవు రాయలసీమవాడివన్న మాట! వేమన పద్యం చెబుతున్నావు , నీకు బిక్ష వేయనుగాక వేయను.” ఉగ్రరూపం దాల్చి అంది.

“తల్లీ! వేమనకు ఒక ప్రాంతం ఏమిటి?ఆయన అందరివాడు కదా!” అని నెమ్మదిగా గొణిగి, పైకి “అమ్మా! సిరికిం చెప్పక …చెప్పబోయి పొరపాటున ఉప్పు కప్పురం చెప్పాను . నన్ను క్షమించి బిక్ష వేయి తల్లీ!” దీనంగా వే్డుకున్నాను.

“సిరికిం చెప్పక రాసింది మన పొతనవారే కదా! ఐతే చెప్పు.”

కామాలు, పులుస్టాపులుతో సహా వప్పచెప్పాను చిన్నపిల్లాడిలా..

తృప్తి పడినట్లు కనిపించింది తన ముఖం చూస్తే,

“సరే పోతన గారి పద్యం చెప్పావు కదా ఇప్పుడు నీవు తెలంగాణా వాడివే అని నమ్ముతున్నా!”

“ఐతే బిక్ష వేయి తల్లీ !” కడుపు తడుముకుంటూ అడిగాను ఆశగా..
“ఆహా!నీవు తెలంగాణా వాడివి ఐనంత మాత్రాన బిక్ష వేసేస్తానా? చెప్పు నీది సికింద్రాబాదా? లేక హైద్రాబాదా? ఎందుకంటే సికింద్రాబాద్ బాగా డెవెలప్ అయింది. అన్ని రైళ్ళు అక్కడే ఆగుతున్నాయి. ఇది సికింద్రాబాద్ వారి కుట్ర, వారికి నే బిక్ష వేయనంటే వేయను.” మళ్ళీ అడ్డంతిరిగింది.

“అమ్మా ! నాది సికింద్రాబాద్ కాదు మన హైద్రాబాదే. అమీరుపేట.” అని ఆత్రుతగా చెప్పాను.

“ఏంటీ? అమీరుపేటా…..? అనుకున్నా, ఏదో తిరకాసుంటదని ….. అట్లా చెప్పు, మీ అమీరుపేటలోనే అన్నీ షాపింగు కాంప్లెక్సులు ఉన్నాయి మా యూసఫ్ గూడా అన్యాయం అయిపోయింది. ఎవరుపట్టినా అమీర్ పేటకి పోయి కొనుక్కుంటున్నారు ఏమికావాలన్నా….మా యూసఫ్ గూడ నష్టపోతూ ఉంది. ఇక నీవు బిక్ష ఆశ వదులుకోని పోవచ్చు.” నిష్కర్షగా చెప్పింది.

“తల్లీ! తొందరపడకు. మా అమ్మగారిది యూసఫ్ గూడానే, నే పుట్టింది కూడా ఇక్కడే యూసఫ్ గూడాలో, కొద్దిగా కనికరించి బిక్షవేయి తల్లీ.”

“యూసఫ్ గూడా అంటే సరిపోతుందా ? ఏ వీధో చెప్పు. ఎందుకంటే మాపక్క వీధి లో అన్నీ సిమెంటు రోడ్డులే కాని మాకు లేవు. అందుకే మావీధి కి స్వయం ప్రతిపత్తి కోరుతున్నాం.ఉద్యమాలు చేస్తున్నాం.”

“అమ్మా! సంతోషం. నేనూ ఈ వీధి వాడినే ఆ చివరింటిలోనే నేను పుట్టాను.” పరిస్థితి అర్ఢమై నోటికి వచ్చింది చెప్పాను.

“ఐతే సరే ఇదుగో బిక్ష. తీసుకో. మరో మాట నువ్వు ఇల్లు ఇల్లూ తిరుగుతుంటావుకదా, అందరికీ మన ఉద్యమం గురించీ, మనకు జరుగుతున్న అన్యాయం గురించీ చెప్పు. మన వీధికి స్వయం ప్రతిపత్తి వచ్చి విడిపోయాక నిన్నే ఈ వీధికి ముష్టి మంత్రిని చేస్తాను.” అని భిక్ష వేసింది ఆ మహాతల్లి చివరకి.

“అలాగే తల్లి! సంతోషం… కాని చివరగా నాదో చిన్న సందేహం తల్లీ! మన ఇంట్లో అదే…. తమరింట్లో ఎంతమంది ఉంటారో కాస్త చెబుతారా?” కొంచెం భయం భయం గానే అడిగాను.

“మా ఇంట్లోనా ? మా చెల్లెలు, తన పిల్లలు, మా తమ్ముడు తన బార్య, పిల్లలు, మా అమ్మగారు, నాన్నగారు, అత్తగారు, మా మామగారు మొత్తం పిల్లలతో కలిపి సుమారు గా ఓ ఇరవై మంది దాకా ఉండొచ్చు. ఉమ్మడి కుటుంబం కదా … మే మందరమూ కలిసే ఉంటాము.” కాస్త గర్వం ఒలకబోస్తూ చెప్పి “అసలెందుకుకు నీకు ఇవి అన్నీ?”అని అడిగింది కాస్త అనుమానంగా చూస్తూ.

“ఆ….. ఏం లేదులే అమ్మా ! మరి మీ రెప్పుడు విడిపోతున్నారో ? తెలుసుకుందామని…” అనేసి..ఇక్కడే ఉంటే నాదిష్టి బొమ్మ కాల్చేస్తారేమోనని భయంతో… పరుగులంకించుకున్నా వెనక్కు తిరిగి చూడకుండా మా అమీర్ పేటవైపు.

తెలుగు నాయకులూ కాస్త ఇటు చూడండి.

an.jpgనా పాటికి నేను వీధి దీపం క్రింద ఉన్న చెత్తలో ఏవన్నా నాలుగు ఎంగిలాకులు దొరుకుతాయేమోనని వెదుకుతూ ఉండగా, ఒక్కసారిగా పక్కనే ఉన్న మైదానం నుంచి మైకులో మాతెలుగు తల్లికి మల్లెపూవు దండ అంటూ కమ్మగా వినిపించటముతో ఆసక్తి గా అటు వైపు తల తిప్పి చూసాను. అక్కడ ఎదో మీటింగ్ జరుగుతున్నట్లుగా ఉంది. ఇక ఇక్కడ ఏమీ దొరకదని నిశ్ఛయించుకుని మెల్లగా అటువైపు నడిచాను వెతుకులాట ఆపి. అదో తెలుగు భాష ఉద్దరణ సభ. ఎక్కడ చూసినా తెలుగు గురించిన గొప్పదనంతో నిండిన బ్యానర్స్ కనులకింపుగా ఉన్నాయి. వేదిక మీద పెద్ద పెద్ద కుర్చీలలో ఆశీనులైన దిగ్గజాలు. ఏనుగులు, పులులు, సింహాలు ఒకటేమిటి అన్నీ వేదిక మీదే ఉన్నాయి. చూడటానికి కనులకు పండుగ్గా ఉంది. ఓ ప్రక్కన నిలబడి ఆలకించసాగాను. వక్తల ప్రసంగాలు వినసొంపుగా ఉన్నాయి. తెలుగులోనే అందరూ మాట్లాడాలనీ, అన్నిబోర్డులూ తెలుగు లోనే ఉండాలనీ, మమ్మీ డాడీ కల్చర్ పోవాలనీ, అన్నిఆఫీసుల్లో తెలుగును తప్పనిసరిగా వాడాలనీ … ఒకటేమిటి? తెలుగు బాగుపడటానికి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో అవి అన్నీ అమలు చేయాలని పెద్ద పెద్ద నాయకులు ఆవేశంగా మాట్లాడుతుంటే నిజంగా తెలుగు ఇక వెలుగులు విరజిమ్ముతుందనీ, ఇక వీరంతా తెలుగు కోసం తమ శాయశక్తులా పనిచేస్తారనీ , అక్కడ జరిగిన మీడియా కవరేజ్ సాక్షిగా నాకు గట్టిగా అనిపించింది. తృప్తిగా అక్కడినుంచి నెమ్మదిగా బయలుదేరాను. రోడ్డు పక్కన నోటికి దొరికింది తింటూ రాత్రికి కృష్ణకాంత్ పార్క్ లో సేద తీరుదామని నిదానంగా ఆ వైపు నడిచాను. అందులోకి గొర్రెలకు ప్రవేశం ఉందో లేదో మరి. ఎలాగో లోపలకి చేరాను. కాని అక్కడా అదే గోల. కొద్దిసేపటికి మాటలు వినిపించసాగాయి. మెల్లగా కాని స్పస్టంగా …దృఢంగా…మళ్ళీ తెలుగు గురించే….ఎవరా? అని ఓరగా చూశాను. కొన్ని చిట్టిచీమల నేల సమావేశం. కదలకుండా ఆలకించసాగాను ….అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి ఎలా చేయాలి? బ్లాగుల ద్వారా అందరికీ ఎలా దగ్గరవ్వాలి, ఉచితంగా అందరికీ సాంకేతిక సహాయం ఎలా చేయాలి? కూడలి, తేనెగూడు, జాబిల్లి, తెవికి, వికీపిడియా వ్యాసాలు, కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం వంటి వాటి విజయాలు, గమ్యాలు, మార్పులు చేర్పులు , యూనీ కోడులు, ఇలా అన్ని విషయాలమీద … నిస్వార్ధంగా … ఆచరణాత్మకంగా … తర్జన బర్జనలు.

అయ్యా! తెలుగునాయకులూ …ఇకనైనా కాస్త నేలమీద చూడండి. ఇప్పుడు మీరు పాటుపడాల్సింది పుస్తకాలలో తెలుగు ని బతికించడానికి కాదు. భవిష్యత్తు తరాలు పుస్తకాల కన్నా అంతర్జాలం మీదే ఎక్కువ ఆధారపడబోతున్నారు కాబట్టి, LKG బాల బాలికల LAPTOPS లో మన తెలుగు తల్లి ని ఎలా చొప్పించాలా అని? ఆ తల్లి నుడికారపు మమకారాన్నిఆ పసి మనసులకు ఎలా రుచి చూపించాలా? అని తపన పడుతూ దాని కోసం నేల మీద ఆరాటపడే ఈ చిట్టి చీమల నిశ్శబ్ధ యుద్దం గురించి తెలుసుకోండి, వారి పోరాటానికి కాస్త చేయూత నివ్వండి.

బ్లాగులందు తెలుగు బ్లాగులు మేలయా?

pothana.jpg

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు -

అంతర్జాలంలో మన తెలుగు నంతా కాపీ చేస్తే ఒక డి.వి.డి కి సరిపోతుంది అని తేల్చేసారు కొత్తపాళీ గారు. ఇంతకన్నా దుర్గతి లేదు. ఒక బ్లాగుకి తోటి బ్లాగరే పాఠకుడయ్యాడని ఆయన ఎంత మొత్తుకున్నా, అంతర్జాలం లో తెలుగో అని వీవెను గారు, జ్యోతి గారు, చావా గారు, నల్లమోతు శ్రీధర్ గారు, రవి వైజాసత్య గారు , చదువరి గారు …. ఇలా అనేకమంది గగ్గోలు పెడుతున్నా కూడా మనం ఇంకా నిద్రపోతూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం బ్లాగర్లు ఏ నెలకో రెండు నెలలకో ఓ వ్యాసమో లేక మరేదో బ్లాగులో పెట్టేసి మరు రెండు రోజుల్లో వచ్చిన హిట్లకీ, వ్యాఖ్యలకీ మురిసిపోయి మళ్ళీ దుప్పటి కప్పుకుని నిద్రపోవటమే. అసలు కూడలి, తేనెగూడు, జల్లెడ వంటి సైట్లే ఏర్పాటు చేసి ఉండకపోతే, ఈ మన బ్లాగులకి ఒక్క హిట్ అయినా వచ్చునా?(మనది తప్ప). ఇంత మంది మహారధులు ఇంత కృషి చేస్తున్నప్పటికీ అంతర్జాలంలో తెలుగు ఇంకా ఆది స్థాయిలోనే ఉంది. అయితే తెలుగు బ్లాగర్ల సమావేశం అనో, తెవికీ అనో ఇలా విడి విడి గా సమావేశాలు జరిపేకన్నా అందరినీ ఒకే త్రాటి మీదకు తేగల ఓ ముఖ్యమైన సమావేశం జరగటం ఎంతైనా అవసరం. దీనికి పైన ఉటంకించిన తెలుగు సారధులు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము. “అన్ని బ్లాగులందు తెలుగు బ్లాగు మేలయా..” అన్నది నిజం కావాలంటే ఎంతో కృషి, దానికి తగ్గ ప్రణాళిక అవసరం. ప్రతి బ్లాగరు హిట్లు, వ్యాఖ్యల కోసం ఎదురుచూసే స్థాయి నుండి బయటపడి భవిష్య ప్రణాళిక గురించి ఒక నిర్ణయానికి రావాల్సిన తరుణం ఆసన్నమైనది. ఇప్పటికన్నా అలసత్వాన్ని వదిలించుకుని, బద్దకాన్ని విదిలించుకుని అంతర్జాలంలో తెలుగు వెలిగే విధంగా మన బ్లాగులలోనూ, తెవికి లోనూ వ్యాసాలు వ్రాసి మన భాష ఘనతిని మైక్రోసాఫ్ట్ వరకు తీసుకు వెళ్ళాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది. మనకు తెలసిన వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉండి ఉంటే, వాళ్ళ కంప్యూటర్ లో ఏదైనా తెలుగు మృదుజాలం స్థాపించి, సులభంగా వాడుకునే విధం చూపించి వారిని ప్రోత్సాహించవలసిన అవసరం ఉంది. విండోస్ లో తెలుగు సులభంగా వ్రాయగలిగేలా అంతర్లీనంగా ఏదైనా ఏర్పాటు చేసే విధంగా మైక్రోసాఫ్ట్ తో సంప్రదింపులు జరిపే దిశగా పావులు కదుపుతున్నారు శ్రీ సాలభంజికల నాగరాజు గారు (కొత్తపాళీ గారి బ్లాగ్వరులకి కొన్ని గమనికలు - చర్చా సారాంశం చూడండి). ఈ వాదనకి బలం చేకూర్చే విధంగా అంతర్జాలంలో తెలుగు వాడకాన్ని పెంచి దాన్నొక అవసరంగా మలచటానికి మనమందరం శాయశక్తులా కృషి చేయాలి. అప్పుడే అంతర్జాలంలో మన తెలుగు నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరి అంతటా తెలుగు వెలుగులు నింపి, దేశ బ్లాగులందు తెలుగు లెస్స అనే స్థితికి చేరుకుంటుంది. లేదంటే…
…నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్ధాక్షిణ్యంగా వీరె.
-శ్రీశ్రీ

తిట్టు కొందాం రండి

images.jpgమన మీద ఎవరన్నా రాళ్ళు విసిరేస్తే చలించకుండా ఆ రాళ్ళతోటే శత్రుదుర్భేధ్యమైన ఓ దుర్గం కట్టుకోమన్నాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఈ మధ్య ఏ పేపరు చూసినా, చానల్ మార్చినా వినిపించేవి మన నాయకులు తిట్టుకునే నీచమైన తిట్లే.

మన ఆదర్శ నాయకుల నోటిలో అలవోకగా నానుతూ, బయటకు వచ్చి ప్రసారం అవుతూ మన ప్రసార మాధ్యమాలన్నీ కంపు కొడుతున్నాయి. సరే వీటన్నింటినీ ఆ తత్వవేత్త చెప్పినట్లు ఓ దుర్గంలా మలచాలంటే ఏంచేయాలనేది ఆలోచిస్తే సరదాగా ఇలా చేయచ్చు అనిపించింది.

1) ముందుగా ఈ తిట్లన్నింటినీ లిస్ట్ అవుట్ చేసి మన పేరు మీద పేటెంట్ తీసుకోవాలి.
2 )మొదట మన దగ్గర అంత డబ్బు ఉండదు కాబట్టి ఒక అద్దె వాహనం పై ప్రజాప్రతినధుల వద్దకు వెళ్ళి మన దగ్గర ఉన్న మొత్తం తిట్ల లిస్టు వాళ్ళకు ఇవ్వటం, దాంట్లో నుంచి వాళ్ళకు కావల్సిన తిట్లని పికప్ చేసి ఇవ్వటం.
3) ప్రతి ప్రెస్ మీట్ ఎవరినన్నా తిట్టటానికే కాబట్టి ప్రెస్ మీట్ స్పెషల్ అని ఓ చిన్న బాక్స్ కలర్ ఫుల్ గా ప్యాక్ చేసి అందులొ తిట్టాల్సిన తిట్లు లిస్టు పెట్టి ప్రెస్ మీట్ కి ఓ అరగంట ముందు ఆ నాయకునికి అందచేయటం.
4 ) ఛోటా మోటా నాయకులకు, వారికి వీలైన టైం లో తిట్లవిలువ, ఎలా తిట్టాలి? ఎప్ఫుడు తిట్టాలి? ఏ తిట్టుని ఎలా తిప్పి కొట్టాలి? ఇలా కొత్త పాత తిట్లు మేలు కలయికలతో కూడిన ఓ డెమో క్లాసు కండక్ట్ చేయాలి.
5 ) నిదానంగా ఆదాయం పెరిగిన తర్వత మెయిన్ బ్రాంచి అసెంబ్లి ఎదురుగా పెట్టాలి. అక్కడక్కడా సబ్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి.
6) తిట్ల డవున్ లోడ్ కు ఆన్ లైన్ ఫెసిలిటి కలగజేయాలి. క్రెడిట్ కార్డ్ ఫెసిలిటి ఇవ్వాలి. క్యాష బ్యాక్ ఆఫర్ కూడా అప్పడప్పుడు ఇస్తుండాలి.
7) ముఖ్యంగా తిట్లుకు బ్రాండ్ నేమ్ వాల్యు పెంచుకోవాలి.
8 )ఎవరన్నా తిట్టినా ఎదురుతిట్లు తిట్టలేక మీనమేషాలు లెక్కపెట్టే వారికి కొంత ఫ్రొత్సాహం ఇవ్వాలి.
ఉదా:-తమిళనాడు నుంచి వచ్చిన హీరొ గారు ఇక్కడి మెగాస్టార్ ని ప్రజాస్వామ్య, వ్వక్తిగత స్వేచ్ఛ పేరుతో అల్లరి చేస్తున్నప్ఫుడు, “అయ్యా మీది తమిళనాడు కదా!అక్కడ సూపర్ స్టార్ కూడా పార్టీ పెడతాడని ప్రచారంలో ఉంది కదా…. మీరు చేరుతారా?” అంటే ఏమి చెబుతాడు? ఇదే విధంగా మాట్లాడుతాడా?

ఇలాంటివి అడగాలని మనం ఇవతల బృందానికి నేర్ఫించగలగాలి.

9) నిదానంగా మన కంపెనీని కార్పొరెట్ స్టాయి కి పెంచి టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాని కనుగుణంగా పనిచేయాలి.
10) పది మందికి మనమూ తిట్ల ద్వారా తిండి పెట్టి సమాజానికి మన వంతు సహాయం మనమూ చేయాలి.

చివరిగా ఓ చిన్న ప్రశ్న,

నేనొక ప్రముఖ నిర్మాతని అనుకుందాం, కొత్త సినిమా తీసే ఊద్దేశ్యంతొ పెట్టిన ప్రెస్ మీట్ లొ మాట్లాడుతున్నాను. అంతలో నన్ను ఓ విలేకరి, “అయ్యా మీరు ఈ హీరొ తో సినిమా తీస్తున్నారు, మరి రాజశేఖర్ గారి తో ఎందుకు తీయరు?” అని అడిగారు.

నా జవాబు : “నేను తీయ్యను.”
విలేకరి (గుచ్చి గుచ్చి) : “ఎందుకు తియ్యరు?”

నా జవాబు : “ఎందుకంటే ఆయనికి డాన్సు లు రావు, స్వంతంగా డైలాగులు కూడా చెప్పలేడు.”

నేను మాట్లాడింది ప్రజాస్వామ్యమా? రాజశేఖర్ అభిమానులు స్పందిస్తారా!స్పందించరా?

వ్యాసం కన్నా వ్యాఖ్య గొప్పది. “ఇ - తెలుగు” సమావేశం. ఓ సందేశం.

bapu4.jpg

“ఈ కాంక్రీట్ జనారణ్యంలో కొన్ని పిచ్చి మొక్కలు, ఎవరికీ పనికి రావు. కొన్ని కలుపు మొక్కలు, ఇవి పరాన్న బుక్కులు. ఇంకా కొన్ని విషపు మొక్కలు. నమ్మకంగానే కనిపిస్తాయి. కాని నమ్మితే చంపుతాయి. అయితే చాలా, చాలా మొక్కలు మాత్రం ఆహారాన్నీ, ఆవాసల్నే కాక , తాము ఎండినా మనకు నీడనిస్తాయి. అవి తడిచినా మనల్ని తడవనివ్వవు, మరి కొన్ని చనిపోయి మనల్ని బ్రతికిస్తాయి. ఇది పకృ తి సహజమేమో? నిస్వార్ద “ఇ - సేవ” కి నమస్సుమాంజిలి.”

- నక్కా కృష్ణ

కొందరి వ్యక్తుల నిస్వార్ధ “ఇ - సేవ” గురించి ఈ బ్లాగులో ఈమధ్య ప్రచురించబడిన ఓ వ్యాసానికి వచ్చిన వ్యాఖ్య ఇది. వ్యాసం కన్నా ఇదే బాగుందనిపించింది . అందుకే మీ కందిస్తున్నాము. ఈరోజు ౦౬-౦౧-౨౦౦౮ (౦6-౦1-200 8) ఆదివారం, మధ్యాహ్నం 3 గంటలకి, కష్ణకాంత్ పార్క్, యూసఫ గూడ, హైదరాబాద్ లో “ఇ - తెలుగు ” సమావేశం జరగనుంది. అందరూ ఆహ్వానితులే. ఈ “ఇ - తెలుగు” సమావేశాలు విజయవంతమవ్వాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాము.

ఎవరు వీరు?

helpinghand_0thumbnail.jpg

పూర్వకాలంలో సిద్ధులు కాళ్ళకు అంజనం పూసుకుని చిటిక వేసినంతలోనే మరో ప్రదేశానికి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించేవారంట. మహర్షులు తమ దివ్యదృష్టితో జరిగిన సంగతీ, జరుగుతున్న సంగతీ మరియు జరగబోయే సంగతులూ తెలిపేవారంట. అయితే ఇవన్నీ “అంట”, “ట” ల తోనే ముగిసిపోతాయి. కాని, నేడు అలాంటి మహర్షులు కూడా మన మధ్య ఉన్నారు. అలాంటి ఓ ముగ్గురి గురించి ఇప్పుడు ప్రస్థావించదలిచాను. గత ఆరు నెలలనుండి ఒక క్లిష్టమైన సమస్య నా కంప్యూటర్లోనూ, మరియు ఆఫీసులో నా బాధ్యతలో భాగమైన ఇతర కంప్యూటర్ లలోనూ ఏర్పడి సవాలు గా నిలిచింది. దీని పరిష్కారంకోసం నేను చేయని ప్రయత్నమంటూ లేదు. గూగులమ్మని అడుగుతూనే ఉన్నాను. అందరూ అలా చేయి, ఇలా చేయి అని మొండి చేయి చూపించిన వాళ్ళే. అలాంటిది ఈ మధ్య ఒక రోజు ఊసుబోక అంతర్జాలంలో ఒంటరిగా తిరుగుతూ ఉంటే ఒక లింకు దొరికింది. ఏమిటా ఇది? అని తెరచి చూస్తే, అది సాంకేతిక సహాయాన్నందించే ఓ తెలుగు సైట్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. అందులో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులకీ నా సమస్యని క్లుప్తంగా వివరించాను. వివరించిందే తడవుగా రంగంలోకి దూకారు వాళ్ళు. అందులో ఒకరు నన్ను http://www.teamviewer.com/index.aspx నుండి మృదుజాలాన్ని దిగుమతి చేసుకోమని చెప్పి, దాని ద్వారా వారికి వేల మైళ్ళ దూరంలో ఉన్న నా కంప్యూటర్ లోకి దూరి అరగంట కష్టపడి, ఆరు నెలలుగా కొరకరాని కొయ్యగా ఉండిన నా సమస్యని పరిష్కరించేసారు. మరి ఒకరు నేను తెలుగులో నేరుగా వ్రాయటానికి కష్టపడుతున్నానని అర్ధం చేసుకుని http://baraha.com/BarahaIME.htm నుండి మృదుజాలాన్ని దిగుమతి చేయించి మరో ప్రధాన సమస్యని కూడా నిమిషాల్లో తీర్చేసారు.

అయితే అప్పటినుండే నా అసలు సమస్య మొదలైంది. అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు నాలాంటి వాళ్ళ సమస్యలను, వారి విలువైన సమయాన్ని వెచ్చించి తీరుస్తున్నారు? దీని వల్ల వాళ్ళకేమైనా లాభం ఉందా? అంటే అదీ లేదు. వాళ్ళని నేనెన్నడూ చూడలేదు, వాళ్ళూ నన్ను చూడలేదు. కనీసం వాళ్ళు నా వివరాలు కూడా అడగలేదు. గంటల తరబడి తమ సమయాన్ని వెచ్చించి ఇతరులకు సహాయం చేస్తూ తద్వారా సమాజానికి తమ చేతనైనంత సేవని అందించాలన్న తపనతో వీళ్ళెంచుకున్న రంగం అతి క్లిష్టమైనది, అది “సాంకేతిక రంగం”. అలనాటి మహర్షులు తమ దివ్యశక్తులను ఎలా ఉపయోగించారో నాకు తెలియదు గాని, వీళ్ళు మాత్రం తమ మేధస్సుని, టెక్నాలజి ని మంచి కార్యాలకోసం వినియోగిస్తున్నారు. తమ జ్ఞానాన్ని నలుగురికి పంచాలన్న అంకితభావం కలిగిన ఈ ముగ్గురు మహానుభావులు మీ అందరికి కూడా చిరపరిచితులే.

వీరు, తెలుగు నేలని “కంప్యూటర్ లిటరసీ స్టేట్” గా మార్చాలన్న లక్ష్యం మరియు ధృఢమైన సంకల్పం కలిగిన కంప్యూటర్ ఎరా ఎడిటర్ నల్లమోతుల శ్రీధర్ గారు, అంతర్జాలంలో మన తెలుగుని సులభంగా వ్రాయటానికి కంకణం కట్టుకుని “లేఖిని” అనే అద్భుతమైన మృదుజాలాన్నీ, “కూడలి” లాంటి అసామాన్యమైన వెబ్ సైట్ లని మనకందించిన వీవెన్ గారు, మరియు తెలుగు బ్లాగంటే చాలు ఎందరికో స్పూర్తినిచ్చి, అందరికీ కొండంత అండగా నిలిచే మరియు కొత్తపాళీ గారి మాటల్లో చెప్పాలంటే “ఐదు బ్లాగుల్ని పంచకళ్యాణి గుర్రాల్లా నడిపిస్తున్న” జ్యోతి గారు. సాంకేతిక సహాయంకోసం వీళ్ళు ఏర్పాటు చేసిన మరియు నేనారోజు వీళ్ళని కలిసిన లింకు http://computerera.koodali.org/.

వీరి నిస్వార్ధ సేవానిరతిని పొగిడి వదిలివేయకుండా, వీరిని స్పూర్తిగా తీసుకుని మనమూ మన తోటి సమాజానికీ, తెలుగు తల్లికీ సేవలందించటానికి ముందుకు అడుగువేయాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాము.

మొక్కుతో కోరికలు తీరుతాయా? ……..

images.jpg

జీనమోత్తముడు(ఉత్తమ  జీనోంకోడ్  కలవాడు.)
ఏడుకొండలవాడా! ఆపదమొక్కులవాడా గోవిందా గోవిందా! ఇలా భగవంతుడి కి మొక్కుకొని తమకోరికలు తీరాయని తమను ఆపదలనుంచి  గట్టెక్కిచ్చాడని భగవంతుడికి మొక్కులు  తీర్చుకోవటం పరిపాటి.అసలు నిజంగా భగవంతుడికి ఇలా మనం కోరిన కోరికలు తీర్చే శక్తి  ఉందా? ఓ కథ తో కూడిన విశ్లేషణ ….సరదా గానూ ,సీరియస్ గానూ…..

 నాపేరు వినాయకరావు. వినాయకుడి భక్తుణ్ణి. ఉద్యోగం వస్తే భగవంతుడికి  నిలువుదోపిడి   ఇస్తానని మొక్కుకొని  సమయానికి రైలు అందక ఇంటర్వ్యూ కి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకున్నాను.  తరువాత  భగవంతుడి కీ నాకు మధ్య ఏమిజరిగిందో ఇక కధ  లో చూద్దాం…….
 
నేనూహించినట్లుగా  ఇక్కడ మేఘాలు లాంటివి ఏమీలేవు. నేల మాత్రం మన ఆకాశం లా ఉందంతే. ఒక్కచెట్టూ కనిపించలా ,కాని సంగీతంతో కూడిన సువాసనల చల్లటి గాలిమాత్రం వీస్తూంది ఎక్కడినుండో.ఆ మధుర వాసనలని పీలుస్తూ అటూ ఇటూ చూశాను ఎక్కడ మా వినాయకుడని. అడుగో ఇటే వస్తున్నాడు తొండం తిప్పుకుంటూ. ఉక్రొషం గా తల పక్కకు తిప్పుకున్నాను. అనవసరంగా చచ్చిపోయెటట్టు చేశాడు మరి, కోపం  రాదూ.రానియ్ చెబుతాను మనసులో అనుకున్నాను గట్టిగా.. కొద్దిసేపటికి నా భుజం మీద ఓ చల్లటి స్పర్శ మృదువుగా ..తొండంలాగుంది. ఇక లాభం లేదని వెనక్కి తిరిగి చూసాను. మనోహర రూపం. తనే ముందుగా అడిగాడు “కోపం పోయిందా?” అని… తలూపాను పోలేదని.
“అసలు ఎందుకొచ్చిందీ?” అడిగాడు అమాయకంగా.
చెప్పాను ఎందుకొచ్చిందో..
“అయితే నాకు మొక్కేసుకుంటే  నీకు ఉద్యొగం వచ్చేస్తుందా?”
“లేదు దాని కి తగ్గట్టుగానే ప్రిపేరు అయ్యాను.”
“మరైతే ఎందుకు రాలేదు?”
“అసలు నాకు రైలు అందితే కదా, రావటానికీ పోవటానికీ!!”
“దానికి నేనేంచేసేది?”
“నీకు మొక్కుకున్నాను గా..”
“అసలు ఉదయం ఏమి జరిగింది?”
“ఎక్కడ?”
“స్టేషనులో….”
“టైం అయిపోతుంటే గబ గబా స్టేషనులోకి వచ్చాను అప్పటికే రైలు వెళ్ళిపోయింది.ఆ బాధతో ఆత్మ హత్య చేసుకొని ఇక్కడకొచ్చాను.”
“అలాక్కాదు   జరిగింది జరిగినట్టు గా చెప్పు.”
“ముందుగా టీ.సీ ఎదురోచ్చాడు.అతన్ని అడిగాను సార్ సింహపురి ఎక్స్ప్ ప్రెస్ వెళ్ళిపోయిందా? అని.”

“ఏమిచెప్పాడు?”
“ఇంకెక్కడి సింహపురి ఎప్పుడో పోయిందన్నాడు.”
“సరే మామూలు గా నీ జీవితములో  నిజానికి జరగాల్సింది ఇదే.కాని నువ్వు నాకు మొక్కుకున్న విధంగా నీ కోరిక తీర్చడానికి నేను నీ జీవితాన్ని మారిస్తే ఏ విధంగా ఉంటుందో చూడు.”

సినిమాలోలా దృశ్యం మారింది, నేనూ చూడగలుగుతున్నాను.

“సార్ సింహపురి వెళ్ళిపోయిందా?” అడిగాడు వినాయకరావు అదే టీ.సీని, తన నుదుటికి పట్టిన చెమట తుడుచు కుంటూ.
“లేదయ్యా అరగంటలేటు.” చెప్పి వెళ్ళిపోయాడు ఆ టీసీ.
ఒక్కసారిగా రిలీఫ్ గా గాలి పీల్చుకుని కౌంటరు వైపు నడిచి టికెట్ తీసుకుని బెంచీ మీద కూర్చున్నాడు ఇంటర్వ్యూ కి పోతున్న వినాయకరావు. కొద్దిసేపటికి  వచ్చి ఆగింది సింహపురి భారంగా.

గుంపులోదూరి ఓ మూల సీటు సంపాదించాడు, రైలు బయలుదేరింది.

మధ్యలో అడిగాడు ఎదురుగాకూర్చున్న ఓ పెద్దాయన.
“ఎక్కడిదాకా బాబు?
“హైదరాబాదు.”
“ఎమీలేదూ… రైల్లొ కూడా చదువుతుంటేనూ.”
“ఇంటర్వ్యూ కదండీ.”  ఇంకో మాటకు అవకాశము ఇవ్వకుండా పుస్తకములో కి తల దూర్చాడు వినాయక రావు. కొద్దిసేపటికి అటుగావచ్చిన వేరుసెనగ కాయల అమ్మాయి దగ్గర ఓ రెండు రూపాయలిచ్చి కాయలు కొనుక్కొని తింటూ ఆలోచించసాగాడు తనకి ఈ ఉద్యొగం ఎంత ముఖ్యమోనని.
అంతటితో ఆగిపోయింది  ఆ దృశ్యము.

“ఏమన్నా అర్ధము అయిందా నాయనా?” అడిగాడు వినాయకుడు, నన్ను..
“ఊహూ..” తల ఊపాను అర్దమవనట్లుగా..
నీ ఒక్కడి కోరిక వల్ల నేను  ఇలా  ఎందరి జీవితాలు మార్చాలో చూశావా. ముందుగా టీ.సి., నిజానికి టీ సి, నీతో మాత్లాడవలసిన మాట “ఇంకెక్కడ ఎప్పుడో పోయిందని.”.  కాని ఇప్పుడు మాట్లాడింది  “అరగంట లేటు.” అని. నీ కోరికవల్ల  ఇతని జీవితం నేను మార్చాలి.అలాగే టికెట్ కౌంటర్లో నీ సంభాషణ,లోపల పెద్దయనతో నీ సంభాషణ తరువాత నీవు తింటానికి కొన్న పల్లీలకు రెండు రూపాయలిచ్చావు.ఆ రెండు రూపాయల కాయిను తన జీవిత కాలములో ఇంక ఎందరి చేతులు మారుతుందో వారందరి జీవితాలు మార్చాలి.అంతెందుకు అసలు రైలులో ఉన్న వారందరి జీవితాలలో ఓ అరగంట మార్పులు జరుగుతాయి.ఆ మార్పులు వారికి మంచి చేయవచ్చు.
లేదా తీరని నష్టం కలిగించవచ్చు.

“నష్టలా? ఎలా స్వామీ?” అడిగాను అయోమయంగా
“చూడు మరి.”
మళ్ళీ దృశ్యం మారింది.
కీచుమని శబ్ధం తో రైలు ఒక్కసారిగా ఆగటముతో
తల తిప్పి కిటికీ నుంచి బయటకు చూశాడు వినాయకరావు. ఎక్కడ చూసినా యునిఫారములో ఉన్న చిన్న పిల్లల శవాలు.మరొపక్క రైలు దెబ్బకు తునా తునకలైన స్కూలు బస్సు.అన్-మాన్డ్ లెవెల్ క్రాసింగ్ వద్ద యాక్సిడెంట్.రైలు వేళ తప్పి రావడము వల్ల ,సమయానికి బ్రేకు పడకపోవడమువల్ల జరిగిన ఘోరం .అప్పటికే చాలామంది మరణించారు.
ఆ దృశ్యం చూచిన వినాయకరావు స్పృహ తప్పి తిరిగి వినాయకుడి ముందు కళ్ళు తెరిచాడు.

“నీవల్ల చూడు ఎంతమంది పిల్లలు చనిపొయారో?”
“నేనేం చేశాను స్వామి?” అన్నాను కొంచం కంగారు మిళితమైన స్వరం తో.
“నీ మొక్కువల్లే కదా రైలు లేటై   బస్సుని గుద్దేసింది.”
“చెప్పు నీకోసం నేను ఇంతమంది జీవితాలని మార్చాలా?”
“వద్దు స్వామీ వద్దు ఈపాపం నాకొద్దు.”

“ఇప్పటికైనా అర్ధమయిందా? జరిగేది ఎవరూ తప్పించలేరని.”
“అయింది కాని నాదో చిన్న అనుమానం స్వామీ, జరిగేది జరిగితే మరి మానవుడు కర్మ చేయకుండా కూర్చోవచ్చు  గదా,మరి కర్మ స్వేచ్చ వుందంటారు..”
నవ్వి చెప్పాడు “జీవికి ఉండేది కర్మ స్వేచ్చ కాదు. భావ స్వేచ్చ. భావ స్పందన.. భావ స్వేచ్చ ద్వార ఆలోచించి భావ స్పందన ద్వారా నిర్ధారించబడిన కర్మ చేస్తాడు.”
“అంటే?”
“ఓ చెట్టు మీద కాయ ఉంటే దాన్ని కోయాలంటే ముందు ఆకలో కోరికో కలగాలి ఆ కోరికతో ఆ మనిషి చెట్టు ఎక్కుతాడు. అక్కడ పాము కరుస్తుంది. డాక్టరుకి నాలుగు వేలు ఇస్తాడు. ఆ నాలుగు వేలతో దాక్టరు కొడుకు షికారుకి పోతాడు. అక్కడ ఆక్సిడెంటు అవుతుంది. ఇక్కడ పాము కరవటమూ, ఆక్సిడెంటు అనేవి ఒకదానితో ఒకటి లింకులు.ముందే నిర్ణయించబడినవి.  కానీ ఈరెండూ జరిగింది  కేవలము ఓ కాయ కావాలన్న చిన్న కోరిక తోటే. మానవుడు కర్మ మానేస్తాడనే ఈ    కోరికలూ, కోపం, బాధ, అసూయ, జాలి, దయ లాంటి మానసిక భావాలు పెట్టింది. వాటి ద్వారా తను చేయవలసిన కర్మ వైపు నెట్టబడుతాడు.ఆ కర్మ కలుగ జేసిన ఫలితాలకు  స్పందించి మరికొందరు కర్మలు  చేస్తారు.ఇలా భావం, స్పందన, కర్మ వలయాకారాలు. అలా అంటుకుంటూ పోతుంటాయి.
అదే ప్రపంచ గమనం. ఓ గాంధీ అయినా  గాడ్సే అయినా మీ భాష లో అయితే జీనోంకోడు ప్రకారము పనిచేసినవారే. రాజీవ్ మరణానికి  ఉగ్రవాదులే కారణం కావచ్చు. కాని చావు కి బీజం వేసింది తన ఇంటి ముందు తచ్చాడిన ఇద్దరు కానిస్టేబుల్స్ . వారిద్దరినీ  చంద్రశేఖర  ప్రభుత్వం  తన మీద నిఘా  వుంచిందని ఆగ్రహించిన రాజీవుడు మద్దతు వుపసంహరించుకోవడమూ  ఎన్నికలు రావడమూ ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన దాడిలో మరణించడమూ ఒకదాని కొకటి లింకులు. నిఘా  అన్న మిష తోటి మరణం వైపు నెట్టబడ్డాడు. అర్ధం అయిందా ఈ గమనం?” అడిగాడు వినాయకుడు.
“బాగా అర్ధం అయింది స్వామీ ఇంకెప్పుడూ మొక్కుకోను.”
“సరే ఇంకో ముఖ్య విషయం ఇది ఎవరికీ చెప్పకూడదు.”
“చెబితే?” బెదిరిస్తున్నట్లుగా అడిగాను,

నవ్వి అన్నాడు.”నీ కోడు లో ఈ రహస్యం ఎవరికీ చెప్పే పోగ్రామ్ రాసి లేదు. అందుకే నీకు చెప్పాను.”
బిక్కముఖంతో అడిగాను. మరి ఇదంతా ఎవరు రాస్తారని.
దగ్గరకు తీసుకుని చిన్నగా చెవిలో చెప్పాడు ఎవరు వ్రాస్తారో.
చేతి దగ్గర చుర్రుక్కుమనటం తో  కళ్ళు తెరిచాను.
“ఇంకేం భయం లేదు కోలుకుంటాడు…. తాగింది నకిలీ పురుగులమందు, ఏమీ కాదు. భయంతో స్పృహ తప్పిందంతే.”

హస్పిటల్ లో డాక్టరు గారి భరోసాతో వినాయకరావు తల్లి కన్నులలో వెలుగు.
మత్తుగా కళ్ళు తెరుస్తున్న నాకు మాత్రం ముందుగా కనిపించింది ఎదురుగా గోడ మీద  నోటిమీద వేలితో “ష్…ష్…ఎవరికీ ఏమి
చెప్పద్దు.” అన్నట్లు బుజ్జిబాబు  సైలెన్స్ క్యాలండరు.      
 
 
 

ఈ విజయం హిందువులదా?

narendra.jpg      గుజరాత్ లో ఎవ్వరూ వూహించని అనూహ్య విజయాన్ని సాధించారు శ్రీశ్రీశ్రీ నరేంద్రమోడి. 182 స్థానాలకి గాను 117 స్థానాలను కైవసం చేసుకుని కాషాయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ విజయంలో బి.జె.పి ఆయనకెలాంటి సహకారాన్నీ అందించలేదు, సంఘ్ పరివార్ ఆమడ దూరంలో నిల్చుంది, స్వంత సమూహంలో ముసలం పుట్టింది, మరో బి.జె.పి. నేత కేశూభాయ్ పటేల్ చేసిన వ్యతిరేఖ ప్రచారం, కాంగ్రెస్ తరపున సోనియా గాంధి, రాహుల్ గాంధి వంటి నేతలు రంగంలోకి దిగారు, డా.మన్మోహన్ సింగ్ తో సహా అనేక మంది నేతలు పదే పదే గోద్రా హింసా ఖాండను ప్రస్థావించారు, సోరాబుద్ధీన్ ని బూటకపు ఎన్‌కౌంటర్లో చంపేశారన్నారు, మోడి దుర్మార్గుడన్నారు. అయినాసరే మోడి అద్భుత మెజారిటీతొ పార్టీని గెలిపించారు, ముఖ్యమంత్రి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? రిగ్గింగులు లేవు, గొడవలు లేవు, మతకలహాలు లేవు. “గెలుస్తుంది గుజరాత్” అన్న నినాదంతో మోడి తిరిగి ప్రచారం చేసింది కేవలం 18 నియోజకవర్గాలలోనే. అయినా సరే కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టారు. ఈ గెలుపు ఎవరిది? బి.జె.పి. దా? గుజరాతీయులదా? మోడిదా? లేక హిందువులదా?    

   వాస్థవానికి ఈ గెలుపు ఎవ్వరిదీ కాదు. కాంగ్రెస్ కుత్సితాలకు భయపడి, నిస్సహాయులై మరో దారి లేక గుజరాతీయులు మోడి ని గెలిపించారు, బి.జె.పి. ని కాదు. అందుకే ఆయన్ని అందరూ One Man Army అంటారు. గుజరాత్ అంతటా వ్యాపార వర్గానికి చెందిన కుటుంబాలే ఎక్కువ. 10 వ తరగతి పాస్ అయిన తరువాత వ్యాపారంవైపు మొగ్గేవాళ్ళే గుజరాత్ లో ఎక్కువగా వున్నారు. మతకలహాలు చెలరేగినప్పుడు, హిందువులుగాని ముస్లిములుగాని ఎక్కువగా నష్టపోయేది వ్యాపారస్థులే. ఇక్కడ కాంగ్రెస్ కి స్థిరమైన నేత  లేకపోవడం, గుడ్డిగా ఎప్పుడూ మైనారిటీ వర్గాలని వెనకేసుకురావటం ప్రజల మనసుల్లో కాంగ్రెస్ అంటే మళ్ళీ గొడవలే, అంతటా అస్థిరతే అన్న భావన ముద్రపడి పోయింది. పైగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి వచ్చి పదేపదే…”మేమొస్తే గోద్రా కేసుని తిరగదోడతాం అనో, గోద్రా నరమేధం మోడి చేయించాడు…” అనో ప్రస్థావిస్తూ అసలే భయాందోళనలతో వుండే ప్రజల్ని మరింత భయపెట్టి వాళ్ళ గొయ్యి వాళ్ళే త్రవ్వుకున్నారు. దీనితో ఎంతో మంది కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు సైతం మోడి కి ఓటు వేయక తప్పలేదు. ఈసారి మోడి ఓడిపోయేటట్లు వున్నాడు అన్న వార్త అంతటా వ్యాపించటంతో, భయపడిపోయి అధిక శాతం గుజరాతీయులు ఏనాడూ ఓటు వెయ్యని వాళ్ళు కూడా జాగృతి అయి ఇళ్ళు కదిలి బయటకు వచ్చి వేలికి ఇంకు పూయించుకున్నారు.

   ఇండియా ఒక క్రికెట్ మ్యాచ్ గెలిస్తేనే ఔట్లు పేల్చి సంబరాలు చేసుకుంటారు గుజరాతీయులు. పాకిస్తాన్ మీద గెలిస్తే ఇక చెప్పనఖర్లేదు డప్పులు మోగించుకుంటూ వీధుల్లో నాట్యాలు చేస్తారు, అమ్మాయిలు కార్లలో వచ్చి కూడళ్ళలో “గర్భ” ఆడుతారు. అలాంటిది ఈనాడు మోడి గెలిచాడన్న ఉత్సాహం, ఉత్సవ వాతావరణం సాధారణ ప్రజల్లో లేదు.

   కాంగ్రెస్ వస్తే ముస్లిం మతఛాందసవాదులు పేట్రేగి పోతారు అన్న ఓ బలమైన ఆలోచనే మోడిని మళ్ళీ గద్దెనెక్కించింది. అటు ముస్లిం ఛాందసవాదుల్ని అణచివేయగల సత్తా, ఇటు హిందూ నేతల్ని గీత దాటనీయకుండా ఆపగల పట్టు వున్న ఏకైక నేత శ్రీశ్రీశ్రీ నరేంద్రమోడి మళ్ళీ గెలవటంతో సగటు గుజరాతీయుడు వూపిరి పీల్చుకుని తిరిగి తన పనిలో తను మునిగిపోయాడు.

పంచె కట్టులో పూలవాన

tradition-01.jpg

తెలుగు భాష వీరాభిమాని మన పూలవాన రవికిరణ్ ఆఫీసులో సాంప్రదాయ దుస్తుల దినోత్సవ సంధర్భంగా తన తెలుగు నుడికారానికి   అచ్చ తెనుగు పంచకట్టినవేళ… …  

అందరికీ దీపావళీ శుభాకాంక్షలతో…

పచ్చనాకు సాక్షిగా నామినికో లేఖ…

bapu18.jpg

“కష్టి పడాల కూడు తినాలఅని మంచి మాట చెబితివి కదరా నా బట్టా! యాడికి పోయినావురా నామినోడా? దోవన బొయ్యే చీమని కూడా మంచీచెడ్డా అడిగేటోడివిగదరా, అసలు నీకు ఈడ మేమనేటోల్లం ఒకరం సావలేక బతకతావుండామని చీవ గుట్టినట్టన్నా వుందంటరా నా బట్టా? ఈడ వూర్లో కోడిపుంజులు తెగ బలిసి కొట్టుకుంటా వుండాయిరా, దొబ్బుకుపోయి