something fishy

చైనీయులను తరిమికొట్టిన తెలుగు సైనికులు

“మన దేశానికి అసలు శత్రువు పాకిస్థాన్ కాదు, పొరుగునే ఉన్న మరో పెద్ద దేశం.” అని కొన్నాళ్ళ క్రితం చైనా ని ఉద్దేశించి మన పూర్వ రక్షణమంత్రి శ్రీ జార్జ్ ఫెర్నాండజ్ చెప్పినప్పుడు ఎవరూ దానికి పెద్దగా స్పందించలేదు. అణు బాంబులను నింపుకున్న రెండు అత్యున్నత శ్రేణి సబ్ మెరైన్లు మనకు దగ్గరలోనే సముద్రంలో మొహరించినట్లు ఈ మధ్య శాటిలైట్ చిత్రాలు వెల్లడించటంతో ఉలిక్కిపడింది మన రక్షణ యంత్రాంగం. చైనా అమ్ములపొదిలో ఉన్న అస్త్రశస్త్రాలకీ మన దగ్గర ఉన్న వాటికీ పోలిస్తే మనం ఎంతో వెనుకబడి ఉన్నామన్న సంగతి వెల్లడవుతుంది. మనం నిన్న 3500 km రేంజ్ గల అగ్ని-III ని విజయవంతంగా ప్రయోగించాము. ఇదే మనకి అత్యున్నత రేంజ్. కాని చైనా 1999 లోనే 11,200 km రేంజ్ కలిగిన మిస్సైల్స్ ని ప్రయోగించి, నియోగించింది. సరే అవన్నీ పక్కన బెడితే చాపక్రింద నీరులా మన దేశ యంత్రాంగాన్ని మరో రంగంలో కూడా విజయవంతంగా దొంగ దెబ్బ తీస్తూ ఉంది, అదే సైబర్ అటాక్స్.

IT రంగంలో దిగ్గజాలన్న పేరున్న మనం దీన్ని నిశ్శబ్ధంగా భరించాల్సి వచ్చిన దుర్భర పరిస్థితిలో ఉన్నాం. కనీసం రెండేళ్ళ నుండి దాదాపు ప్రతిరోజూ ఈ సైబర్ అటాక్స్ మన ప్రభుత్వ మరియు ప్రయివేట్ కంప్యూటర్ నెట్ వర్క్ ల మీద సమర్ధవంతంగా దాడి చేస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నత అధికారులు ఇలా అంటున్నారు “ఈ దాడులు ఏవో పిల్ల చేష్టలు కావు. వీటిని సింపుల్ గా “Hackings” అని పిలవలేము. ఇవి ఒక పద్దతి ప్రకారం, కావాలని మన దేశం మీద జరుపుతున్న దాడులు”. వీటివల్ల చైనీయులు భారత నెట్ వర్క్ లను స్కానింగ్ మరియు మ్యాపింగ్ సులభంగా చేయగలుగుతున్నారు. వారు మన సైట్ ల లోని వివరాలతో పాటు, నెట్వర్క్ ని ఎలా డిజేబుల్ చేయవచ్చో కూడా తెలుసుకోగలుగుతున్నారు. కొన్ని నెలల క్రితం NIC (National Informatics Centre), National Security Council, MEA ల మీద కూడా ఇలాగే దాడి జరిగింది. వీటిని ఎదుర్కోవటం సులభమే అని ప్రభుత్వం అంటున్నా, దానికి కావలిసిన టెక్నాలజీని సమకూర్చుకోవటానికి తీసుకోవలసిన చర్యలు మాత్రం ఇంతవరకు తీసుకోలేదు. అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతో అప్రమత్తతతో వ్యవహరిస్తూ డెడికేటెడ్ గా పని చేస్తూ మన ప్రభుత్వ నెట్ వర్క్ లను కాపాడుకుంటూ వస్తున్నారు ఇంతవరకు.

చైనీయులు చేస్తున్న ఈ అటాక్ లు ముఖ్యంగా మూడు రకాలు.

1. BOTS , 2. key loggers, 3. Mapping of Networks.

ఇందులో BOTS ఎంతో ప్రమాదకారి. ఇవి నెట్ వర్క్ లో చేరి నిద్రాణంగా ఉంటాయి. ఒక నిర్ధిష్ట సమయంలో BOTNETS నిద్ర లేచి నెట్ వర్క్ మీద పూర్తి నియంత్రణ సాధిస్తాయి. నిపుణుల అంచనా ప్రకారం చైనీయులు ఈ BOTS టెక్నాలజీలో ఆరితేరి ఉన్నారు. తెలిసిన లెక్కల ప్రకారం ఇలాంటి BOTS దాదాపు 50,000 దాగి ఉన్నాయి మన దేశపు ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్ వర్క్ లలో. వీటన్నింటినీ తొలగించలేక పోతే ఏదో ఒకనాడు దేశం పూర్తిగా షట్ డౌన్ అయ్యే స్థితి తలెత్తుతుంది.

అయితే ఇదంతా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే….

కంప్యూటర్ ఎరా గురించి అందరికీ తెలుసు. నిస్వార్ధంతో తెలుగు వాళ్ళకి కంప్యూటర్ నాలడ్జ్ ని ఉచితంగా మరియు సులభ రీతిలో అందించాలన్న తపనతో శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు కంప్యూటర్ ఎరా అనే ఫోరంని ఏర్పరిచారు. ఇందులో ఇప్పటికి సభ్యుల సంఖ్య 2342, మొత్తం పోస్టుల సంఖ్య 3256. ఫోరం అంటే మామూలు ఫోరం కాదు. స్వలాభాపేక్ష లేని డెడికేటెడ్ సభ్యులు నిరంతరం దాన్ని విజ్ఞాన ఖని గా నింపే పనిలో ఉంటారు. ఇందులో కొన్ని వేల ప్రశ్నలకు తెలుగులో సమాధానాలు దొరుకుతాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇందులో వదిలేస్తే, తెలిసిన వాళ్ళు సమాధానం ఇచ్చే వెసలుబాటు కూడా ఉంది. ఈ ఫోరం కాకుండా, సాంకేతిక సహాయం అనే చాట్ ని కూడా వీవెన్ గారి సహాయంతో మొదలు పెట్టారు. ఇందులో ప్రత్యక్షంగా ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అడగచ్చు, అంకిత భావం కలిగిన అనేక మంది సభ్యులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి పరిష్కారం చూపటానికి తమవంతు కృషి చేస్తారు. సమాధానం అందుకున్న వాళ్ళు కూడా అందులో పాల్గొనటానికి ఎంతో ప్రోత్సహిస్తారు. తెలుగులో వ్రాయటాని ఎంతో ప్రాధాన్యతనిస్తూ వచ్చిన వాళ్ళందరినీ తెలుగులో వ్రాయమని ప్రోత్సహించి దానికి అవసరమైన సహాయం అందిస్తారు…ఎలాంటి లాభాపేక్ష లేకుండా.

అంతటి అమూల్యమైన మన ఈ తెలుగు సైట్ ల మీద ఈ మధ్య ఆ చైనీయులు దాడి చేశారు. నిద్రాణంగా ఉన్న BOTS వళ్ళు విరుచుకుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు వాటిలోని కోడ్ ని డామేజ్ చేసి, దేన్ని క్లిక్ చేసినా అది ఓ చైనా వెబ్ సైట్ కి రిడైరెక్ట్ చేసేట్లు కోడ్ ని మార్చేసింది. అది ఈ పని పూర్తిచేసి ఫోరం మరియు చాట్ లలోని డేటా బేస్ మీద దాడి చేసే లోపు ఇద్దరు సైనికులు తేరుకుని చైనీయులను చుట్టు ముట్టి ఊపిరాడకుండా చేసి అమూల్యమైన డేటాని కాపాడారు. రాత్రి 10.30 కి మొదలైన దాడిని అత్యంత చాక చక్యంతో ఎదుర్కొని సకాలంలో స్పందించి ఆ కుత్సిత బుద్దిగల డ్రాగన్ నుండి అనుక్షణం కాపలా కాసి, కంటి మీద కునుకు రానీయకుండా మరునాడు సాయంత్రానికల్లా పాడయిపోయిన ఫైళ్ళని పునఃనిర్మించి కొన్ని వందల మంది కష్టపడి సేకరించి పొందుపరిచిన డేటాని ఉన్నదున్నట్టుగా మళ్ళీ అందరికీ అందించారు. సమిష్టి కృషి తో చైనీయుల దుర్మార్గాన్ని సకాలంలో అడ్డుకున్న ఆ వీరసైనికులు జీవి (గోపాల్ వీరనాల) గారు మరియు నల్లమోతు శ్రీధర్ గారు. సామాన్యులు సాధించిన ఈ అసామాన్య విజయం డ్రాగన్ ని తోక ముడిచేలా చేసింది.

****ఇంకా అయిపోలేదు … క్రింది లేఖ చదవండి****

చైనా హ్యాకర్లకు జ్యోతక్క లేఖ

అరే దొంగ సచ్చినోడా!..నీకేమి పోయేకాలమొచ్చింది? నీ పిల్లి కళ్ళకు కళ్ళ కలక రాను. మా పని మేము చేసుకుంటుంటే అనవసరంగా వచ్చి హ్యాక్ చేశావ్. ఐనా దానిని మేము చాలా ఫాస్ట్ గా రికవర్ చేసుకున్నాం. ఐనా తెలుగు నీకు ఏమర్ధమవుతుందని హ్యాక్ చేశావు రా? మళ్ళీ గాని ఇలా ప్రయత్నించావంటే, మా దేశం లోని అన్ని భాషల బూతులతోటీ నిన్ను తిట్టేలా చెయ్యగలను. అది అర్ధం కాక మీ గ్రేట్ వాల్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకోవాలి. ఏమనుకున్నావో జాగ్రత్త!!!

ముత్యమంత ముద్దా?

మామిడాకులకు విడాకులు

పండగ పూట విడాకులేంటి వీడి మొహం అనుకుంటున్నారా? కాస్త ఆగండి. అహ్మదాబాద్ కి వచ్చిన కొత్తల్లో బయటకి అడుగుబెడితే అన్నీ గుడ్లప్పగించి చూడటం తప్ప ఇంకేమీ చేయలేకపోయే వాళ్ళం. ఎక్కడ సైన్ బోర్డ్ లు చూసినా గుజరాతీలోనే, బస్సు పేర్లూ, నంబర్లూ గుజరాతీలోనే. ఎవడ్ని కదిలించినా హిందీలోనో లేకపోతే గుజరాతీలోనే జవాబు చెప్పేవాళ్ళు, వాళ్ళు నమిలే పాన్ మసాలా తుంపర్లతో మమ్మల్ని తడిపేసి. గుజరాతీ అక్షరాలు కాస్త హిందీని పోలి ఉండటం వల్ల కష్టపడి కొన్ని అర్ధం చేసుకోగలిగే వాళ్ళం. కాని ఆ నంబర్లు మాత్రం మమ్మల్ని గిజగిజలాడించేశాయి. సిటీ బస్సుల నంబర్లు గాని, పేర్లు గాని గుజరాతీలోనే ఉండేవి. ఆ అక్షరాలు కూడబలుక్కుని చదివేలోపు బస్సు వెళ్ళి పోయేది.ఇక లాభంలేదని, నంబర్లు తెలుసుకోవటానికి ఒక అయిడియా కనిపెట్టాం. బస్సు టిక్కెట్ మీద 1 నుంచి 9 వరకు గుజరాతీ నంబర్లు ఉంటాయి కదా (మన RTC వారి టికెట్ అయినా నంబర్లు ఉంటాయి) దాన్ని చేతిలో పట్టుకుని కంపేర్ చేసుకునే వాళ్ళం. అప్పటినుంచి జేబులో ఒక టికెట్ ముక్క పెట్టుకుని తిరిగాం కొన్నాళ్ళు డిక్షనరీ లాగ.

మేము ముగ్గురం రూంమేట్స్ ఉండే వాళ్ళం. అందరం తెలుగు వాళ్ళమే. ఒకే సారి జాయిన్ అవటం వల్ల, ఒకే వయస్సు వాళ్ళం అవటం వల్ల ఫ్రెండ్లీ గా ఉండేవాళ్ళం. ముఖ్యమైన ఇంటిపనిని మొత్తం ఆరు పనులుగా విభజించాం. ఉదయాన్నే మంచి నీళ్ళు పట్టటం, అంట్లు తోమటం, అన్నం, కూర,మళ్ళీ సాయంత్రం అన్నం , కూర. వీటిలో తలా రెండు పనులు చేయాలనమాట. నెలకొకరం కూరగాయలు తేవాలని నిర్ణయించుకున్నాం. అలా నేను మార్కెట్ కెళ్ళి కూరగాయలు తేవాల్సిన రోజు రానే వచ్చింది. వంకాయలని వంకాయలంటారు, బెండకాయలని బెండకాయలంటారని తెలుసుగాని వాటిని వీళ్ళేమంటారో తెలీదు. అయితే దానివల్ల పెద్ద సమస్య రాలేదు, వాటిని చూపిస్తే చాలు కదా అమ్మే అతనికి. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎన్ని కావాలో అడిగినప్పుడే. బుర్ర పాదరసంలా పనిచేసింది, అక్కడ కూడా అదే టెక్నిక్ ఉపయోగించి అరకేజి రాయి తీసి తక్కెడలో వేశాను, కొన్నింటికి పావుకిలో రాళ్ళు వేసి ఆ పూటకి తప్పించుకున్నాను. ఈ సమస్య మిగిలిన వాళ్లందరికీ వచ్చి ఉండటం వల్ల అందరం సరదాగా నవ్వుకున్నాం. అయితే నాకు ఏడుపుతెప్పించిన సంఘటన ఒకటి జరిగింది ఒకసారి. కొన్న కూరగాయలయిపోగానే మళ్ళీ మార్కెట్ కి వెళ్ళవలసి వచ్చింది. ఈ సారి ముందు జాగ్రత్తగా ఇంటి ఓనరమ్మనడిగాను, “పావుకిలోని ఏమంటారు ఇక్కడ?” అని “పావుకిలోని అడీ సౌ, అరకిలోని ఆదాకిలో అంటారని” చెప్పింది నవ్వుతూ. సరే వాటినే మననం చేసుకుంటూ వెళ్ళాను ధైర్యంగా. వంకాయలోడి దగ్గరకి వెళ్ళాను ట్రైల్ వేద్దామని. అప్పటికి వంకాయల నేమంటారో ఇంకా తెలీదు నాకు. వాటిని చూపించాను, ఇవి కావాలన్నట్లు. “ఎన్ని కావాలి?” అని అడిగాడు. నేను ఓనరమ్మ చెప్పిందే మననం చేసుకున్నాను. దాన్ని తెలుగుకి అన్వయించి ఒక వెధవ లాజిక్ మనసులో పెట్టుకున్నాను. తెలుగులో అరకిలోని వీళ్ళు ఆదాకిలో అంటున్నారు కదా అలాగే మన పావు కిలోని ఆంటీ చెప్పిన అడీసౌ ని మార్చి, “అడీసౌకిలో కావాలి” అన్నాను వాడితో. అతను మామూలుగా తూయటానికి తక్కెడ నెత్తి , అదిరిపడ్డాడు. ఏమిటీ!! అడీసౌ కిలో కావాలా? ఈ పూర్తి మార్కెట్ లో ఉన్న అన్ని వంకాయలని తూసినా అన్ని వంకాయలుండవు” అని తక్కెడ వదిలేశాడు. ఇదేం ఖర్మరా భగవంతుడా అనుకుని వాడికా రెండు తూనిక రాళ్ళు చూపించి వాడిచ్చిన నాలుగయిదు వంకాయలు తీసుకుని, వాడి మొహం చూడబుద్ది గాక బతుకు జీవుడా అనుకుని గుంపులో కలిసిపోయాను. అడీసౌ అంటే 250 అనీ, అడీసౌకిలో అంటే 250 కిలోలని ఇంటికొచ్చిన తరువాత తెలిసి నా మొహం కందగడ్డ లాగా మారిపోయింది.

సరే ఈ చిన్న చిన్న అవమానాలకేమీ లెక్క లేదు గాని, అసలు అది అవమానమో? లేక అమాయకత్వమో? తెలీని ఓ విచిత్ర సంఘటన మేమిక్కడ అడుగిడిగిన తరువాత వచ్చిన మొట్టమొదటి ఉగాది రోజు జరిగింది. ఇప్పటికీ దానికి నవ్వాలో ఏడవాలో తీలీదు నాకు. గుజరాతీయులు పండుగలను చాలా వినూత్నంగా, ఆనందంగా, మనఃస్పూర్తిగా జరుపుకుంటారు. అందులో లీనమైపోతారు. దసరా నవరాత్రులలో గర్భ నృత్యాలే దానికి నిదర్శనం. ఆసమయంలో డాన్స్ చేయని గుజరాతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. భార్యా భర్తలు కలిసి అడుగులో అడుగేసుకుంటూ పబ్లిక్ గా నృత్యం చేయటం మన వైపు ఊహించగలమా. అసలు డాన్స్ చేయటమంటేనే సిగ్గు పడతాము. వీళ్ళింతగా సక్సెస్ అవటానికి వీరి సంప్రదాయాలే చాలావరకు దోహదపడుతున్నాయని అనిపిస్తుంది. సరే అసలు విషయానికొస్తే ఇలా ఒక్కో పండగ దాటు కుంటూ ఉంటే ఒక విషయాన్ని గమనించాం. వీళ్ళు మంగళ తోరణాలుగా మామిడాకులు వాడటం లేదు, అశోక ఆకులు వాడుతున్నారు. రెండూ ఇంచుమించు ఒకేలా ఉంటాయి కదా. పిచ్చోళ్ళు, వీళ్ళకి మామిడి చెట్లు లేక ఇవి వాడుతున్నారనుకున్నాము మొదట్లో. కాని అవి వారికి చాలా పవిత్రమైన ఆకులని తరువాత అర్ధమైంది. మనం పండుగలప్పుడు మామిడాకులని ఎలా పవిత్రంగా భావిస్తామో వీరు అశోక (ఆశోపాలవ్) ఆకులని అంతే పవిత్రం గా పూజిస్తారు. అన్ని రకాల పూజల్లోనూ ఇవే వాడుతున్నారు. అయితేనేమి వీరు గుజరాతీయులు, మనం ఆంధ్రులం. మనం మన మామిడాకులే కట్టుకుందాం అని మేం నిర్ణయించుకున్నాం. అయితే అవి ఎక్కడ దొరుకుతాయి? వెతికీ వెతికీ ఒక చెట్టుని పట్టాం (ఈ పదేళ్ళలో నేను కేవలం మూడు మామిడి చెట్లను మాత్రమే చూశాను అహ్మదాబాద్ లో).

ఉగాది ఉదయాన్నే తలస్నానం చేసి, శుచిగా కొన్ని ఆకులు గ్రుచ్చి వాటిని తోరణం గా కట్టాం. మాలో ఒకడు ఉగాది పచ్చడి చేయటం లో మునిగిపోయాడు (యాక్! మీకు చేయటం రాకపోతే ఊరుకోవచ్చుకదా! అని చివాట్లు పెట్టారు అది తిన్న గుజరాతీయులు తరువాత). ఇంతలో వాకిట్లో ఏదో శబ్ధం, ఏవో తెగిపోతున్నట్లు ఫట్ మని, ఆకులు రాసుకున్నట్లు. వెంటనే బయటికొచ్చి చూశాము. మా ఇంటి ఓనరు మన మామిడాకుల తోరణాన్ని తెంపేసాడు. “ఓరి దుర్మార్గుడా!” అనుకుని “ఏమిటీ అన్యాయం?” అని ప్రశ్నించేలోపు ఓ మోపెడు ఆశోక ఆకులు తెచ్చి ఇంటి ముందు పడేశాడు. “మీకు తెలీకపోతే మమ్మల్ని అడగఖఃరలేదా? పండగపూట ఈ పిచ్చాకులు కడుతారా?” అని కిందపడి ఉన్న మామిడాకుల తోరణాన్ని చూపిస్తూ నిష్టూరమాడాడు. “ఇవిగో వీటిని కట్టుకోండి” అని అశోక ఆకుల్ని తోరణంగా కట్టిచ్చాడు. ఈయనకిట్టగాదని ఇంట్లోకి పిలిచి ఉగాది పచ్చడి పెట్టాము. అది తిని కొంచెం చల్లబడ్డాడు. ఇలా జీవితానికీ, రుచులకీ ముడిపెట్టిన మన సంప్రదాయాన్ని పొగిడి, మమ్మల్ని ఆశీర్వదించి ఈ పిచ్చాకులు మళ్ళీ ఎప్పుడూ కట్టబాకండని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆ అశోక ఆకులు తలకి తగిలినప్పుడల్లా మామిడాకులు గుండెల్లో గుచ్చినట్టుండేది. అంతే ఆ రోజునుండి మామిడాకులకీ మాకు కనక్షనే తెగిపోయింది.

ఉగాది శుభాకాంక్షలు.

కృకీలు

నాడు నా కోసం ప్రపంచాన్నే ఎదిరిస్తానన్నావు,
నేడు నువ్వే నా ప్రపంచమంటున్నావు.

లుంగీ పోయి నిక్కరు వచ్ఛే ఢాం..డాం…ఢాం.

తొమ్మిదేళ్ళ క్రితం అహ్మదాబాదుకి ఉద్యోగంలో చేరటానికి వెళ్ళేంత వరకు నన్ను నేను ఒక సెక్యులరిస్ట్ గా ఊహించుకుని గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. స్నేహితుల్లో ముస్లిములు, క్రిస్టియన్లు ఇంకా అనేక ఇతర మతాల వారుండటంతో నాలో నేనే గర్వపడేవాడిని. అయితే అహ్మదాబాదు లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే గర్వమంతా అణిగిపోయింది. దీనికంతా కారణం ఒక లుంగీ. పొట్ట బొడిస్తే హిందీ ముక్క రాని నేను ఎట్టకేలకు సిటీ అంతా తిరిగి ఆఫీసులో ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్నాను. ఉద్యోగంలో చేరేటప్పుడు నా దగ్గర ప్రతిజ్ఞ (అదో ప్రొసీజరులే) తీసుకున్నపెద్దాఫీసరు నాకు షేక్ హ్యాండిచ్చి ఒకటే మాట చెప్పాడు. “నువ్వు హిందువయితే నది (సబర్మతికి) కి పడమర వైపు ఇల్లు తీసుకో, ముస్లిం అయితే నదికి తూర్పు వైపు తీసుకో” అని. ఈ మాటలిన్నాక నేనాయన్ని ఏమనుకోవాల? ఈడి ముండ మొహాన ఎండ గాయ,ఈ ఊర్లో ఇట్ట అడుగు బెట్టామో లేదో హిందువనీ ముస్లిమనీ గొడవలు పెట్టేటట్టు ఉన్నాడు మహానుభావుడు అనుకున్నాను. బుద్ది గా ఆయనమాట ఆనాడు వినుంటే, ఎన్నో భయానక అనుభవాలు తప్పిపోయిఉండేవి. మతకలహాలప్పుడు, తిండినిద్రా కరువయ్యుండేది కాదు. చీమ చిటుక్కుమన్నా గుండె ఝల్లుమనేది కాదు. చాకు పట్టుకోవటం కూడా సరిగా రాని మాకు పెద్ద పెద్ద కత్తులు, బరిశలు ఇచ్చి, ఎవరైనా మన సొసయిటీ మీద దాడి చేస్తే అందరం కల్సి వాళ్ళతో పోరాడాల అని చెప్పిన ఇంటి ఓనరు. చీపురు కట్ట పెట్టే దగ్గర ఈ కత్తులు బరిశలు పెట్టాల్సి వచ్చింది కదరా దేవుడా అని వాటిని చూసినప్పుడల్లా, మేము ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం. ముస్లిం పేరున్న ఓ హిందు స్నేహితుడి వల్ల ఒకనాడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం. అలాగే మేము ఈ పాత బస్తీ నుండి మకాం ఎత్తేసి సబర్మతి నదికి పడమరవైపుకి మార్చినప్పుడు మమ్మల్ని వదలలేని రజాక్ అనే ముస్లిం స్నేహితుడిని రాజు అని అందరినీ నమ్మించి, రెండేళ్ళ తరువాత ఆ నిజం బయటపడి మళ్ళీ అక్కడి నుండి రాత్రికిరాత్రే మకాం ఎత్తేయటం…ఇలా ఒకటని కాదు, కాని మాలో మాకు ఎంత స్నేహమున్నా, చివరకి హిందువులం పడమరవైపు ముస్లిములు తూర్పువైపు స్థిరపడాల్సి వచ్చింది. ఇలా అనేక ఆసక్తికరమైన సంఘటనలు ఎన్ని జరిగినా, ఈ లుంగీ ఎపిసోడ్ మాత్రం జాతి వైషమ్యాల విషయంలో నాకు జరిగిన మొట్టమొదటి తమాషా అనుభవం. అది ఎలా జరిగిందంటే…

కాశీమజిలీ కథల్లో లాగ “ఓ రాజకుమారా! నువ్వే దిక్కు కయినా వెళ్ళు గాని ఆ ఉత్తరం దిక్కుకు మాత్రం వెళ్ళద్దు.” అని పేదరాశి పెద్దమ్మ చెప్పినట్టు ఆ ఆఫీసరు చెప్పింది బుద్దిగా విని పాటించక నదికి తూరుపు దిక్కున, చుట్టూ ముస్లింలు ఉండే ఓ హిందూ సొసైటీలో మిద్దె మీద గది అద్దెకు తీసుకున్నాను. ఓ పదిరోజుల్లోనే ఆయన మాటల్ల్లో వాస్తవం అర్ధమై దిమ్మదిరిగిపోయింది. ఈ పదిరోజుల్లో పరిసరాలు కాస్త పరిచయమయ్యి, ఫ్రీ గా తిరగటం , ఎవరైనా పలకరిస్తే నవ్వటం వంటివి జరగతున్నాయి (మాట్లాడాలంటే భాషరావాలిగా) . ఆంధ్రాలో ఉన్నప్పుడు లుంగీలు ఎక్కువగా కట్టేవాడిని, కనీసం అహ్మదాబాద్ వెళ్ళినతరువాత అయినా షార్ట్ లు వాడదాం అన్న కోరిక మనసులో ఉండిపోయింది. ఇదా కొత్త ప్రదేశం, అసలేపెళ్ళైన ఆడవాళ్ళు కొంగు తలపై నుండి తీయటం లేదు. ఇక అవేసుకుని తిరిగితే ఏమేమి సమస్యలు వస్తాయో అని షార్ట్ లని వాయిదా వేసి లుంగీలే వాడుతున్నాను.

అప్పటికే ఆఊరి అమ్మాయిల అందాలకి పరవశుడ్నైపోయి ఉన్నానేమో. ఓ శలవు దినాన షేవింగ్ చేసుకుని గ్లామరస్ గా తయారయి ఊరిమీద పడదామనుకుని, బ్లేడ్ కోసమని మెట్లు దిగి కిందకు వచ్చాను. మెట్లు దిగేటప్పుడు లుంగీ కాళ్ళకి అడ్డు పడుతుందని పైకి మడిచి కట్టడం అలవాటుకదా. అప్పుడు కూడా అలాగే దిగి, ఈ రోజు ఏఏ పార్కుల్లో తిరిగివద్దామా? అని అలోచించుకుంటూ సొసయిటీ బయట ఉండే ఓ షాప్ కెళ్ళి బ్లేడ్ కొని, తిరిగి సోసైటీలో అడుగు పెట్టాను. అంతే అక్కడో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. నేను ఆశ్చర్యపోయాను. బ్లేడ్ కొనటానికి వెళ్ళేటప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. ఈ పదినిమిషాల్లో ఏమైందబ్బా? అనుకుని. అహ్మదాబాద్ లో మొదటి గొడవ కదా! ఓ గోడ వారగా నుంచుని చోద్యం చూడసాగాను. మనం అక్కడ చూడగలమే గాని, ఆ గుజరాతీభాష ఒక్క ముక్క కూడా అర్ధం జేసుకోలేము కదా. నాకర్ధమైందేమిటంటే, అక్కడ రెండు గ్రూపులు గొడవాడు కుంటున్నాయి. నాకు కాస్త ముఖపరిచయం ఉన్న వాడిది మన బ్యాచ్ అనుకుంటే, ఎదుటి గ్రూప్ వాడిని ఎవరూ పట్టలేకున్నారు. ఎవరినో కొట్టడానికి పై పైకి వస్తుంటే వాడిని అందరూఆపుతున్నారు. చివరికి మన గ్రూప్ లీడర్ కూడా వాడిని శాంతింప జేస్తున్నాడు. అయితే నన్ను కలవర పెట్టిన విషయం ఏమంటే, మాటి మాటికీ నా పేరు ఆ గొడవలో వినపిస్తూ ఉండటం. అందరి చూపులూ నామీదే ఉన్నాయి. నాకాళ్ళు సన్నగా వణకసాగాయి. ఏమైఉంటుందిరా భగవంతుడా? అనుకుంటుండగా నాకు తెలిసిన గ్రూప్ లీడరు నా వైపు వచ్చాడు. ఏంది గొడవ? అని అడిగాను. “ఏందా? ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు నీ లుంగీని పైకి మడిచి ఎందుకు కట్టుకున్నావు? ఇక్కడ ముస్లిములే అట్టా కట్టుకుంటారు. నువ్వు ముస్లిమ్ వో లేక వారి మద్దతుదారుడివో అయ్యుంటావని నిన్ను కొట్టడానికి వస్తూంటే నేనాపాను. సౌత్ ఇండియన్లు అలాగే కడతారు అని అంటే వాడు వినటం లేదు. నాతోనే గొడవపెట్టుకుంటున్నాడు.” అన్నాడు పాన్ మసాలా నవులుతూ. ఇదన్న మాట విషయం. నేను వారి మధ్యకెళ్ళి సర్ధిచెప్పిమాట్లాడాలంటే మనకటు హిందీ రాదు ఇటు గుజరాతీ రాదు. మరో కొత్త గొడవని సృష్టించుకోవటం దేనికనుకుని. నా లుంగీ పైకుందా? కిందికుందా? అని ఓ సారి చూసుకున్నాను. “సరే నువ్వెళ్ళు నేను చూసుకుంటాలే, బయట మాత్రం లుంగీని ఎగకట్టకు” అని అనటంతో, సరే కొట్టుకుచావండి అనుకుని మెల్లగా నా రూంకి వెళ్ళిపోయాను. అయితే ఈ సారి మెట్లెక్కేటప్పుడు లుంగీ పైకి మడవలేదు కాని మనసులో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. షేవింగ్ చేసుకున్నానో లేదో గుర్తులేదు కాని త్వరగా తయారయి, బస్ ఎక్కి లాల్ దర్వాజా మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ ఓ అరడజను షార్ట్ లు కొని సాయంత్రానికి తిరుగుముఖం పట్టాను.ఆహా నాచేత షార్ట్లు వేయించటానికి ఆ పైవాడు హిందు ముస్లింల గొడవలు రేపాడే అనుకుని, ఆ రోజునుండి షార్ట్ లు వేసుకుని కులకటం మొదలుపెట్టాను.అవి మోకాళ్ళ పైకి ఉండి అర్ధనగ్నంగా కనిపిస్తూఉన్నా ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేకుండాపోయింది. అంతే ఆనాడు విప్పిన లుంగీ మళ్ళీ కట్టనే లేదు అహ్మదాబాద్ లో.అలా లుంగీ పోయి నిక్కరు వచ్ఛే ఢాం..డాం…ఢాం.

కృకీలు

నీలో నన్ను చూడాలనుకున్నాను,
నాలో నన్నే పోగొట్టుకున్నాను.

మనసు దోచుకున్న తెలుగు కీచకుడు

(కీచక వేషధారి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు మరియు విరాటరాజు పాత్రధారి)

వసంత కాలం ఆరంభమైందంటే చాలు, కళలు పురివిప్పి నాట్యం చేస్తాయి అహ్మదాబాద్ లో. దక్షిణ భారతదేశం లో పుట్టి జగమంతా వ్యాప్తి చెందిన భరతనాట్యానికి గుజరాత్ లో జీవం పోసింది గురు శ్రీమతి ఇలాక్షి బెన్ ఠాకోర్. “నృత్యభారతి” సంస్థని 1960 లో స్థాపించి భరతనాట్యానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి కొన్ని వందలమంది నృత్యకారుల్ని తయారుచేసింది . కళ కే అంకితమైన ఈ సంస్థను ఇప్పుడు పాత కొత్తల మేలి కలయికలతో, అనేక కొత్త నృత్యరీతులు కనుగొని సరికొత్త కోణాలను ఆవిష్కరించిన ఆమె కుమారుడు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ మరియు నృత్యకారుడు శ్రీ చందన్ ఠాకూర్ సమర్ధవంతంగా నడిపిస్తున్నారు.

(గురు శ్రీ చందన్ ఠాకోర్)

ప్రతి సంవత్సరం వసంత కాలారంభంలో మూడు రోజులపాటు కనులవిందుగా జరిగే ఈ నృత్య కార్యక్రమాలకు మన దేశంలోని ఇతర నృత్యకారుల్ని సగౌరవంగా ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా ఈ సారి చెన్నై నుండి చిదంబరం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అధినేత శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ మరియు ఆమె శిష్యురాళ్ళు, ఒరిస్సా , నృత్యాయన్ నుండి శ్రీ దుర్గా చరణ్ రణబీర్ మరియు వారి విద్యార్ధులు…..ఇక ఆడిటోరియం ని దద్దరిల్లజేసి, అందరి చేత ఔరా! అనిపించుకున్న శ్రీ బాల త్రిపుర సుందర కూచిపూడి నాట్య కళాక్షేత్రం, విజయవాడ నుండి గురు శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ మరియు వారి తోటి నృత్యకారులు. మీడియా కూడా వీరిగురించి అద్భుతంగా వ్రాసింది. అహ్మదాబాద్ లో ఇలాంటి కార్యక్రమాలు రాత్రి భోజన సమయం దాటిన తరువాత మొదలవుతాయి. ఠాగూర్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమం లో మొదటి రోజు 20-2-08 శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ గారి శిష్యురాళ్ళు అసలు క్లాసికల్ డాన్స్ అంటే ఏమిటో అందరికీ రుచి చూపించారు. ముఖ్యంగా శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ గారు గంగానది థీమ్ మీద కొరియోగ్రఫీ చేసిన “ప్రవాహాంజలి” చెప్పుకోదగ్గది. గంగానది ఒక్కోదగ్గర ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మరోదగ్గర రౌద్ర రూపం కలిగి ఉంటుంది..ఇలా ఎన్నో రూపాలు. కాని గంగ “The river of wisdom , neither forgetting the roots nor the destination.” ఈ భావంతో సాగిన భరతనాట్యం ఆద్యంతమూ అద్భుతంగా జరిగింది.”అబ్బా భలే చేసారు వీళ్ళు.”, “ఎంతైనా భరతనాట్యం చూడాలంటే సౌత్ ఇండియన్స్ చేస్తేనే చూడాలి.” అనే కామెంట్స్ వినిపించాయి రాత్రి 11 గంటలప్పుడు కార్యక్రమం ముగిసిన తరువాత. “రేపు రాత్రి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారి ట్రూప్ చే కూచిపూడి నృత్యరూపకం.” అని అనౌన్స్ చేసారు ముగింపులో .

శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్

(అద్బుత భంగిమలో ఉన్న ఈ నర్తకి వయస్సు 14 సంవత్సరాలు!!)

ఇక ఆ పక్క రోజు ఏం జరిగిందో చెప్పటానికి మాటలు చాలవు. రాత్రి 9 గంటలకు శంఖారావం తో మొదలుపెట్టి “కీచక వధ” కూచిపూడి నృత్యరూపకం, రెండు గంటలు నడుస్తుంది అని అనౌన్స్ చేసినప్పుడు. ఎరక్కపోయి వచ్చామురా! అన్నట్టు గుసగుస లాడుకున్నారు ఆడియన్స్. కూచిపూడి అంటే ఏదో భరతనాట్యం టైప్ లోనే ఏ పళ్ళెంలోనో..దీపాలు పట్టుకునో డాన్స్ ఉంటుందనే అనుకున్నారు చాలామంది. విరాట రాజు కొలువు కి భీముడు(నిజంగా భీముడు లాగే ఉన్నారాయన ఎవరోగాని) వచ్చి తన గురించి పరిచయం చేసుకునే సమయంలో ఆయన చేసిన నృత్యం చూసి ప్రేక్షకులు నోళ్ళు తెరిచారు. ధర్మరాజు, నృత్యమంటే ఇలా ఉండాలి అన్నట్లు గా చేసిన అర్జున పాత్రధారి, ద్రౌపది, గాంధారి, విరాటరాజు, సంగీత కళాకారులు…ఇలా అందరూ న్యాయం చేసి కూచిపూడి పేరు నిలబెట్టారు. ఇక కీచకుడి గురించి ఎంత పొగిడినా తక్కువే…ఆ హావభావాలు, అలవోకగా చేసే నృత్యం, బాడీ లాంగ్వేజ్, అభినయం. దానికి తోడు వీరందరికీ ఎవరి తత్వానికి తగ్గట్లుగా వారికి గాత్రం అందించిన గాయకుడు. నటనలో, నాట్యం లో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, కాని దాదాపు వేయి మంది ప్రేక్షకులు మూడు గంటలు ఊపిరి బిగపట్టుకుని చూసారంటే మాత్రం దానికి కారణం కీచక వేషధారి గౌరవనీయులు శర్మ గారే. సభలో పాండవులని మొదటి సారి చూసినప్పుడు వీరు తమ హావభావాలతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు. అద్భుతమైన టాలెంటు తో వీరు చేసిన నృత్యవిన్యాసాలు అందరినీ ఆశ్చర్యానందాలతో ముంచెత్తాయి. నృత్యరూపకం పూర్తయినవెంటనే ప్రేక్షకులందరూ లేచి నిలుచుని హాలుని చప్పట్లతో మారుమ్రోగించారు. ఇలా నుంచుని గౌరవించటం నేనిక్కడ చూడటం ఇదే మొదటిసారి. తరువాత శ్రీ శర్మ గారు ” I am poor … in english…” అని మొదలుపెట్టి “I would like to tell you about my feelings..but.. due to language problem..I am unable to express..my thoughts.” అని వినమ్రంగా అనటంతో సభ మళ్ళీ హర్షాతిరేకంతో నిండి పోయింది. స్టేజ్ ని గడ గడ లాడించిన కీచకుడితడేనా అనిపించేంత సాధారణం గా మారిపోయింది శ్రీ శర్మ గారి శరీర భాష. వీరు వెంటనే అహ్మదాబాదు విడిచి వెళ్ళిపోయినా…మూడవరోజు రాత్రి జరిగింది వీరికి అసలు సత్కారం. ఆ రోజు రాత్రి కార్యక్రమాలను మొదలుపెడుతూ యాంకర్ ఇలా అంది “ఈ స్టేజ్ ఇప్పుడు ఖాళీగా ఉన్నా…ఇంకా కీచకుడు తిరుగుతున్నట్లుగానే ఉంది కదా మీ అందరికీ?” అంతే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది మరోసారి.

గురువు గారు! మీకు పాదాభివందనాలు.

సామెత - బ్లామెత

సామెత

“దానము అయితే ఇవ్వలేను, దండము అయితే పెట్టగలను.”

 

బ్లామెత

వ్యాఖ్య అయితే వ్రాయలేను, హిట్టయితే కొట్టగలను.

 

సామెత

“మొగుడ్ని కొట్టి మొగసాలెక్కినట్లు”

బ్లామెత

బ్లాగుని తిట్టి కూడలికెక్కినట్టు.

 

సామెత

“తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్టు.”

బ్లామెత

వ్యాఖ్య ముదిరి టపా అయినట్టు.

 

సామెత

“యధా రాజా తధా ప్రజ”

బ్లామెత

యధా బ్లాగు తధా హిట్లు

 

సామెత

“అడుసు తొక్కనేల? కాలు కడగనేల?”

బ్లామెత

అనామక వ్యాఖ్య రాయనేల? అనవసరంగా తిట్లు తిననేల?

(ఈ బ్లామెతని జ్యోతిగారు, ఈ బ్లాగులో వ్యాఖ్యగా ఇచ్చారు.)

 

సామెత

 

 

“ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి.”

బ్లామెత

ఎగిరెగిరి రాసినా అన్నే హిట్లు, ఎగరకుండా రాసినా అన్నే హిట్లు

 

కృకీలు

imagesca65ip8q.jpg

వృద్ధాశ్రమాల నిండా ఆశతో గీసిన చిత్రాలు,
అన్నీ… తప్పిపోయిన కొడుకులవే.

ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి.

ఈ చిత్రంలో తెల్ల గీతలుగా కనిపించేవి మాత్రమే ఒంటెలు. నల్లటివి వాటి నీడలు మాత్రమే. ఇది 2005 సంవత్సరానికి గాను, అత్యుత్తమ ఛాయా చిత్రాలలో ఒకటి గా ఎన్నికైందట. చిత్రంగా ఉంది కదూ ఈ చిత్రం.

శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు. ” అన్న నానుడిని నిజం చేస్తూ, మనిషన్న తరువాత రోజులో కనీసం అరగంటయినా మరొకరికి సేవ చేయాలని పిలుపునిచ్చి, సాంకేతిక సహాయం అనే చాట్ రూం ద్వారా నిస్వార్ధం గా సేవలందిస్తూ… రాష్ట్రంలో కంప్యూటర్ అక్షరాశ్యతా ఉద్యమానికి ఊపిరిపోస్తూ, ఎందరికో స్పూర్తినిస్తున్నకంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి తెలుగు బ్లాగుల తరపున జన్మదిన శుభాకాంక్షలు.


| View Show | Create Your Own

పుట్టిన తేది మార్చి, ౩

కృకీలు

నాడు నువ్వే లోకం.
నేడు నువ్వేలోకం?

సామెత - బ్లామెత

సామెత

“సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు.”

బ్లామెత

“బ్లాగరు బ్లాగరు రాసుకుంటే హిట్లు రాలినట్టు.”

 

 

సామెత

“కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు”

బ్లామెత

“కొత్త బ్లాగ్గాడు నెట్ వదలనట్టు”

 

సామెత

“ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం”

బ్లామెత

“హిట్టూ లేదు వ్యాఖ్యా లేదు, బ్లాగు పేరు సూపరుహిట్టు”

 

 

సరదాగా…